21 February 2018

రైతుల‌ను ఆదుకుంటాం

- ప్ర‌తి ఏటా రైతుల ఖాతాల్లో రూ.12,500
-  ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ 
ఒంగోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం ప్ర‌కాశం జిల్లా లింగంగుంట వ‌ద్ద రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌ని, సాగునీరు అంద‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు భ‌రోసా క‌ల్పించారు. పంటలు చేతికందక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టిడిపి ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, చంద్రబాబునాయుడు రైతు ద్రోహి అని విమర్శించారు. అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల ప్రస్తావన వస్తే వాటిపై స్పందించాల్సింది పోయి అపహాస్యం చేస్తూ మాట్లాడారన్నారు. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.  రైతులకు సాగు నీరు అందటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అందుకే ప్రాజెక్టుల విషయంలో అనవసర గందరగోళాన్ని సృష్టించి జాప్యం చేస్తున్నారని చెప్పారు.  మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారం లోకొస్తే పంటల సాగుకు ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కోసం ప్రతి రైతు ఖాతాలో రూ.12,500 నగదును జమ చేస్తామని హామీ ఇచ్చారు. మండల స్థాయిలో కోల్డ్‌స్టోరేజీ గోడౌన్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతుకు గిట్టుబాటు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికలతో రూ.3 వేల కోట్లు మార్కెట్‌ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపేందకు కేంద్రం సాయంతో రూ.4 వేల కోట్ల పరిహారనిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు.  వైయ‌స్ జ‌గ‌న్ హామీతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

No comments:

Post a Comment