2 January 2018

ఏం వెలగబెట్టారని నీకు ఓటు వేయాలి బాబూ ?


  • పూజలు చేయొద్దని.. మీరు ఆశీర్వాదం పొందుతారా
  • 31వ తేదీ ఒక్కరోజే రూ.230 కోట్ల మద్యం విక్రయాలు
  • టీడీపీకి ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలా..?
  • లోకేష్‌ను సీఎం చేసేందుకు దుర్గగుడిలో తాంత్రిక పూజలు
  • తమిళనాడు పూజారులతో అర్థరాత్రి పూజలు 
  • విదేశీ పర్యటనలు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విజయవాడ: జనవరి 1వ తేదీన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయవద్దని జీఓ జారీ చేసిన చంద్రబాబు తానెందుకు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో అంబటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి ఉండవల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం, దుర్గగుడి అర్చకులతో ప్రత్యేక ఆశీర్వాదం పొందారన్నారు. డిసెంబర్‌ 31వ తేదీ దేవాలయాల్లో పూజలు చేయవద్దు కానీ మద్యం షాపు బ్రహ్మాండంగా తెరిచిపెట్టారన్నారు. 31వ తేదీ అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిపించి రూ.230 కోట్ల మద్యం తాగించారన్నారు. ప్రజలకు తెలుగు పండుగ కాదని దేవాలయాలు తెరవనివ్వలేదు కానీ బార్లకు మాత్రం అర్ధరాత్రి వరకు నడిపించారన్నారు. అంటే సామాన్యులకు ఒక న్యాయం.. చంద్రబాబుకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు.
విచిత్రంగా బాబు మాటలు..
వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలు గెలుస్తుందని, ఏదో ఒకటి రెండు చోట్ల ఓడిపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు మాట్లాడడం విచిత్రంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కష్టానికి ప్రతిఫలంగా కూలీ కింద ప్రజలు ఓట్లు వేయాలని, ఓట్లు వేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. 68 సంవత్సరాల వయస్సులో ఇంటికి పెద్ద కొడుకులా పనిచేస్తున్నాను అంటున్నారు. చంద్రబాబుకు మతిస్తిమితం ఉందో లేదో అర్థం కావడం లేదని అంబటి అన్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రజలకు ఏం చేశారని ఓట్లు వేయాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ కడితే బయట 2 అంగుళాల వర్షం పడితే వాటిల్లో 5 అంగళులా నీరు నిలుస్తుందన్నారు. రుణాలు మాఫీ ప్రక్రియను పూర్తి చేశారా..? పోలవరానికి సమా«ధి కట్టినందుకు ఓటు వేయాలా..? ఓట్లకు రేటు పెట్టి కొనే పరిస్థితి తీసుకువచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొన్నందుకు, నలుగురిని మంత్రులను చేసినందుకు ఓట్లు వేయాలా..? దేనికి మీకు ఓట్లు వేయాలో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. 600ల వాగ్ధానాలు ఇచ్చి పట్టుమని పది కూడా నెరవేర్చని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని, మీడియాను అడ్డం పెట్టుకొని గప్పాలు కొట్టుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు ఓట్లు వేయడానికి కాదు.. బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 

అధికారంలోకి రావాలని మళ్లీ కుట్రలు..
చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు చేశారని అంబటి ఆరోపించారు. పండితుల సలహా మేరకు తమిళనాడు నుంచి పూజారిని రప్పించి తాంత్రిక పూజలు చేశారన్నారు.  ఈ విధంగా చేసినందుకు ఓట్లు వేయాలా..? ప్రజలను మభ్యపెట్టి మరోసారి గెలవాలనే కుట్రతో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చకుండా.. ఓటుకు నోటు అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఏదో విధంగా అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్ప మరొకటి లేదన్నారు. మీరు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని బాగు చేశానని అనుకుంటే ఓట్లు కొనకుండా ఎన్నికలకు వెళ్లగల దమ్ముందా అని నిలదీశారు. ఇసుక, మట్టి నుంచి అన్నింట్లో దందాలు చేసి వేల కోట్లు కొల్లగొట్టి వాటి ద్వారా అధికారంలోకి రావాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటు వేయడానికి ప్రజలంతా సిగ్గుతో ఉన్నారు. కాకపోతే డబ్బులు విచ్చల విడిగా పంచి దౌర్జన్యం చేయాలనే కుట్రలు పన్నుతున్నారన్నారు. సీఎం అయిన తరువాత ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు. ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసినా సమాధానం లేదన్నారు. వందల కోట్లు సమ్మిట్‌ల కోసం ఖర్చు చేసినా కనీస పరిశ్రమలను కూడా తీసుకురాలేకపోయారన్నారు. రేనుగుంటలో సెల్‌కాన్‌ సంస్థ వస్తుందని అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. కానీ ఆ కంపెనీపై హైదరాబాద్‌లో కేసు నమోదైందన్నారు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును అన్ని స్థానాల్లో గెలిపిస్తారని డాంబికాలు పలకడం.. విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కాదు.. డిపాజిట్లు గల్లంతయితాయన్నారు. 

No comments:

Post a Comment