30 December 2017

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బాబు ఏమన్నారు?


– తంబళ్లపల్లి బహిరంగ సభలో వైయస్‌ జగన్‌
– ప్రత్యేక హోదా సంజీవిని, 15 ఏళ్లు హోదా కావాలన్నారు
– ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ 
– నాలుగేళ్ల బాబు పాలనలో బ్యాంకుల నోటీసులు మాత్రమే ఇంటికి వచ్చాయి
– ప్రజలను మోసం చేసే చంద్రబాబు పాలన మనకు అవసరమా? 
– బీసీల మీద నిజమైన ప్రేమ చూపించింది వైయస్‌ఆర్‌ ఒక్కరే
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను చదివించే బాధ్యత నాది
–పొదుపు సంఘాల రుణాలు అక్కచెల్లెమ్మల చేతికిస్తాం
– ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తా
– హంద్రీనీవా నీరు తీసుకొచ్చి చెరువులు నింపుతా
– చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా

చిత్తూరు: చంద్రబాబు పాలనను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి పదవి కోసం తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిలబడి చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారని, 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి మాట తప్పారని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఇలా మోసం చేసే వ్యక్తిని పొరపాటున మళ్లీ ఎన్నుకుంటే రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం ఉండదన్నారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, నవరత్నాల్లాంటి పథకాలను అమలు చేసి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తానని వైయస్‌ జగన్‌ హామీ  ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 47వ రోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

– వేల మంది నాతో పాటు అడుగులో అడుగు వేశారు. వేలాది మంది ఎండను ఖాతరు చేయకుండా నడిరోడ్డుపై నిలబడ్డారు. చిక్కని చిరునవ్వుతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
– నాలుగేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ పరిపాలన కొనసాగుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని, సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తన కార్యకర్తలకు ఉద్భోద చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరంతా చూశారు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నాను.
– నాలుగేళ్ల క్రితం ఈ పెద్ద మనిషి ఏమన్నారు. చంద్రబాబు పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదే పెద్ద మనిషి ఇదే తిరుపతిలోనే వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏమన్నారు. ప్రత్యేక హోదా సంజీవని, 15 ఏళ్లు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. కాస్తోకూస్తో ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. ఇవాళ డిగ్రీ అయిపోతే పిల్లొడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగాల కోసం చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు వస్తాయి. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఇదే ప్రత్యేక హోదా తీసుకువచ్చాడా?
– ఎన్నికలప్పుడు ఇదే పెద్దమనిషి ఏం చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తామన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఇంటింటికీ రూ.90 వేలు బాకీ పడ్డాడు.
– అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చాక మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు. గతంలో ఇంటికి రూ.60, 70 వచ్చేది. ఇప్పుడు రూ.500, 1000 వస్తుంది.
– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం,కందిపప్పు, కారంపొడి, పసుపు, చక్కెర, కిరోసిన్‌ వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇవాళ రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప వేరేవి దొరకడం లేదు. చంద్రబాబు మోసం చేయడంలో ఏస్థాయికి చేరాడంటే..ఇటీవల చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేశారు.  ఈ మాల్స్‌లో హోల్‌సెల్స్‌రేట్ల కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. చంద్రబాబు మంత్రులు మాత్రం మార్కెట్‌ కంటే 40 శాతం తక్కువకు అమ్ముతున్నామని చెబుతున్నారు. ఇది మోసం కాదా?
– బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇవాళ బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. బాబు చేసిన రుణమాఫీ పథకం చివరకు వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా?.
– ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్నాడు. నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా?
–చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశాడు. ఆ పార్టీ మేనిఫెస్టోలో అన్ని కూలాలను దగా చేశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశాక..ఇలాంటి పాలన కావాలా అని అడుగుతున్నాను. ఇలా మోసం చేసే వాడికి పొరపాటున మళ్లీ అవకాశం ఇస్తే రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదాన్ని మరిచిపోతారు. మీరంతా చిన్న చిన్న మోసాలను నమ్మరని, రేపు ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు. ఒక బెంజీ కారు ఇస్తానంటాడు. ఈ వ్యవస్థ మారాలంటే ఒక్క వైయస్‌ జగన్‌తో సాధ్యం కాదు. మీరంతా వైయస్‌ జగన్‌కు తోడుగా నిలవాలి. ఏదైనా హామీ ఇస్తే అది నెరవేర్చకపోతే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాలి. అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది.
– రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వ చ్చాక మనం ప్రకటించిన నవరత్నాలను కొన్ని విషయాలు చెబుతున్నాను. ఇందులో ఏమైనా సూచనలు,సలహాలు ఇవ్వాలన్న నేను స్వీకరిస్తాను.
–ఇవాళ పేదవాళ్లు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉందా? గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటుంటారు. నాలుగు కత్తెర్లు ఇస్తే అది బీసీలపై ప్రేమా? పేదవాళ్లపై, బీసీలపై నిజమైన ప్రేమ చూపింది ఒక్క మహానేతనే. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చారు. మహానేత పాలనలో ప్రతి పిల్లాడికి భరోసా ఉండేది. ఇంజనీరింగ్, డాక్టర్‌ ఇలా పెద్ద పెద్ద చదువులను తాను చదవిస్తానని వైయస్‌ఆర్‌ భరోసా ఇచ్చారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ ఇంజనీరింగ్‌ చదివే పరిస్థితి ఉందా? ఏడాదికి ఇంజనీరింగ్‌ ఫీజు లక్ష పైగా ఉంది. ప్రభుత్వం ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు ఆ పేదవాళ్లు ఎక్కడి నుంచి కడుతారు. పేదవాడికి చదువుకునే పరిస్థితి లేదు. ప్రతి పేద కుటుంబానికి తోడుగా ఉండేందుకు నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి. పూర్తిగా డబ్బులు నేను చెల్లిస్తాను. ఇంజీనీరింగ్, డాక్టర్లు చదివే విద్యార్థులకు మెస్‌ చార్జీలు, హాస్టల్‌ చార్జీలకు అయ్యే ఖర్చు కోసం ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తాను. చిన్న పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు జమా చేస్తాం. మన తలరాతలు మారాలంటే ఆ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నారు. ఇదీ బీసీలపై ఉన్న ప్రేమంటే.
– ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెబుతున్నాను.  చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్లుకు ఇచ్చే సొమ్ము మాత్రం పెంచుతారు. గతంలో పోలిస్తే సిమెంట్, ఇనుము, అల్యూమినీయం రేట్లు తగ్గాయి, అయినా కాంట్రాక్టర్లకు అంచనాల పేరుతో డబ్బులు పెంచుతారు. కానీ అవ్వతాతలకు ఇచ్చే పింఛన్‌ డబ్బులు పెంచడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక 45 ఏళ్లకే పింఛన్‌ఇస్తానని, ప్రతి నెల రూ.2 వేల చొప్పున పింఛన్లు ఇస్తానని మాట ఇస్తున్నాను. పేదరికంలో ఉండి పనులకు వెళ్తేనే కడుపులు నిండే పరిస్థితి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో ఉంది. వారికి తోడుగా ఉండేందుకు పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాను. 
– ప్రతి పేద వాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇదే తంబళ్లపల్లిలో 29 వేల ఇల్లు కట్టించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి, ఆ అక్కాచెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెబుతున్నాను. ఆ ఇల్లు బ్యాంకుల్లో పెట్టి రుణం కూడా పొందే వీలు కల్పిస్తాం.
– పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెమ్మలకు చెబుతున్నాను. మన ప్రభుత్వం వచ్చాక ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా నాలుగు దపాల్లో మాఫీ చేసి, ఆ డబ్బు ఆ అక్కా చెల్లెమ్మలకు ఇస్తానని మాట ఇస్తున్నాను.
–టమోటాలు 35 కేజీలు రూ.100కు కొనే నాథుడు లేడు. 44 కేజీల బస్తా ఇవాళ రూ.1200 అడుగుతున్నారు. మన జిల్లాలో ఉన్న చెరుకు సహకార ఫ్యాక్టరీలు చంద్రబాబు పాలనలో మూతపడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.57 కోట్లు ఇచ్చి చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించారు. మళ్లీ మనఖర్మ కొద్ది చంద్రబాబు సీఎం కావడంతో ఆ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. పాడి ఉన్న ఇంటా సిరులకు కొదువ ఉండదట. ఇదే చంద్రబాబు హయాంలో హెరిటేజ్‌ అనే సంస్థ పెట్టి రైతుల నుంచి తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ప్రతి రైతుకు చెబుతున్నాను. పొరుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్‌ సంస్థలకు పాలు అమ్మితే లీటర్‌కు 4 రూపాయాలు ఎక్కువగా ఇస్తారు. ఇ దే మన రాష్ట్రంలో ధరలు తగ్గిస్తున్నారు. ఎందుకో తెలుసా హెరిటేజ్‌ సంస్థకు లాభం చేకూర్చేందుకు. అదే మన ప్రభుత్వం వచ్చాక ప్రతి లీటర్‌కు రూ.4 పెంచుతానని హామీ ఇస్తున్నారు.
–తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ కారణంగా కాళ్లు సొట్టపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీనీవా పనులు పూర్తి చేయడం లేదు. హంద్రీనీవా నీరు తెచ్చి ప్రతి చెరువును నింపుతానని మాట ఇస్తున్నాను.  రాబోయే రోజుల్లో ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వమని కోరుతున్నాను. మీ బిడ్డ పాదయాత్రగా బయలుదేరారు. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాను. 

No comments:

Post a Comment