31 May 2016

మొదట నుంచి కాసుల్ని నమ్ముకొని నీచ రాజకీయాలు చేస్తున్నడి ఎవరు

  • విలువల్ని తుంగలోకి తొక్కి వ్యవహరిస్తున్న బాబు
  • చివరి నిముషం దాకా నాలుగో అభ్యర్థి కోసం ప్రయత్నం
  • ఎన్నికలు అంటేనే డబ్బుల వ్యవహారంగా చంద్రబాబు మేనేజిమెంటు 

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ చివరి రెండు రోజుల పాటు  చంద్రబాబు చేసిన ప్రయత్నాలు చూసి ప్రజాస్వామ్య వాదులు ఆశ్చర్యపోతున్నారు. బలం లేకపోయినా నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు విఫలయత్నం చేశారు. చివరకు పరువు పోతుందన్న భయంతో వెనుకడుగు వేశారు.
     

రాజ్యసభ కు ఎన్నిక అవ్వాలంటే 36 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాతినిధ్య ఓటు కావాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలంటే 108 మంది ఎమ్మెల్యేల బలం తప్పనిసరి. వాస్తవానికి టీడీపీకి అధికారికంగా ఉన్న బలం 102, ఇద్దరు స్వతంత్ర్య సభ్యులు, నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో కలుపుకొంటేనే ఈ సంఖ్య సమకూరుతోంది. అంటే ముగ్గురిని గెలిపించుకోవటానికే బొటా బొటీ బలం అన్నమాట.
చివరి దాకా అడ్డదారి ప్రయత్నాలు
      వైయస్సార్సీపీ నుంచి సిగ్గు లేకుండా డబ్బు పెట్టి కొనుగోలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలతో కలుపుకొని మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇందుకోసం చివరి రెండు రోజులు విస్తారంగా మంతనాలు సాగించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. పరిపాలన ను గాలికి వదిలేసి మంత్రుల్ని ఈ పని కోసం పురమాయించారు.
గతమెంతో ఘనకీర్తి
      తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ ఏడాది క్రితం అభ్యర్థిని దింపింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబాబు అండ్ గ్యాంగ్ పక్కాగా దొరికిపోయింది. ఆడియో, వీడియో టేపుల సాక్షిగా చంద్రబాబు బాగోతం ప్రపంచానికి తెలిసి వచ్చింది. వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో దిట్ట అయిన చంద్రబాబు వెంటనే తన అరాచక మెదడుకు పదును పెట్టారు. ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. దీంతో కేసు గండంనుంచి బయట పడ్డారు.
మారని చంద్రబాబు బుద్ది
      అడ్డగోలుగా దొరికిపోయినప్పటికీ చంద్రబాబు బుద్ది మారలేదు. ఎన్నిక ఏదైనా గెలుపు తమదే కావాలంటూ మహానాడు వేదికగా క్యాడర్ కు పిలుపు ఇచ్చారు. ఏ దారిలో అయినా గెలుపు సాధించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అన్నట్లుగా రాజ్యసభ ఎన్నికల్లో సైతం అడ్డదారిలో ప్రయాణించేందుకు తహతహలాడారు. చివరకు దారులు మూసుకోవటంతో తోక ముడిచారు.

ఏపి సీఎం నేరాల‌కు అలవాటు పడ్డారా ?

  • ఓటుకు నోటు కేసులో దొరికినా మారని బుద్ధి
  • రాజ్యసభ సీటు కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎర
  • ఆరోజే శిక్షపడి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు
  • బాబు పాపంలో మోడీ భాగస్వామ్యం కావొద్దు
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా  కూడా  చంద్రబాబుకు ఇంకా జ్ఞాన‌ోదయం క‌ల‌గ‌లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. నేరాల‌కు అల‌వాటు ప‌డిన వ్య‌క్తులు ఎప్ప‌టికీ నేరాలు చేస్తునే ఉంటార‌ని చెప్ప‌డానికి చంద్రబాబే నిద‌ర్శ‌న‌మన్నారు.

అవినీతి సొమ్ముతో అనైతిక రాజకీయాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు త‌ర‌హాలో చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనేందుకు అనైతిక రాజ‌కీయాల‌కు తెర తీశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 50 మంది శాస‌న‌స‌భ్యులు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నార‌ని, 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజ్య‌స‌భ స్థానం గెలుస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. బాబు ఏ ఉద్దేశ్యంతో నాలుగో అభ్య‌ర్థిని పోటీకి దించుతారని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు.  

అప్పుడే శిక్ష ప‌డి ఉంటే...
గ‌తంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష ప‌డి ఉంటే ఈ రోజు ఇలాంటి నీచ రాజ‌కీయాలకు పూనుకునేవారు కాద‌న్నారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు చంద్రబాబు ఒక్కొక్క‌రికి రూ.  40 కోట్లు ఆశ చూపిస్తున్నార‌ని కోటంరెడ్డి  ఫైరయ్యారు.  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీడీపీకి ఓటు వేస్తే రూ. 40  కోట్లు ఇస్తామంటూ బాబు ఆశపెడుతున్నాడని ఆగ్రహించారు. నిస్సిగ్గుగా డబ్బులను ఎరచూపి ఎమ్మెల్యేలను కొనాలని చూడడం దుర్మార్గమన్నారు. 

బాబు పాపంలో ఎలా భాగస్వాములవుతారు..
చంద్రబాబుకు ఇంత డ‌బ్బు ఎక్కడి నుంచి వ‌చ్చింద‌ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్ర‌శ్నించారు. నైతిక‌, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు కావాల‌ని ప‌దేప‌దే చెప్పే న‌రేంద్ర మోడీ..చంద్రబాబు నీచ రాజకీయాలపై స్పందించాలన్నారు. చంద్రబాబు చేస్తున్న పాపంలో ప్రధాని భాగస్వామ్యం కావొద్దని సూచించారు.  బీజేపీకి ఒక సీటు ఇస్తూ చంద్రబాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనైతిక రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. 

30 May 2016

ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో ఎప్పుడు ఏం జ‌రిగింది..!

హైద‌రాబాద్‌) ఓటుకి కోట్లు రూపాయిలు చెల్లిస్తూ చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ దొరికి పోయి ఏడాది కావ‌స్తోంది. ఈ ప్ర‌క్రియ‌లో ఎప్పుడు ఏమి జ‌రిగింది అనేది కాల ప‌ట్టిక ప్ర‌కారం చూద్దాం.


2015, మే 28: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ తనకు రూ. 5కోట్లు లంచం ఇవ్వజూపుతున్నారంటూ ఏసీబీకి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఫిర్యాదు.
 మే 31: సాయంత్రం 5 గంటల సమయంలో మాల్కం టేలర్ ఇంట్లో స్టీఫెన్‌సన్‌కు లంచం అడ్వాన్స్‌గా ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన రేవంత్‌రెడ్డి. నాలుగు గంటల పాటు విచారించిన తర్వాత బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను తరలించిన పోలీసులు
 జూన్ 1: ఉదయం 9 గంటలకు రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన పోలీసులు. వారిని 14 రోజుల పాటు కస్టడీ కోరిన ఏసీబీ. ‘ఓటుకు కోట్లు’ కేసు వివరాలు, రికార్డులు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన ఎన్నికల సంఘం.
 జూన్ 5: రేవంత్‌ను నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన సిటీ సివిల్ కోర్టు.
 జూన్ 7: స్టీఫెన్‌సన్‌తో  చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ‘మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ ఆడియో టేపులు లీక్. అదే రోజు ఏపీ ఉన్నతాధికారులతో చంద్రబాబు అత్యవసర భేటీ. తమ నాయకుడి వాయిస్‌ను ఎడిట్ చేశారంటూ పరకాల ప్రభాకర్ ఆరోపణ.

 జూన్ 8: నల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై సీఎం కేసీఆర్ ఫైర్.. అదే రోజున గుంటూరులో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం.
 జూన్ 9: రేవంత్, సెబాస్టియన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.
 జూన్ 10: కోర్టులో రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం. రేవంత్‌కు కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లేందుకు 12 గంటల అనుమతి.
 జూన్ 10: ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పయనం. తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.
 జూన్ 11: హైదరాబాద్‌లో తన కుమార్తె నిశ్చితార్థానికి 12 గంటల బెయిల్‌పై బయటకొచ్చిన రేవంత్.. సమయం ముగిశాక చర్లపల్లికి జైలుకు తరలింపు. కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయని రేవంత్.

 జూన్ 15: హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన రేవంత్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని విచారించిన ఏసీబీ
 జూన్ 16: విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు.
 జూన్ 19: ఏసీబీ నోటీసులపై పది రోజుల గడువు కోరిన సండ్ర.
 జూన్ 25: ‘ఓటుకు కోట్లు’ కేసు వివరాలు ఇవ్వాలంటూ కోర్టులో రిమైండర్ దాఖలు చేసిన ఈసీ
 జూన్ 30: రేవంత్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
 జూలై 1: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్
 జూలై 3: రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏసీబీ.. పిటిషన్ కొట్టివేత.
 జూలై 5: ఎమ్మెల్యే సండ్రకు మరోసారి నోటీసులు. టీడీపీ కీలక నేత జిమ్మిబాబుకు కూడా జారీ చేసిన ఏసీబీ.
 జూలై 6: ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన సండ్ర. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించి.. తర్వాత అరెస్టు చేసిన ఏసీబీ.

 జూలై 7: సండ్రను కస్టడీకి కోరిన ఏసీబీ.
 జూలై 8: సండ్రను రెండు రోజుల కస్టడీకి అప్పగించిన కోర్టు.
 జూలై 14: సండ్రకు బెయిల్ మంజూరు చేసిన సిటీ సివిల్ కోర్టు.
 జూలై 16: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను విచారించిన ఏసీబీ.
 జూలై 18: వేం నరేందర్‌రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడిని, మరో అనుచరుడిని విచారించిన ఏసీబీ.
 జూలై 24: ఆడియో, వీడియో టేపులపై కోర్టుకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ.
 జూలై 25: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను తమకు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ.
 జూలై 26: ఏసీబీ చేతికి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక. ‘ఓటుకు కోట్లు’ కేసులో స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో టేపులు అసలైనవేనంటూ ఎఫ్‌ఎస్‌ఎల్ తుది నివేదిక.

 జూలై 28: చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ.
 ఆగస్టు 12: చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ.. ప్రతిగా కేటీఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మత్తయ్యను వారు బెదిరించారని ఆరోపణలు. రెండు రోజుల్లో విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం.
 ఆగస్టు 20: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ సచివాలయానికి వచ్చిన ఏపీ పోలీసులు.
 నవంబర్ 21: ఆడియో టేపులపై కోర్టుకు మరో నివేదిక సమర్పించిన ఎఫ్‌ఎస్‌ఎల్.

27 May 2016

తెలుగు తమ్ముళ్లకు పుష్కరాల పండుగ వస్తోంది..

  • గోదావరి పుష్కరాల కథే మళ్లీ రిపీట్
  • క్రిష్ణా పుష్కరాలకు ఇప్పటికీ టెండర్లు నిల్
  • నామినేషన్ పద్దతిలో పనులు దక్కించుకొనేందుకు రింగ్


విజయవాడ: మైక్ దొరికితే చాలు చంద్రబాబు చెప్పే మాట... తాను నిప్పు అని, అవినీతిని ఏమాత్రం సహించను అని ఊదర గొడుతుంటారు. విజయవాడ నడిబొడ్డున జరుగుతున్న వెయ్యికోట్ల అవినీతి బాగోతం చంద్రబాబుకి తెలియదు అని అనుకోవటానికి వీల్లేదు. అయితే ఎప్పటిలాగే దాన్ని కప్పి పుచ్చటానికి ఆయన మార్కు హంగామా ఎలాగూ ఉంటుంది. దీనికి ఇప్పుడు క్రిష్ణా పుష్కరాలు వేదిక కాబోతున్నాయి.
       ఆగస్టు 12 నుంచి క్రిష్నా ఫుష్కరాలు మొదలు కాబోతున్నాయి. అంటే గట్టిగా చూస్తే మూడు నెలల సమయం కూడా లేదు. వీటికి దాదాపు 1250 కోట్ల రూపాయిలు కేటాయించారు. బ్రహ్మాండంగా పుష్కరాలు నిర్వహణ చేస్తామని ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, నాయకులు ఊదర గొట్టేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇంతటి మహాకార్యానికి సంబంధించి టెండర్లు పూర్తిగా దాఖలు కాలేదు. దాదాపు 15వందల పనుల్ని ఈ వందల కోట్ల రూపాయిలతో పూర్తి చేయాల్సి ఉంది.
       వాస్తవానికి ఇంతటి భారీ కార్యక్రమానికి ముందుగానే టెండర్లు రావలసి ఉంటుంది. వాటిలో మెరుగైన సంస్థలు, కాంట్రాక్టర్లను ఎంపిక చేసి అధికారులు పనులు అప్పగిస్తారు. అప్పుడు వాటిని అమలు చేస్తూ అధికారులు లేదా ప్రజా ప్రతినిధులు నాణ్యతను తనిఖీ చేసేవారు. లోపం ఉంటే మార్పు చేసుకొనే వీలు ఉంటుంది. అయితే ఇదంతా తెలుగుదేశం నాయకులకు ఇష్టం లేదు. ఎందుకంటే హోల్ సేల్ గా నిధుల్ని భోం చేసేయటానికి ముందుగానే రంగం సిద్ధం చేసుకొన్నారు. అందుకే టెండర్లు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. టీడీపీ నాయకులు పక్కాగా అమలు చేస్తున్న స్కెచ్ ఇది. టెండర్లు లేకుండా ఉండటంతో అధికారులు వేచి చూసినట్లు నటించి చివరకు..నామినేషన్ పద్దతిలో పనుల్ని చివరి నిముషంలో అప్పగించేస్తారు. అప్పుడు హడావుడిగా పనులు  పై పైన పూర్తి చేసి కోట్లు రూపాయిలు కొట్టేస్తారు.
       ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు పాత్ర కూడా ప్రవేశిస్తుంది. అంటే ఒక నెల తర్వాత చంద్రబాబు పుష్కరాల పనుల తనిఖీ కి వెళతారన్న మాట. అప్పుడు పనులు ఎక్కడివి అక్కడే ఉండటం చూసి అధికారులు మీద అరిచినట్లు, కోప్పడినట్లు హడావుడి చేస్తారు. దీంతో కంగారు పడినట్లుగా అధికార యంత్రాంగం నటించేసి టెండర్ల విధానాన్ని పక్కన పెట్టేసి నామినేషణ్ పద్దతిలో పనులు మొదలు పెడతారు. వారం రోజుల తర్వాత  పచ్చ మీడియాలో వార్తలువ చ్చేస్తాయి. చంద్రబాబు తనిఖీలతో అధికారుల్లో కదలిక, పరుగులు పెడుతున్న పనులు అని బ్యానర్లు కడతారు. దీంతో పూనకం వచ్చినట్లుగా కాంట్రాక్టర్ల దోపిడీ సాగుతుంది. పుష్కరాల తర్వాత పది, పదిహేను రోజులకే పనుల రంగు బయట పడుతుంది.
       ఇదంతా గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ఎపిసోడ్. త్వరలో క్రిష్ణా నది పుష్కరాల్లో ఇదే జరిగే వాతావరణం కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబే కాబట్టి సూపర్ హిట్ స్కెచ్ అనుకోవటం లో తప్పు లేదు కదా..

రాజ్యసభ కు ఆర్థిక నేరగాళ్లను పంపిన ఘనత చంద్రబాబుదే

  • బ్యాంకుల్ని ముంచేసిన వారిని కేంద్రమంత్రులుగా చేసుకొన్నారు
  • టీడీపీ విమర్శల్ని తిప్పికొట్టిన వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అత్యున్నత విద్యావంతుడు అని, ఆయన్ను మించిన విద్యార్హతలుగానీ, మానవీయ విలువలు గానీ ఉన్న వ్యక్తి టీడీపీ ఎంపీల్లో ఏ ఒక్కరూ కూడా లేరని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు.  విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ కేసులేనని టీడీపీ ఒప్పుకుందని ఒక పత్రికా ప్రకటనలో అంబటి పేర్కొన్నారు.విజయసాయి రెడ్డి వంటి మేధావులు, విజ్ఞులు ఒక్కరున్నా రాజ్యసభ గౌరవ సభగా ఉంటుందని కొనియాడారు.
విజయసాయి రెడ్డిని ముద్దాయి అంటున్న టీడీపీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా డబ్బు పంపి.. ఫోన్‌లో సంభాషణలు జరిపి ఆడియో, వీడియో రికార్డింగ్‌లలో అడ్డంగా దొరికిపోయి నేటికి తప్పుంచుకు తిరుగుతున్న దొంగ కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ సీఎం మీద సీబీఐ విచారణ జరుగుతోందని, చంద్రబాబు మీద సీఐడీ విచారణ కూడా జరగడం లేదంటూ ఇంతకు మించిన ఆర్థిక, రాజకీయ నేరగాడు లేడని ఆయన అభివర్ణించారు.
రాజ్యసభకు ఆర్థిక నేరగాళ్లను, మనీ లాండరింగ్‌ నిపుణుల్ని పంపడమే కాకుండా కేంద్ర మంత్రులుగా వారిని నియమించే సంస్కృతి టీడీపీ సొంతమని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేసుకుంటున్న వ్యక్తి అని అభిప్రాయ పడ్డారు.  టీడీపీ రాజ్యసభ సీట్లను అమ్ముకుంటున్న విషయం ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. ఇప్పుడు టీడీపీ ఎంపిక కూడా నిస్సిగ్గుగా డబ్బు ప్రాతిపదికగానే ఉంటుందన్నది అందిరికీ తెలిసిన విషయమేనని చెప్పారు.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద ఉన్న కేసుల గురించి, మారిషస్‌ బ్యాంకుల మోసాల గురించి తెలిసికూడా ఆయన్ను కేంద్రమంత్రి చేయడం టీడీపీకి మాత్రమే సాధ్యమైందని దుయ్యబట్టారు. టీడీపీ పంపే రాజ్యసభ సభ్యుల్ని చూస్తే బ్యాంకుల్ని ముంచేసినవారు, పదవి వచ్చే వరకు ఏనాడూ పార్టీలో కనిపించనివారని విమర్శించారు.

మనీ లాండరింగ్‌ నిపుణులు, పదవుల్ని కొనుగోలు చేసినవారు చాలామంది కనిపిస్తున్నారని చెప్పారు. టీడీపీకి రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత ఏనాడూ లేదని అన్నారు. ప్రజల్లో అభిమానం సంపాదించడం చేతగాక, విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తాను బలంగా ఉన్నానని టీడీపీ నానా గడ్డీ కరుస్తోందని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినవారు.. టీడీపీలో చేరుతున్నవారు, చేరినవారు ప్రజల తీర్పును కాలరాచి కుట్రదారులతో వెన్నుపోటు దారులతో చేతులు కలిపారంటూ మండిపడ్డారు. అలాంటి టీడీపీ ఈ రోజున రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించటమేనని అంబటి రాంబాబు విమర్శించారు.

26 May 2016

వైయస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి

  • వైయస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం
  • పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా

హైదరాబాద్ః రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో , ఢిల్లీలో పార్టీ వాణిని వినిపించి...పార్టీ ప్రాబల్యం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.  ఏపీ అసెంబ్లీలో  పార్టీ నేతలతో కలిసి వైయస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.


ఈసందర్భంగా మాట్లాడుతూ...వైయస్ కుటుంబంతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. తన ప్రాణం ఉన్నతవరకూ వైయస్ కుటుంబంతోనే ఉంటానని అన్నారు. విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. 

పునర్విభజన చట్టంలో పొందు పర్చిన అంశాలను, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తమ అధ్యక్షులు వైయస్ జగన్ రెండేళ్లుగా పోరాడుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వాటిని అమలు పర్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఇక పార్టీ నుంచి తొలి సభ్యునిగా రాజ్యసభకు వెళుతుండడం సంతోషదాయకమన్నారు. 

పార్టీ ఫిరాయింపులు అనైతికం, చట్టవిరుద్ధమని విజయసాయిరెడ్డి అన్నారు. మిగతా రాజకీయ పార్టీలన్నీ అభివర్ణించినట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ముమ్మాటికే రాజకీయ వ్యభిచారమేనని అన్నారు.  రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం  అప్రజాస్వామికమన్నారు. ఫిరాయింపుదారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణే రాజీనామా చేసి ప్రజాతీర్పుకు సిద్ధం కావాలన్నారు. 

25 May 2016

ప్రజల చెంత జననేత

  • పులివెందులలో వైయస్ జగన్ పర్యటన
  • క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
  • సమస్యలపై వినతుల స్వీకరణ

వైయస్సార్ జిల్లా(పులివెందుల):  ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పులివెందులలో  విస్తృతంగా పర్యటించారు. వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు, ప్రజలు నీరాజనం పట్టారు.  రెండ్రోజుల పాటు వైయస్ జగన్ పులివెందులలో కలియతిరిగారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  పలు కుటుంబాలను పరామర్శించి వారిలో ధైర్యం కల్పించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రెండో రోజు పర్యటనలో భాగంగా...ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యాంప్‌కార్యాలయంలో గడిపిన ప్రతిపక్ష నేత స్థానికుల నుంచి వినతులు స్పీకరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులతో అనేక అంశాలపై చర్చించారు. 

24 May 2016

మినీ మహానాడు కాదది మనీ మహానాడు

  • స్పెషల్ ఫ్లైట్లు, ఫైవ్ స్టార్ హోటల్లో బాబు విలాసాలు
  • విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం
  • మహానాడు పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు
  • టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు
హైదరాబాద్ః స్పైషల్ ఫ్లైట్లు, ఫైవ్ స్టార్ హోటల్ లలో విలాసాలు చేస్తూ చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులు త్యాగం చేయాలని మాట్లాడుతూ..మరో పక్క బాబు మాత్రం విచ్చలవిడిగా ప్రజధనాన్ని కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటాడని ప్రజలు బాబుకు ఓట్లేస్తే...ఇచ్చిన వాగ్ధానాలను గాలికొదిలేసి ప్రజల సొమ్మును ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేస్తున్నారని దుయ్యబట్టారు.  తక్షణమే చంద్రబాబు ఫైవ్ స్టార్ హోటల్ ఖాళీ చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. 

మినీ మహానాడుల పేరుతో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అంబటి రాంబాబు ఫైరయ్యారు. మట్టి నుంచి ఇసుక దాకా అంతా దోపిడీయేనని అన్నారు. బ్రాందీ షాపుల ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకొని మహానాడు నిర్వహిస్తున్నారని నిప్పులు చెరిగారు. అది మినీ మహానాడు కాదని మనీ మహానాడు అని అంబటి తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇచ్చిన వాగ్ధానాలను ఏమేరకు అమలు చేశారో చర్చిస్తారని అంతా అనుకున్నారని...కానీ అవన్నీ వదిలేసి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకోవడం విడ్డూరమన్నారు.  వైయస్ జగన్ పై అవాకులు, చెవాకులు పేలడం తప్ప...ఎక్కడ కూడా మహానాడులో రాష్ట్రాభివృద్ధిపై చర్చించిన పాపాన పోలేదన్నారు. 


మహానాడులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల మధ్య తోపులాటలు జరుగుతుంటే...ముఖ్యమంత్రి క్రమశిక్షణ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశంలో ఎంతటి క్రమశిక్షణ ఉందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఎదుటి పార్టీవాళ్లను లాక్కోవడమేనా బాబు మీ క్రమశిక్షణ అని నిలదీశారు. ఇతరులకు నీతులు చెప్పడం మాని..ముందు బాబు క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. కొత్తగా పథకాలను ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ఉండడం సిగ్గుచేటన్నారు. రెండేళ్లుగా రాష్ట్రాన్ని ప్రాజెక్ట్ లు, మట్టి, ఇసుక పేరుతో దోపిడీ చేశారని...ఆఖరికి మినీమహానాడు పేరుతో  వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మనీ మహానాడు వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. 

వైయస్ జగన్ ను కళావెంకట్రావు నీరో చక్రవర్తిగా సంబోధించడంపై అంబటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరు నీరో చక్రవర్తో ఒక్కసారి లోతుగా వెళ్తే అర్థమవుతుందని కళా వెంకట్రావుకు చురక అంటించారు. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు తన నివాసాన్ని పడగొట్టారు. అక్కడి నుంచి  మదీనాగూడ ఫాంహౌస్ కు మకాం మార్టారు. అక్కడ రూ. 2కోట్లు ఖర్చుచేశారు. దాన్ని వదిలేసి  ఫైవ్ స్టార్ హోటల్ కు మకాం మార్చారు. మీకు ఇళ్లే దొరకడం లేదా బాబు.  కోట్లాది రూపాయలు ప్రజల సొత్తును  ఖర్చు చేసి మీరు, కుటుంబసభ్యులు, మీ పరిహారం ఫైవ్ స్టార్ హోటల్ లో నివాసముంటే...నీరో చక్రవర్తి మీరా మేమా అంటూ నిప్పులు చెరిగారు. 

రాష్ట్రం లోటు బడ్జెట్ తో  కొట్టుమిట్టాడుతుంటే ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండాలన్న వ్యామోహంతో బాబు ఉండడం సిగ్గుచేటన్నారు.  విమానాల్లో విదేశాలు తిరుగుతారు. ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటారు. ఇళ్ల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అక్రమ కట్టడంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో నివసిస్తున్నారు. ఇలాంటి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే నమ్మాలా..? అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్ము అంటే ఎందుకు బాబు మీకు అంత చులకనా అని అంబటి పైరయ్యారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను, వారి సొమ్మును దుర్వినియోగం చేయడం తప్ప.... సద్వినియోగం చేయాలన్న ఆలోచనే బాబుకు లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు.. మా కుటుంబం బాగుంటే చాలు అన్న విధంగా చంద్రబాబు ఉండడం దారుణమన్నారు. గతంలో ఎన్టీఆర్ కుటీరంలో ఉండి ప్రజలకు ఆదర్శులుగా నిలిచారని అంబటి గుర్తు చేశారు.  

కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని, మీరే జీవో విడుదల చేసి డ్రామాలు ఆడుతున్నది వాస్తవం కాదా? అని అంబటి ప్రశ్నించారు.  మీకు తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయా బాబు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడమెందుకని పదవికి రాజీనామా చేయాలని బాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆఖరికి మేధావులు, స్వామీజీలకు కూడా రాజకీయాలు అంటగడుతున్నారని దుయ్యబట్టారు.  ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం, స్వామి స్వరూపానందలు అడుగుతుంటే...అందుకు వైఎస్ జగన్ను నిందిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తూ  బాబు కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ కులాలకు ముందుండి తలలో నాలుక లాగా పోరాడుతుంది
వెనుక ఉండాల్సిన అవసరం లేదు. 

బాబు సర్కార్ పై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

  • బాబు చేసిన మోసాలు, అన్యాయాలపై కోర్టుకు వెళదాం
  • పులివెందులలో ప్రజలతో మమేకమైన వైయస్ జగన్
  • ఈసందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్న జననేత
  • వైయస్ రాజారెడ్డి వర్థంతి కార్యక్రమాలకు హాజరు
  • పలు కుటుంబాలకు పరామర్శ

వైయస్సార్ జిల్లా(పులివెందుల): ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందులలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండ్రోజులుగా జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... వైయస్ జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ‘ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. నెరవేర్చడం చేతకాక తోకముడిచి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.  సంక్షేమ పథకాల్లో కోత పెట్టిన చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్ జగన్ మండిపడ్డారు. బాబు చేసిన మోసాలు, ప్రజలకు చేసిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించి న్యాయం పొందుదాం’ అని అన్నారు.

పులివెందుల నియోజకవర్గంలోని లావనూరు, బలపనూరులలో వైయస్ జగన్ వృద్ధులను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించారు.  ఈసందర్భంగా వారు తమ సమస్యలను జననేతకు మొరపెట్టుకున్నారు.  తెలుగుదేశం నేతలు తమ పింఛన్లు తీసేశారని వాపోయారు.  దీనిపై స్పందించిన జననేత.... ‘అవ్వా.. నీ పేరేమిటి.. ఎప్పటినుంచి పింఛన్ రావడంలేదు.. అంటూ అడిగారు. పండు వయసులో ఉన్న వారికి అంతో... ఇంతో వచ్చే ఆర్థిక వనరులను కూడా దెబ్బతీశారని బాబు తీరుపై వైయస్ జగన్ మండిపడ్డారు. అవ్వ,తాతల ఉసురు  తగలకుండాపోదని.. అన్యాయం చేసిన మోసాల బాబుపై కోర్టుకు వెళ్లి న్యాయం పొందుదామని.. అంతవరకు ఓపికపట్టండి అని వైయస్ జగన్ అన్నారు.

 
వైయస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో..
పులివెందులలో సోమవారం ఉదయాన్నే లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైయస్‌రాజారెడ్డి  ఘాట్‌ను వైయస్ జగన్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం నానమ్మ వైయస్ జయమ్మ, పెదనాన్న వైయస్ జార్జిరెడ్డిల సమాధుల వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం వైయస్ రాజారెడ్డి పార్కులో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే భాకరాపురంలో ఉన్న వైయస్‌ఆర్ ఆడిటోరియంలో వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. పాస్టర్లు రెవరెండ్ బెనహర్, మృత్యుంజయరావు, నరేష్‌బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిలమ్మ, వైయస్ భారతిరెడ్డి, పురుషోత్తమరెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, విమలమ్మ, సుగుణమ్మ, వైయస్ వివేకానందరెడ్డి, వైయస్ సుధీకర్‌రెడ్డి, వైయస్ ప్రకాష్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, వైయస్ మనోహర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైయస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, వైయస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వైయస్ మనోహర్‌రెడ్డి సతీమణి, మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొన్నారు. వైయస్ రాజారెడ్డి చేసిన సేవలతోపాటు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోదరి విమలమ్మ వివరించారు.

పలువురిని పరామర్శించిన ప్రతిపక్షనేత  
పులివెందులలో వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ జోసఫ్‌రెడ్డి బావ బాలజోజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు.  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ వైయస్ ప్రమీలమ్మ కూడా జోసఫ్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే శేషారెడ్డి స్కూలు సమీపంలో నివసిస్తున్న ట్రాన్స్‌కో ఏఈ శివనారాయణరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో.. కుమారుడు ధర్మేంద్రను వైయస్ జగన్‌ పరామర్శించారు. అనంతరం సింహాద్రిపురం మండలంలోని కోవరంగుంటపల్లెలో యువజన విభాగం కన్వీనర్ శివారెడ్డి తండ్రి రాచమల్లు రామలింగేశ్వరరెడ్డి ఇటీవలే అనారోగ్యంతో తనువు చాలించడంతో అక్కడకు వెళ్లి శివారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. 

బలపనూరులో ప్రణవ్‌కుమార్‌రెడ్డి ఇటీవల బావికి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. నేపథ్యంలో ప్రణవ్ ఇంటికి వెళ్లి తండ్రి రామగోపాల్‌రెడ్డి, తల్లి అమరావతిలను ఓదార్చారు. ఈ సందర్భంగా బావిలో పడి చనిపోయిన ప్రణవ్‌కు ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 పాయింట్లు వచ్చాయని తల్లిదండ్రులు వైయస్‌ జగన్‌కు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డిల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో ముచ్చటించారు. అనంతరం చవ్వారిపల్లెకు వెళ్లి సర్పంచ్ హరికిశోర్‌రెడ్డిని పరామర్శించారు. హరికిశోర్‌రెడ్డికి గతంలో ఎన్నికల సందర్భంగా ఒక కన్ను దెబ్బతినగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగి మరో కన్నుకు కూడా గాయం కావడంతో చూపును కోల్పోయారు. వైయస్ జగన్‌ను చూడగానే కిశోర్‌రెడ్డి తల్లిదండ్రులు గంగిరెడ్డి, వెంకటనారాయణమ్మ, కిశోర్‌రెడ్డి భార్య సుమతిలు కన్నీటి పర్యంతమవ్వగా.. వైయస్ జగన్ వారిని ఓదార్చారు.

లావనూరులో ఘన స్వాగతం :  
జమ్మలమడుగు నియోజకవర్గంలోని లావనూరులో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ.. జైజగన్ నినాదాలతో హోరెత్తించారు. నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఎమ్మెల్యే ఆది ముఖ్య అనుచరుడు నిరంజన్‌రెడ్డి కోరిక మేరకు జగన్ వారి ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపారు.

 వైయస్ జగన్‌ను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు :
ఎప్పటికప్పుడు సమస్యలపరంగా కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డితో వైయస్ జగన్ చర్చిస్తూ పరిష్కారం చూపగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జమ్మలమడుగు వైయస్‌ఆర్‌సీపీ నేత సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, తాళ్లప్రొద్దుటూరు సర్పంచ్ రామసుబ్బారెడ్డి కలిసి అనేక అంశాలపై చర్చించారు.

23 May 2016

వైయస్ రాజారెడ్డికి జననేత ఘన నివాళి

వైయస్సార్ జిల్లా(పులివెందుల): ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్సార్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పులివెందులకు వచ్చిన జననేతకు పార్టీశ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకునికి నీరాజనం పట్టారు. 

పులివెందుల పర్యటనలో భాగంగా వైయస్ జగన్  తన తాత దివంగత వైయస్ రాజారెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైయస్ రాజారెడ్డి వర్థంతి సందర్భంగా డిగ్రీ కళాశాల రోడ్డులోని రాజారెడ్డి ఘాట్ ను సందర్శించి అంజలి ఘటించారు.  రాజారెడ్డి పార్కుకు చేరుకుని తాత విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు ఆయన చిన్నాన వైయస్ వివేకానందరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
అనంతరం వైయస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన  ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్‌ జగన్‌తో పాటు వైయస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల, వైయస్‌ భారతి, చిన్నాన వైయస్‌ వివేకానందరెడ్డి ,ఎంపీ అవినాష్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. కాగా నేడు, రేపు  రెండ్రోజుల పాటు వైయస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది.

22 May 2016

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రియతమ నేత

ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించిన మహానేత
రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటికి ఏడేళ్లు పూర్తి
ఊహించనివిధంగా సంక్షేమ పథకాలు అమలు
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రియతమ నేత

మాట తప్పని, మడమ తిప్పని మహానేతగా.. పేదలు, రైతుల పక్షపాతిగా కీర్తింపబడిన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి  మనకు భౌతికంగా దూరమై దాదాపు 7 ఏళ్లు పూర్తి కావస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించడంతో పాటు ప్రతి మహిళా లక్షాధికారి కావాలని కలలుకన్నాడు ఆ మహానేత. 2009, మే 20వ తేదీ రెండవ సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 7 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వైయస్‌ఆర్‌పై ప్రత్యేక కథనం.

ప్రజల కష్టాలు చూసి చలించిన మహానేత
కరువు కాటలతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వారి కష్టాలను చూసి చలించి పోయారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని చూసి చలించిపోయారు. ఈ నేపథ్యంలో  2004 ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. ఆ సంతకం చిరస్థాయిగా మిగిలిపోయింది. తర్వాత  సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల ఆశలకు కొత్త ఊపిరులూదారు. వ్యవసాయ రుణాల మాఫీతో రైతుకు ఉపశమనం కలిగించారు. 

లక్షల ఎకరాలు సాగులోకి..
రాష్ట్రంలో ఎడారిగా మారిన పంట పొలాలను సస్యశ్యామలం చేశారు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులను చేపట్టి లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. పోలవరం, చేవెళ్ల–ప్రాణహిత వంటి భారీ నీటి  పథకాలతో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని లక్షల  ఎకరాల్లో మూడు పంటలు పండించుకునేలా నీరు అందించారు. దీంతో కొన్ని ఏళ్ల నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు కొత్త శక్తిని ఇచ్చారు. ఎడారిగా ఉన్న భూములను సైతం సాగులోకి తేవడంతో రైతులంతా రాజన్నను దేవుడి మాదిరి కొలిచారు. 

ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్‌‡ వైద్యం
చిన్న చిన్న జబ్బులకు కూడా డబ్బులు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరకు ప్రాణాలే వదులుకుంటున్న పేదలను చూసి అలాంటి వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో  ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వైయస్‌  ఎంతోమంది పేదలకు కొత్త ఊపిరిలను ఊదారు. కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించి తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా చార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించిన దేవుడు వైయస్‌.


104..108లతో సేవలు
పేదలకు, దీర్ఘకాలిక రోగులకు, గర్భినులు ఆస్పత్రికి రానవసరం లేకుండా వాళ్ల ఇంటి దగ్గరకే వైద్య సేవలను పంపారు మహానేత వైయస్‌. 104 వాహనాలను ప్రతి గ్రామానికి పంపి అక్కడ వైద్య సేవలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భినులకు కూడా ప్రభుత్వం మందులను పంపిణీ చేసింది. 108 సేవలు అయితే ప్రజలకు ఎంతగా ఉపయోగపడ్డాయంటే దాన్ని మాటల్లో  వర్ణించడం కష్టం. ఏ చిన్న యాక్సిడెంట్‌ జరిగిన.. ఏ చిన్న సమస్య వచ్చినా.. గర్భినులను ఆస్పత్రికి తీసుకోవాలని ఇలా ఒక్కటేమిటి 108కి ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌..కుయ్‌ అంటూ 15 నిమిషాల్లో మనం ఉన్న చోటికి వచ్చి ఆస్పత్రిలో చేర్చావి. 

నిరుపేదలకు ఇల్లు..
నిరుపేదలకు సొంత గూడు కల్పించారు  రాజన్న. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ స్వగృహ పథకాల ద్వారా లక్షల మందికి ఇల్లు సౌకర్యం కల్పించాడు. ఈ పథకాన్ని చిత్తశుద్ధితో చేయమని వైయస్‌  అధికారులను ఆదేశించేవారు కూడా అంతేకాకుండా ప్రతి నిరుపేద విద్యార్థి కూడా చదువకు  దూరం కాకుండా ఉండేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని ప్రవేశపెట్టి డాక్టర్లుగాను.. ఇంజినీర్లు గాను.. కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైయస్‌ది. జిల్లాకో విశ్వవిద్యాలయం, గ్రామీణ పేద విద్యార్థులకు పెద్దపీట వేస్తూ ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు వైయస్‌. 

మహిళలను లక్షాధికారిణి చేయాలని...
ప్రతి మహిళా లక్షాధికారిని చేయాలని సంకల్పంతో దివంగత మహానేత మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు లక్షల కొద్ది నిధులు ఇచ్చి స్వయం ఉపాధి కింద  ప్రోత్సమించారు. అభయ హస్త పేరుతో వృద్ధ మహిళలకు ఆసరా అందించారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నేటికీ  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. 

21 May 2016

హోదా సహా అన్నింటినీ ఢిల్లీకి తాకట్టు పెట్టారు

  • అవినీతి బాబును అసహ్యించుకుంటున్నారు
  • ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
  • మీ లక్ష 40 వేల కోట్ల అవినీతిలో రూ.లక్ష ఖర్చుపెట్టినా అడ్డుకోలేరు
  • బాబు ఇకనైనా తన మైండ్ సెట్ మార్చుకోవాలిఃశ్రీకాంత్ రెడ్డి
హైద‌రాబాద్‌: చంద్రబాబు ఏపీలో రాచరిక పాలన సాగిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బాబు అవినీతి పాలనను చూసి ప్రపంచమంతా అసహ్యించుకుంటోందని  శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాలు, కొనుగోళ్లు, వలసలను ప్రవాస భారతీయులు తీవ్రంగా తప్పుబడుతున్నారని తెలిపారు. ఏపీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై యూఎస్లోని తెలుగు వారు తీవ్రంగా కలత చెందుతున్నారని  చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన చంద్రబాబును ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. 

రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కుటుంబ వ్యవహారంలా భావిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గొప్పలు చెప్పడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు... అధికారులు ప్రజాస్వామ్యబ‌ద్ధంగా ప‌ని చేసుకోకుండా అడ్డుప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్రజాస్వామ్య బ‌ద్ధంగా ప‌ని చేస్తున్న అధికారుల‌పై బెదింరిపుల‌కు పాల్ప‌డేవారిని శిక్షించాల్సింది పోయి బాబే ద‌గ్గ‌రుండి మరీ ప్రోత్స‌హిస్తున్నార‌ని కోపోద్రిక్తులయ్యారు. 

రుణమాఫీ ఏమైంది బాబు..
ఎన్నిక‌ల‌కు ముందు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుప‌ర్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ముఖం చాటేశార‌ని మండిపడ్డారు. డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు, ఇంటికో ఉద్యోగం గంగ‌లో క‌లిపేశారని  శ్రీ‌కాంత్‌రెడ్డి ఫైరయ్యారు.  ఇచ్చిన హామీల‌ేమయ్యాయని  పాత్రికేయులు ప్ర‌శ్నిస్తే...మీకు బుద్ధి  లేదా... మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి అంటూ బాబు విలేకరులను సంబోధించడం దారుణ‌మ‌న్నారు.  

నేర్చుకోవాల్సింది బాబే..
బాబు చేసే త‌ప్పుడు విధానాల‌పై బాధ్య‌త క‌లిగిన ప్ర‌తిప‌క్ష పార్టీగా  ప్రశ్నిస్తే..తమ పార్టీపైనా బాబు ఎదురుదాడికి దిగుతున్నారని, విచ‌క్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేయ‌కుండా కేవ‌లం ప్ర‌చార అర్భాటాల‌కే బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు అమలు చేయడం లేదన్నారు.  ప్రత్యేకహోదా సహా అన్నింటినీ ఢిల్లీకి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.  బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. వాస్త‌వానికి క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకోవాల్సింది మీడియా సోద‌రులు, ప్ర‌తిప‌క్షం కాద‌ని.. బాబేన‌ని చురక అంటించారు. ప్ర‌జాస్వామ్య హక్కులు కాలరాయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. 

ఎన్నికుట్రలు చేసినా రాజ్య‌స‌భ మాదే..
టీడీపీ ఎన్ని ర‌కాలుగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీపై కుట్ర‌లు ప‌న్నినా  రాజ్య‌స‌భ‌ సీటును అడ్డుకోలేరని శ్రీ‌కాంత్‌రెడ్డి తెలిపారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లడం తధ్యమన్నారు.  లక్షా 40 వేల కోట్ల‌ అవినీతి పాల్పడిన టీడీపీ సర్కార్...దాంట్లో లక్ష కోట్లు ఖర్చుపెట్టినా  ఏం చేయలేదని తూర్పారబట్టారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్య‌స‌భ స్థానం ద‌క్కుతుంద‌ని తేల్చిచెప్పారు. ఇప్ప‌టికైనా బాబు అంద‌రినీ గౌర‌వించే విధానం నేర్చుకోవాల‌ని సూచించారు. కొంత‌మంది ఎమ్మెల్యేలు ప్ర‌లోభాల‌తో పార్టీలు మారినా.... విలువలు, విశ్వసనీయత తమ  హోదాగా బతుకుతున్న ఎమ్మెల్యేలు వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నార‌న్నారు. గ‌తంలో తాము వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీలో చేర‌డానికి వెళ్తే ...రాజీనామా చేసిన అనంత‌రం పార్టీలో చేరాల‌ని సూచించారని గుర్తు చేశారు. అప్పుడు తాము ప‌ద‌వికి ఆశ ప‌డ‌లేద‌ని, పార్టీలో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డి వచ్చి రాజీనామా చేసి తిరిగి గెలుపొందామ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే ర‌కంగా ఉండాల‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌న్నారు. 

బాబుకు దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

  • బాబు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు
  • ఏపీ ఎడారిగా మారుతున్నా పట్టించుకోవడం లేదు
  • కాపునిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • టీడీపీ పాలనలో పూర్తిగా విఫలమైందని బొత్స ఫైర్
హైదరాబాద్ః ప్ర‌త్యేక‌హోదా వ‌ల్ల రాష్ట్రానికి చేకూరే ల‌బ్ధి ఏమీలేద‌ంటూ స్వ‌యంగా ముఖ్య‌మంత్రే చెప్ప‌డం సిగ్గు చేట‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. కేంద్రం హోదా ఇవ్వ‌క‌పోతే ఏం చేసేద‌నీ ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఎవ‌రైనా మాట్లాడ‌తారా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఏపీ ఎడారిగా మారుతున్న బాబుకు చీమ కుట్టిన‌ట్లు కూడా లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలు పూర్తయితే  రాయ‌ల‌సీమ‌లో తీవ్ర క‌రువు వస్తుంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా తమ బాధ్య‌త‌ను సమర్థవంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీలు విఫ‌లం చెందింది కానీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు విఫ‌లం చెంద‌లేద‌ని ఆయ‌న వివ‌రించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. 


జీవో 16 ఏమిటి బాబు..?
బాబు స‌ర్కార్ విడుద‌ల చేసిన జీవో నంబ‌ర్ 16ను గ‌మ‌నిస్తే మొత్తం చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త స్వ‌లాభం కోసం ఆరాట‌ప‌డ‌డం స్ప‌ష్టంగా క‌నిసిస్తుంద‌న్నారు. కొంద‌రు వ్య‌క్తులు కులాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారని సీఎం మాట్లాడ‌డం హ‌స్య‌ాస్ప‌దంగా ఉంద‌న్నారు. కాపుల‌పై బాబుకు చిత్త‌శుద్ధే లేదని బొత్స దుయ్యబట్టారు.  బాబు జూన్ 8న ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే... ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం ఆగ‌స్టు 21న లేఖ రాశార‌ని, సంవ‌త్స‌ర కాలంగా కాపుల‌పై బాబు కాల‌యాప‌న చేశార‌ు తప్ప వారికి చేసిందేమీ లేదని విమ‌ర్శించారు. మంజూనాథ క‌మిష‌న్‌ను జ‌న‌వ‌రిలో వేసి, ఏడు నెల‌లు కాల‌ప‌రిమితి విధించార‌ని, అందులో ఇప్ప‌టికే నాలుగు పూర్త‌యింద‌న్నారు. అయినా ఇప్ప‌టివ‌ర‌కు మంజూనాథ క‌మిష‌న్ ఏమాత్రం పురోగ‌తి సాధించలేద‌న్నారు. కాపుల గురించి మాట్లాడే హ‌క్కు బాబుకు లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. 

గ‌త సంవ‌త్స‌రంలో వంద కోట్లు కేటాయించి 67 కోట్లు ఖ‌ర్చు చేశారు. అంత‌కుముందు అస‌లు లేదు.. ఈ సంవ‌త్స‌రం వెయ్యి కోట్లు విడుద‌ల చేశారు. వంద కోట్లు కూడా ఖ‌ర్చు కాలేద‌న్నారు. బాబుకు నిజంగా కాపుల‌పై చిత్త‌శుద్ధి ఉంటే... ఆయ‌న అధికారంలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సంవ‌త్స‌రంలో ఎన్ని నిధులు కేటాయించి ఖ‌ర్చు చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. మోసం చేస్తూ, మాయ‌మాట‌లు చెబుతున్న వ్య‌క్తి చంద్ర‌బాబాని బొత్స అన్నారు.  డ‌బ్బా కొట్టుకోవ‌డ‌మే త‌ప్ప బాబు ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేదన్నారు. ఏ కులానికి సంబంధించైనా భ‌వ‌నాలు నిర్మిస్తే ఆ కులంలో పుట్టిన మ‌హోన్న‌త వ్య‌క్తుల పేర్లు పెట్టుకుంటార‌ని కానీ బాబు త‌న పేరును పెట్టుకొని కాపుల‌ను కించ‌ప‌రుస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా బాబు గౌర‌వాన్నిఇచ్చి పుచ్చుకోవాల‌ని, అగౌర‌వప‌ర్చే చ‌ర్య‌ల‌ను క‌ట్టిపెట్టాల‌ని సూచించారు. 

ప్ర‌ధానితో ఏం మాట్లాడారు?
రాష్ట్రంలో క‌రువు ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుస‌ని, సుప్రీం కోర్టు సైతం క‌రువుపై ఆయా రాష్ట్రాల‌ను త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  సూచించింద‌న్నారు. ఈ నెల 17న ప్ర‌ధానితో బాబు భేటీ సందర్భంగా ప్ర‌త్యేక హోదా, రాష్ట్రంలో నెల‌కొన్న జ‌ల‌వివాదాలు, క‌రువు, ఉపాధి, తెలంగాణ అక్ర‌మ‌ప్రాజెక్టుల‌పై ప్ర‌ధానితో చర్చించాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయినా ఏమాత్రం చిత్త‌శుద్ది లేని బాబు ఇవేవీ మాట్లాడ‌కుండా ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగే మేలు ఏమాత్రం లేద‌ని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. 

పార్టీలు మారిన‌ా... ప్ర‌జాస్వామ్యం ఉంటుంది.
పార్టీలు ఈ రోజు ఉంటాయి... రేపు పోతాయి... కానీ శ్వాశ్వ‌తంగా ఉండేదీ మాత్రం ప్ర‌భుత్వం, ప్ర‌జాస్వామ్యామ‌ని బొత్స పేర్కొన్నారు. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న బాబు కేంద్రం ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌క‌పోతే ఏం చేస్తామ‌ని మాట్లాడ‌డం సిగ్గు చేట‌న్నారు. ప్ర‌త్యేక‌హోదా వ‌ద్ద‌ని బాబే చెబుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఐదువేళ్లు నోటిలోకి వెళ్లే ప‌రిస్థితి లేకుంటే... రాష్ట్రంలో ఉపాధి క‌రువైతే... రాష్ట్రంలో క‌రువు తాండ‌విస్తుంటే... బాబుకు చీమ కుట్టినట్లు కూడా లేద‌న్నారు. బాబు చేసే ప్ర‌తిప‌నిలో రాజ‌కీయ ల‌బ్ధి త‌ప్ప‌, ప్ర‌జాల‌బ్ధి చూడ‌ర‌ని ఆయ‌న మండిపడ్డారు. రాష్ట్రంలో త్వ‌ర‌లోనే హెరిటేజ్ మ‌జ్జిక‌, హెరిటేజ్ ఉప్పు, హెరిటేజ్ అవ‌కాయ‌లు తీసుకొస్తార‌ని బొత్స ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
తెలంగాణ ప్రాజెక్టుల‌పై స్ప‌ష్ట‌మైన వైఖ‌రి తెల‌పాల‌ని బొత్స బాబును డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జాపోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చ‌రించారు. బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.  ఎమ్మెల్యేలు పార్టీ మార‌డం వ‌ల్ల టీడీపీకి జరిగిన మేలు ఏమీ లేద‌ని... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌న్నారు. బాబుకు ద‌మ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒక్క‌రి చేత‌నైనా రాజీనామా చేయించి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. రాజ‌ధాని భూముల‌పై సాక్ష్యాధారాల‌తో స‌హా నిరూపిస్తే దానిపై ఎందుకు సీబీఐ విచార‌ణ జరిపించలేదని  ప్ర‌శ్నించారు. అగ్రిగోల్డ్ భూముల‌పై ఎందుకు తేలుకుట్టిన దొంగ‌లా వ్య‌వ‌హారిస్తున్నార‌ని నిల‌దీశారు. 

రోను తుఫానుపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి
రాష్ట్రంలో రోను తుఫాను భీభ‌త్సం సృష్టించ‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింద‌ని, దీనిపై ప్ర‌భుత్వం వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కు, ప్ర‌క‌ట‌న‌ల‌కు శాశ్వ‌తం కాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇంత‌కు ముందు అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వ అధికార యంత్రాంగం ప‌ని చేయాల‌ని ఆయన సూచించారు. ప్రాణ‌, ధ‌న న‌ష్టాన్ని కాపాడాల‌ని కోరారు. మామిడి, జీడి తోట‌లు అత‌ల‌ాకుత‌లం అవుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాజ‌కీయ ల‌భ్ధి కోసం కాకుండా స్వ‌చ్ఛంధంగా నిజాయితీగా ప్ర‌తీఒక్క‌రబ ప‌ని చేయాల‌ని ఆయన సూచించారు. 

20 May 2016

కాపుభవనాలకు బాబు పేరు పెడతారా

  • ఎన్నిక‌ల‌ ముందో మాట..తర్వాతో మాట
  • కాపుల హామీలేమయ్యాయి బాబు
  • అంతకన్నా దారుణం మరొకటి ఉండదు
  • వైయ‌స్సార్సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు
హైదరాబాద్ః కాపు భ‌వ‌నాల‌కు చంద్ర‌న్న కాపు భ‌వ‌నం అని పేరు పెట్ట‌డం కాపుల‌ను ఘోరంగా అవ‌మానించి, కించ‌ప‌ర్చిన‌ట్లేన‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు. కాపుల్లో పుట్టిన మ‌హానేత‌లు ఎంద‌రో ఉండ‌గా బాబు ఆయ‌న పేరునే పెట్టుకోవ‌డంలో అంత‌ర్యం ఏమిట‌నీ అంబ‌టి ప్రశ్నించారు. కేవ‌లం ప్ర‌జ‌ల్ని మభ్య పెట్టేందుకే రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నామ‌న్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఐదు సంవ‌త్స‌రాల కాలంలో రూ. 5వేల కోట్లు కాపుల‌కు ఖ‌ర్చుపెడ‌తామ‌న్నార‌ని, నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో కాపుల‌ను బీసీలో చేర్చుతామని చెప్పారని..ఇచ్చిన  హామీ ఏమైంద‌ని బాబును ప్రశ్నించారు. బాబు ఇచ్చిన హామీల‌ను చూసే కాపు కుల‌స్తులు టీడీపీకి ఓట్లు వేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 

ప్ర‌భుత్వ ప‌థ‌కాలా..?  బాబు ప‌థ‌కాలా..?
అలులేదు... సూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్లు బాబు ప‌థ‌కాల‌ను ప్రారంభించిది లేదుగానీ ఆ ప‌థ‌కాల‌కు మాత్రం త‌న పేర్ల‌ను పెట్టుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. చంద్ర‌న్న స్వ‌యం ఉపాధి ప‌థ‌కం, చంద్ర‌న్న విదేశీ విద్య దీవేన‌, చంద్ర‌న్న విద్యోన్న‌తి, చంద్ర‌న్న కాపుభ‌వ‌నాలు, చంద్ర‌న్న ఉప‌కార‌వేత‌నాలు, చంద్ర‌న్న భూసారా ప‌రీక్ష‌లు, చంద్ర‌న్న సంక్రాతి కానుక‌, చంద్ర‌న్న బీమా, చంద్ర‌న్న హామీ అంటూ కేవ‌లం ఆయ‌న పేరు మీద ప‌థ‌కాల‌ను చెబుతున్నారే త‌ప్ప అందులో ఒక్కటి కూడా అమ‌లు కావ‌డం లేద‌న్నారు.  ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్పుడు దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సైతం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశార‌ని, ఇలా ఎవరూ వారి పేర్లు పెట్టుకోవాల‌ని తాప‌త్రాయ‌ప‌డ‌లేద‌న్నారు. పేద ప్ర‌జ‌ల కోసం డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆరోగ్య‌శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, 108, ఫించ‌న్లు ఇలా ఎన్నో ప‌థ‌కాలు తీసుకొచ్చార‌ని కానీ అందులో ఏ ఒక్క ప‌థ‌కానికి త‌న పేరును వినియోగించ‌ని మ‌హోన్న‌త వ్య‌క్తి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అన్నారు. 

మ‌హోన్న‌త వ్య‌క్తులు ఎంతో మంది ఉండ‌గా... బాబు పేరే ఎందుకు..?
కోడి రామామూర్తినాయుడు ఫైల్‌వాన్‌గా పేరుగాంచార‌ని, క‌న్నగంటి హ‌నుమంతు కాపు కులంలో పుట్టి స్వాతంత్ర్య స‌మ‌రంలో పాల్గొన్న మ‌హోన్న‌త వ్య‌క్తి అని, చ‌ల‌న చిత్ర సీమ‌లో త‌న‌కంటూ ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు, క్రికెట్‌లో భార‌త‌దేశానికి మొట్ట‌మొద‌టిగా కెప్టెన్‌గా చేసిన సీకే నాయుడు, మ‌హాన‌టి సావిత్రి, వంగ‌వీటి మోహ‌న‌రంగారావులాంటి ఎంతో మంది కాపు ప్ర‌ముఖులు ఉన్నా... కాపు భ‌వ‌నాల‌కు బాబు పేరు పెట్టడమంటే వారిని అవమానించడమేనన్నారు.  
ఒక్క‌సారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి . 2014-15 సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు కాపు కుల‌స్తుల‌కు ఖ‌ర్చు పెట్టింది... నిధులు కేటాయించింది ఏమీ లేద‌న్నారు. 2015-16 సంవ‌త్సరంలో రూ. 96 కోట్ల ఖ‌ర్చు పెడ‌తామ‌ని చెప్పి కేవ‌లం రూ. 70 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌న్నారు. నాలుగు మాసాలు గడిచినా కాపులకిచ్చిన హామీలపై అతీగతీ లేదని మండిపడ్డారు.  ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం ఆగ‌స్టు 21న లేఖ రాయ‌డం వ‌ల్లే కాపుల‌ను బీసీల్లో చేర్చే విష‌యంపై మంజూనాథ క‌మిష‌న్ ను జ‌న‌వ‌రి 18 2016లో వేశార‌ని, ఇప్ప‌టికి ఆ క‌మిష‌న్ ప‌ని చేసిన దాఖాలాలు ఎక్క‌డ క‌నిపించ‌డం లేద‌న్నారు. కాపు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయ‌కుండా, కాపుల‌ను బీసీలో చేర్చ‌కుండా బాబు మీన‌మేషాలు లెక్కిస్తున్నార‌ని ఆయ‌న ఫైరయ్యారు. ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం ఆందోళ‌న చేయ‌డం వ‌ల్లే ఈ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారే త‌ప్ప బాబుకు కాపుల‌పై చిత్త‌శుద్ధి లేద‌న్నారు. 
కాపుల‌కు కోసం రూ. 5 వేల కోట్ల‌లో రూ. వంద కోట్ల‌ను కూడా ఖ‌ర్చు పెట్టిన దాఖాలాలు లేవ‌న్నారు. ఇప్ప‌టికైనా బాబు త‌క్ష‌ణ‌మే కాపుల కోసం ఎంతమేర నిధులు ఖ‌ర్చు చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని రాంబాబు డిమాండ్ చేశారు.  మీరు ఇచ్చిన హామీలనే కాపులు అడుగుతున్నారు త‌ప్ప బిక్షందేహీ అని అడ‌గడం లేద‌న్నారు. 

స్వార్థ రాజకీయాలు చేయొద్దు
కాపు కులస్తులు నిధులు ఇస్తే... ఆ నిధులను తీసుకొని బాబు ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌హాయం చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. దీనికి ప్ర‌భుత్వాలు ఎందుక‌ని నాన్ గ‌వ‌ర్న‌మెంట్ ఆర్గ‌నైజేషన్లు చాలా ఉన్నాయ‌న్నారు. శ్రీ‌శైలంలో కాపు క‌ళ్యాణ మండ‌పాన్ని కాపులే నిర్మించుకున్న విష‌యం బాబు తెలుసుకోవాల‌న్నారు. కాపుల‌ను కించ‌ప‌ర్చే విధంగా స్వార్థ రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న బాబుకు సూచించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణాలు, ల‌క్ష రుపాయ‌ల స‌బ్సిడీ ఇస్తామ‌ని చెప్పిన బాబు.... ఇప్పుడు రూ. 50 వేలు ఇస్తామ‌న‌డం ఎంత‌వ‌ర‌కు స‌మాంజ‌స‌మ‌ని అడిగారు. అందులో రూ. 25వేలు స‌బ్సిడీ, రూ. 25వేలు బ్యాంకుల‌కు చెల్లించాల్సి ఉంద‌న్నారు. 

రాజీనామా చేసి మాట్లాడు భూమా
బీసీల‌కు రూ. 2.5ల‌క్ష‌ల ఆధాయ ప‌రిమితి పెంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రూ. 50వేల రుణాల కోసం అభ్య‌ర్థులు బ్యాంకుల చుట్టూ తిర‌గ‌లేక చెప్పులు అరిగిపోతున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. రాయ‌ల‌సీమ వారికి పౌరుషం ఎక్కువ‌ని అంటార‌ని, భూమా నాగిరెడ్డికి పౌరుషం ఉంటే ...రాజీనామా చేసి మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌తిప‌నిని త‌ప్పుబ‌ట్ట‌డ‌మే టీడీపీ ధ్యేయంగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష చేస్తే మంత్రులు దూషణలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 

19 May 2016

జననేత దీక్షకు వెల్లువలా మద్దతు

  • మూడ్రోజుల పాటు వైయస్ జగన్ జలదీక్ష
  • కర్నూలుకు పోటెత్తిన పార్టీ శ్రేణులు, ప్రజలు
  • అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా జననినాదాలు 
కర్నూలుః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష విజయవంతం అయ్యింది. జనం కోసం జలనం కోసం జననేత చేపట్టిన జలదీక్షకు వెల్లువలా మద్దతు లభించింది. పార్టీ శ్రేణులు, ప్రజలు కర్నూలుకు పోటెత్తడంతో జన జాతరను తలపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద అంతా తరలివచ్చి వైయస్ జగన్ దీక్షకు మద్దతుగా నిలిచారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు సహా వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కర్నూలుకు కదం తొక్కారు. జననేతకు సంఘీబావం ప్రకటించారు. 

మూడ్రోజుల పాటు నిర్విరామంగా తనను కలుసుకునేందుకు వచ్చిన వేలాదిమంది ప్రజానీకంతో.... వైయస్ జగన్ చెదరని చిరునవ్వులతో ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించారు.  మరోవైపు, వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తల దీక్షలు, ధర్నాలతో రాష్ర్టవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలికారు. ప్రజల శ్రేయస్సే పరమావధిగా అలుపెరగని పోరాటం చేస్తున్న జననేతకు జనం జేజేలు కొట్టారు. 

తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, ఆ ప్రాజెక్ట్ లను అడ్డుకోలేని ఏపీ అసమర్థ ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా వైయస్ జగన్ కర్నూలు కేంద్రంగా మూడ్రోజుల పాటు జలదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా... మొద్ద నిద్రపోతున్న టీడీపీ ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు, జలదోపిడీని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు  వైయస్ జగన్ నిరాహార దీక్ష కొనసాగించారు. కృష్ణా,గోదావరి నదులపై ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలతో పాటు గోదావరి నదులపైనా తెలంగాణ చేపట్టనున్న ప్రాజెక్ట్ ల వల్ల ఏపీకి జరగనున్న అన్యాయాన్ని వైయస్ జగన్ ప్రజలకు వివరించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపని వైనంపై మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు భయంతో బాబు ఏపీ ప్రయోజనాలను పక్కరాష్ట్రాలకు తాకట్టు పెట్టిన దుశ్చర్యపై నిప్పులు చెరిగారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు దీక్షాస్థలి వద్దకు వచ్చి వైయస్ జగన్ దీక్షకు మద్దతు పలికారు. 

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యపు వైఖరిపై మండిపడ్డారు. జలదోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడేందుకు వైయస్ జగన్ కడుపు మాడ్చుకొని పోరాటం చేస్తుంటే...చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో విదేశాల్లో విలాసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ కు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. వైయస్ జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పోరాడి ఏపీ హక్కులను సాధించుకుందామని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు.