12 September 2016

ఇది స్విస్ చాలెంజ్ కాదు.. సూట్ కేసుల చాలెంజ్

  • లక్షల కోట్ల దోపిడీ కోసమే స్విస్ చాలెంజ్
  • రైతుల పొట్టగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
  • బాబు అవినీతిని అడ్డుకుంటాం
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన 
హైదరాబాద్ః రాజధాని ముసుగులో చంద్రబాబు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రూ. లక్షల కోట్లు దోచుకునేందుకే బాబు స్విస్ చాలెంజ్ విధానాన్ని తీసుకొచ్చారని నిప్పులు చెరిగారు. అది స్విస్ చాలెంజ్ కాదని సూట్ కేసుల చాలెంజ్ అని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి వైయస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, రాజధాని పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని తమ అధ్యక్షులు మొదటినుంచి చెబుతూనే ఉన్నారని భూమన తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.

సింగపూర్ కంపెనీలకు స్విస్ చాలెంజ్ మీద చంద్రబాబు భూములు కట్టబెట్టడాన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, అధికారులు...హైదరాబాద్ నుంచి విజయవాడ పోయినంత ఈజీగా సింగపూర్ పోయి స్విస్ చాలెంజ్ పేరిట అవినీతికి తెరలేపారని ధ్వజమెత్తారు.  అక్కడి ఏజెన్సీతో నిరంతరం చర్చసాగించి 1691 ఎకరాలు సింగపూర్ సంస్థలకు కట్టబెడడం దుర్మార్గమన్నారు.  రైతుల భూములను బలవంతంగా లాక్కొని అందులో తొలివిడతగా 17వందల ఎకరాలు... స్విస్ కంపెనీ పేరుతో  బాబు తాబేదారుల కంపెనీకి కట్టబెడుతున్నారు తప్ప మరొకటి లేదన్నారు. 

ప్రపంచంలోనే 8వ వింత అయిన  తాజ్ మహల్ ను 5 వందల ఏళ్ల క్రితం భారతీయులే కట్టిన సంస్కృతి మనది.  700 ఏళ్ల క్రితం నిర్మించిన కుతుబ్  మినార్ , 4వందల ఏళ్ల నాటి హైదరాబాద్ లోని చార్మినార్ కట్టడం మన ఇంజినీర్ల నైపుణ్యమే. శ్రీహరికోట నుంచి నిరంతరం రాకెట్లు ఏరోజు విఫలం కాకుండా పంపించిన సాంకేతిక నైఫుణ్యం మనసొత్తు. దుబాయిలోని బూర్జ్ ఖలీఫా కట్టడంలో భారతీయ ఇంజినీర్లదే ముఖ్య భూమిక. ఈదేశంలో వందలాది కోటలు విదేశీయులను ఆకర్షిస్తూ మనకు విదేశీ ధనాన్ని తెస్తున్నాయి. నాసాలో పనిచేస్తున్న దాంట్లో సగానికి పైగా భారతీయ ఇంజనీర్లే ఉన్నారని  చాటుకుంటున్నాం. చంద్రమండలం, రోదసీలోకి వెళ్లిన చరిత్ర భారతీయులకు ఉంది. అలాంటి చరిత్ర ఉన్న దేశాన్ని కాదని బాబు ముష్టి 1700 ఎకరాల అభివృద్ధికి... విదేశీ కంపెనీలను స్వాగతించడం వెనుక కుట్రను బయటపెట్టాలన్నారు. 

సూట్ కేసుల చాలెంజ్ కాబట్టే ప్రభుత్వ పెద్దలు కోట్లాది రూపాయల నిధులు మేసేందుకు ...సింగపూర్ సంస్థలను వాడుకుంటూ స్విస్ చాలెంజ్ ను తెరపైకి తెచ్చారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యముంటే కోర్టు ఆధ్వర్యంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల రాజధాని కావాలి గానీ, పేదవాడిని వెలివేసే రాజధాని తమ కొద్దని భూమన స్పష్టం చేశారు. బాబు తన తాబేదారులను చొప్పించి లక్షల కోట్ల దోపిడీ చేయాలన్న తలంపుతో ఉన్నారు కాబట్టే ఈకార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. బాబు అవినీతిని అడ్డుకుంటామని భూమన తేల్చిచెప్పారు.

తమ నాయకుడు జగన్ అమరావతి ప్రకటన వెలువరిచిన వెంటనే సమ్మతి తెలపడమే గాక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారని భూమన పేర్కొన్నారు. అమరావతి పేరుతో అమరనగరం నిర్మిస్తామన్న కుట్రలో ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు.  పేదల భూములు లాక్కొని బడానేతలకు, అక్రమ సంపాదకులకు కట్టబెట్టడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. చంద్రబాబు తప్పుల మీద దాడి చేస్తున్నామన్న కోపంతోనే తుని ఘటనలో తనపై అక్రమ కేసులు బనాయించాడని భూమన చెప్పారు. అసలు నోటీసులు పంపాల్సింది తనకు కాదని హోంమంత్రి అని చెప్పబడే హోంగార్డుకు, ముఖ్యమంత్రికే నోటీసులు పంపాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు భూమన బదులిచ్చారు. 

No comments:

Post a Comment