17 September 2016

ఇలాంటి వింత మనిషి సీఎం కావడం మన దౌర్భాగ్యం

  • బాబు బరితెగించి అబద్ధాలు ఆడుతున్నాడు
  • రాష్ట్రాన్ని దోచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు
  •  వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బరితెగించి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కష్ట సమయంలో ఉన్న రాష్ట్రానికి అనుభవజ్ఞుడినని ప్రజలంతా ఏకగ్రీవంగా తనను ముఖ్యమంత్రిని చేశారని బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాలను అలవోకగా ఆడుతున్నారని అంబటి ఆగ్రహించారు. చంద్రబాబు తీరుపై అంబటి రాంబాబు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వచ్చినంత మెజార్టీ కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ మొత్తానికి రాలేదన్నారు. 

అలవోకగా అబద్దాలు ఆడటంలో ఈ దేశంలోనే చంద్రబాబును మించిన రాజకీయ నేత లేడనేది నగ్న సత్యంగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబు కేసులపై పదుల సంఖ్యల్లో స్టే తెచ్చుకొని నిప్పులాంటి మనిషిని అని చెప్పుకుంటున్నారని, అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా స్టే తీసుకువస్తే ఉన్మాదులు, అభివృద్ధి నిరోధకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా, రాష్ట్రాన్ని దోచుకోవడంలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంబటి చురకంటించారు. తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు న్యాయస్థానాలపై గౌరవం వెల్లబోస్తూ, బాబుకు వ్యతిరేకంగా తీర్పులిస్తే న్యాయస్థానాలను కూడా తప్పుబట్టే దౌర్భాగ్యం నెలకొందన్నారు. 

బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీది నెంబర్‌–2 స్థానం అని చెప్పిన చంద్రబాబుకు అంబటి సవాలు విసిరారు. పదవ ర్యాంక్‌లో ఉన్న ఏపీని రెండవ ర్యాంక్‌లో ఉందని చెప్పాడు.  మున్ముందు నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకువెళ్తామని బ్రిక్స్‌లో బాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని అంబటి ఫైరయ్యారు. ఈడిబిలో తెలంగాణది రెండవ స్థానంలో ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చిగా రికార్డులు తారుమారు చేసే నీచ స్థాయికి దిగజారారని ధ్వజమెత్తారు.  అంకెల గారడీతో మభ్యపెడుతున్న బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2015–16లో 954 బిలియన్లు వస్తే దాంట్లో ఏపీకి 15.8 శాతం వచ్చిందని, దేశంలోనే విదేశీ పెట్టబడుల్లో ఏపీ అగ్రస్థానం బాబు గొప్పలు చెప్పడం బాధాకరమన్నారు. 4 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి ఇంతగొప్ప పెట్టుబడులు వచ్చాయంటే ఆ ఘనత చంద్రబాబుదేనని తనకు తాను చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. వీటిపై రికార్డులు పరిశీలిస్తే 2006–07లో విదేశీ పెట్టుబడులు 2,754 ఉండేవని, అప్పటి నుంచి పెట్టుబడులు తగ్గుముఖం పట్టి 954కు చేరాయని ఆధారాలను బయటపెట్టారు. పెట్టుబడులు ఉమ్మడి రాష్ట్రానికి 15.8 శాతమని నివేదిక ఇస్తే చంద్రబాబు నావల్లే పెరిగాయని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మరోమారు మోసం చేయడానికి పూనుకున్నారని విరుచుకుపడ్డారు. 

టీడీపీకి పుట్టగతులుండవని భయం
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు కొత్త పద్దతులను కనిపెడుతున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయకట్టు నిర్మాణానికి నీటి ప్రవాహం అడ్డుపడకుండా వేసే కాఫర్‌ డ్యాంను పూర్తి చేసి పోలవరం మొదటి దశ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారని అంబటి మండిపడ్డారు. కొండవీటి, కృష్ణా నది నీటి ప్రవాహాని కంటే  ఏపీ రాజధాని నిర్మాణ ప్రాంతం లోతట్టులో ఉందని, దీనికి ప్రత్యామ్నయంగా ఏం చేస్తారని ప్రశ్నిస్తే ఆ లెవలంతా పూడ్చేస్తామని చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 13 వేల ఎకరాలు, 10 అడుగుల లెవల్‌ ఎలా పెంచుతారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారని నిలదీస్తే ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ రాజధానికి వ్యతిరేకమని చిత్రీకరిస్తున్నారన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ స్నేహితులందరికీ అక్కడ భూములున్నాయి కాబట్టే రాజధాని అని నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజధానిపై మాట్లాడితే చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీపై విమర్శలు చేస్తున్నారు.  వైయస్‌ఆర్‌ సీపీ ఉంటే రానున్న రోజుల్లో టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నారని అన్నారు. అందరూ ఉన్మాదులు.. బాబు ఒక్కడే సశ్చిలుడు అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజక పాలన చేస్తే ప్రజలు చెప్పుకుంటారు కానీ అందుకు భిన్నంగా బాబు రంజక పాలన చేస్తున్నారని చురకంటించారు. నేను ఉత్తమ విద్యార్థిని అని తనకు తాను చెప్పుకునే ప్రబుద్దుడిని దేశ చరిత్రలోనే చూడలేదన్నారు. ఇలాంటి వింత మనుషులను చూడాల్సిన దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలకు పట్టిందన్నారు. 

బాబు లక్ష్యం నెరవేరదు
తెలంగాణలో గ్యాంగ్‌స్టర్‌ నయీం ట్యాక్స్‌లా ఏపీలో నారా లోకేష్‌ ట్యాక్స్‌ ఒకటి ఏర్పడిందని అంబటి ఆరోపించారు. ప్రతి అభివృద్ధి పనుల్లో రేట్లు పెంచి లోకేష్‌కు ట్యాక్స్‌ రూపంలో అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పనులు ఏమీ లేకపోయినా ట్యాక్స్‌ల కోసమే పనులు చేసే దిగజారిపోయిన పరిపాలన చంద్రబాబు అందిస్తున్నారన్నారు. లోకేష్‌ను రాజకీయ వారసుడిగా తీసుకురావడం కోసం, సీఎంను చేయడమే చంద్రబాబు లక్ష్యమైతే ఆ లక్ష్యం నెరవేదన్నారు. లోకేష్‌ అంటేనే అవినీతి తప్ప మరొకటి లేదని ప్రజల్లో ఎప్పుడో ముద్రపడిపోయిందన్నారు. నిత్యం నీతి వ్యాఖ్యలు చెప్పే చంద్రబాబు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలను మానుకోవాలని హితవుపలికారు. 

No comments:

Post a Comment