30 September 2016

బాబు ఎందుకు పోరాడరు

కర్నూలు: కాంగ్రెస్, బీజేపీ వేసిన ప్ర‌త్యేక హోదా విత్త‌నాన్ని పెంచిపోషించిన చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఎటువంటి లాభం లేద‌న‌డం అన్యాయమని వైయస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి తీర‌ని న‌ష్టం జ‌రిగిన వాస్త‌వం ....అన్ని పార్టీలు, వ‌ర్గాల‌కు తెలుస‌ని చెప్పారు.  ఆర్థికంగా ఎటువంటి బ‌లం లేకున్న‌ా, ఏపీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించాయ‌ని బుట్టా రేణుక మండిపడ్డారు. చైత‌న్య‌ప‌థం కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆమె మాట్లాడారు. విభ‌జ‌న స‌మయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా గురించి అస‌లు తెలియ‌ద‌ని ప్ర‌త్యేక హోదా అనే విత్త‌నాన్ని వేసింది కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాలేన‌ని రేణుక పేర్కొన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తానంటే బీజేపీ ప‌దేళ్లు ఇస్తాన‌ని, టీడీపీ ప‌దిహేనేళ్లు కావాల‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాయ‌ని ఆమె ఆరోపించారు. ఏ పార్టీలైతే రాష్ట్రాన్ని విడ‌గొట్టాయో ఆ పార్టీలే ఇప్ప‌డు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు పోరాడి ప్ర‌త్యేక తెలంగాణ‌ను సాధించుకొని రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నప్పుడు,  ఏపీ ప్ర‌జలంద‌రు క‌లిసి పోరాడి హోదాను సాధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధి చేసుకోలేమా అని అన్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్తు ప్ర‌త్యేక హోదాతో ముడిప‌డి ఉంద‌ని, ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని కొన‌సాగిస్తేనే అభివృధ్ధి సాధ్య‌మ‌న్నారు. 


ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చారు
పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకమైన అంశాలేవి లేవని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. వెంకయ్య, చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న ప్యాకేజీ కూడా ఇప్పటి వరకు రాలేదని మండిపడ్డారు. కర్నూలులో జరిగిన చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన బుగ్గన మాట్లాడుతూ... హోదా వస్తేనే ప్రత్యేక రాయితీలతో పరిశ్రమలు మెండుగా వస్తాయన్నారు. పరిశ్రమలు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. చంద్రబాబు రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువొచ్చిందని ప్రజలు గగ్గొలు పెడుతుంటే పుష్కరాలని హడావిడి చేశారని ఫైరయ్యారు. హామీల అమలు అంటే పీవీ సింధూ సన్మానం, ప్రత్యేక హోదా అంటే దోమలపై యుధ్ధ అంటూ ప్రజా సమస్యలను పక్కదొవ పట్టిస్తున్నారన్నారు. అసోంకు హోదా కొనసాగించాలని వారు కోరినప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరగబోతుందని గ్రహించి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలుగా వస్తుంది వస్తుందని చెప్పుకుంటూ చివరకు రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు. 

No comments:

Post a Comment