6 August 2016

బీజేపీ తోడు దొంగ అని తేలిపోయింది

  • చంద్రబాబు మోసం మరోసారి బయట పడింది
  • పార్లమెంటులో అటక ఎక్కిన ప్రైవేటు మెంబర్ బిల్లు
  • హోదా కోసం పట్టుబట్టిన వైయస్సార్సీపీ ఎంపీలు


న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం, బీజేపీ చేసిన మోసం బయట పడిపోయింది. ప్రత్యేక హోదా మీద ప్రైవేటు మెంబర్ బిల్లు ని అటక ఎక్కించేసి చేతులు దులుపుకొన్నారు.

పార్లమెంటులో ఏమయిందంటే..!
ముందుగానే ఊహించినట్లుగానే ప్రత్యేక హోదా మీద ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. సభా నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఇది ఆర్థికబిల్లు అని, దీన్ని రాజ్యసభలో ఓటింగ్ జరపటం కుదరదు అని ప్రకటించారు. దీని మీద అడ్డుకొనేందుకు కానీ, కనీసం నిరసన తెలిపేందుకు కానీ టీడీపీ ఏమాత్రం ప్రయత్నించలేదు. ప్రత్యేక హోదా అన్నది ఏపీ ప్రజల పాలిట సంజీవని అయినప్పటకీ దీని గురించి గట్టిగా పట్టు పట్టేందుకు ప్రయత్నించలేదు. పైగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వయంగా రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ పూర్తి స్థాయిలో బిల్లుని వ్యతిరేకించే శిబిరంలో చేరిపోయారు. ఈ సమయంలో వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ నినదించారు. ప్రత్యేక హోదా మీద వైయస్సార్సీపీ పోరాడుతున్న రీతిని ప్రతిబింబింపచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్త శుద్ధి లేదన్న సంగతి అర్థం అవుతోందని చెప్పారు. కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీ, టీడీపీలకు పడుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

పార్లమెంటులో వైయస్సార్సీపీ పోరుబాట
అంతకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో వైయస్సార్సీపీ ఎంపీలు నిరసన బాట పట్టారు. గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ప్రత్యేక హోదా ఇప్పించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. జాతీయ నాయకులకు అవగాహన కల్గే విధంగా ప్లకార్డులు ప్రదర్శించి నినదించారు. ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారానే తెలుగు ప్రజలకు న్యాయం కలుగుతుందని గట్టిగా డిమాండ్ చేశారు. హోదా కోసం వైయస్సార్సీపీ  అనేక విధాలుగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.  హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.  హోదా తీసుకురాకపోతే చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 

పోరాటం కొనసాగింపు
ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఇప్పటికే వైయస్సార్సీపీ ప్రకటించింది. పార్లమెంటు లోపల, బయట ఉద్యమాన్ని సాగిస్తామని వెల్లడించింది. ఇందుకోసం కార్యాచరణ కు మరింత పదును పెడుతున్నట్లు పేర్కొంది.

No comments:

Post a Comment