1 July 2016

వైద్య సేవలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైయస్సార్

హైదరాబాద్) నేడు జాతీయ డాక్టర్స్ డే జరుపుకొంటున్నాం. పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బీసీ రాయ్ జయంతిని పురస్కరించుకొని దీన్ని నిర్వహించటం ఆనవాయితీ. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ఎనలేని సేవలు అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వైద్య సేవల అభ్యున్నతికి ఎంతో పాటు పడ్డారు.
మొదట నుంచి ఆసక్తి
          దివంగత మహానేత కు వైద్య సేవలు అంటే ఎంతో ఇష్టం. అందుకే చిన్నప్పుడు ఏరి కోరి మెడికల్ కోర్సు ఎంచుకొన్నారు. 1972లో గుల్బర్గా మెడికల్ కాలేజీ నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నారు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి నాయకత్వం వహించారు. మెడికో ల సంక్షేమానికి ఆయన ఎంతో చొరవ తీసుకొన్నారు. తర్వాత తిరుపతి లోని శ్ర వేంకటేశ్వర వైద్య కళాశాల లో హౌస్ సర్జన్ గా అభ్యసించారు. ఆ సమయంలో   అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జూనియర్ వైద్యుల సంక్షేమానికి ఎంతో క్రషి చేశారు.
వైద్యునిగా సేవలు
తరువాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగు లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆసుపత్రికి నేత్రత్వం వహించారు. ఆ సమయంలో ఒక్క రూపాయికే వైద్యం అందిస్తూ పేదలకు విరివిగా సేవలు అందించేవారు. హస్త వాసి మంచిది కావటంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం రోగులు అక్కడకు తరలి వచ్చేవారు. ముఖ్యంగా నిరుపేదలు వచ్చినప్పుడు ఉచితంగా చికిత్స అందించటంతో పాటు, మందుల్ని సైతం ఉచితంగా అందించేవారు. దీంతో చుట్టుపక్కల  ప్రాంతాల్లో ఆయన కు చాలా మంచి పేరు వచ్చింది. దీనికి తోడు ఆయన విరివిగా మెడికల్ క్యాంపులు నిర్వహించేవారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో వేలమందికి స్వస్థత పరిచేవారు.
వైద్య శాఖ పట్ల శ్రద్ధ
            దివంగత మహానేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వైద్య ఆరోగ్య శాఖను శ్రద్ధగా తీర్చిదిద్దారు. అదే సమయంలో వైద్యుల అభ్యున్నతి కోసం పాటు పడేవారు. వైద్యుల సంఘం నుంచి, ఇతర అసోసియేషన్ల నుంచి ఏమైనా వినతులు వస్తే వెంటనే పరిష్కరించేవారు. అటు ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో రోగుల పాలిట ఆపద్భాంధవుడిగా ఆయన నిలిచిపోయారు. ముఖ్యంగా నిరుపేదల్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించిన మహనీయుడిగా ఆయన ఖ్యాతిని సొంతం చేసుకొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అపర ధన్వంతరి గా వైయస్సార్ ను ప్రజలంతా గుర్తు ఉంచుకొన్నారని చెప్పవచ్చు.

No comments:

Post a Comment