- రెండేళ్ల పాలన మీద సూటి ప్రశ్నలు
- పది ప్రశ్నలు రూపొందించిన వైయస్సార్సీపీ
- ప్రశ్నావళి విడుదల చేసిన మాజీమంత్రి బొత్సా
హైదరాబాద్) రెండేళ్లుగా చంద్రబాబు కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు దక్కిన ప్రయోజనాలు ఏమిటని మాజీమంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడప లో మహా సంకల్ప సభ నిర్వహించిన విధి విధానాల మీద బొత్స మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వందల వాగ్దానాలు సంకల్పాలు కావా?ఎన్నికల తరువాత ఇచ్చిన విచ్చలవిడి అవినీతి, అధికార దుర్వినియోగం, అరాచకాలు మాత్రమే మీ మహా సంకల్పాలా? అని ప్రశ్నించారు. రెండేళ్ళ పాలనను పండగగా చేసుకుంటున్న చంద్రబాబుకి పార్టీ తరపున పది ప్రశ్నల్ని బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు.
1)వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నారు!
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? మీరు అధికారంలోకి రాక ముందు వ్యవసాయ రుణాలెన్ని? మీ రెండేళ్ళ పాలన తరువాత రైతులు బ్యాంకులకు కట్టాల్సిన వ్యవసాయ రుణాలెన్ని?
మీరు అధికారంలోకి రాక ముందు బ్యాంకుల నుంచి రైతులకు గత పదేళ్ళుగా అందిన వ్యవసాయ రుణాలెంత? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకుల నుంచి కొత్తగా రైతులకు అందిన రుణాలు ఎంత?
మీరు అధికారంలోకి వచ్చేసరికి రూ. 87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాల విషయాన్ని మరిచి ఇప్పటి వరకు కనీసం రూ. 9,000 కోట్లు కూడా బడ్జెట్లో కేటాయించకపోవటం నిజం కాదా..? ఇదే సమయంలో.. మీ వాగ్దానాల్ని నమ్మి రుణాలు చెల్లించని రైతులు అపరాధ వడ్డీలుగా ఏకంగా రూ. 30,000 కోట్ల మేర చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నది నిజం కాదా?
2) డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నారు.
డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?
వీరు అధికారంలోకి వచ్చేసరికి ఏ గ్రేడ్ డ్వాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు రెండేళ్ల తరువాత మీ హయాంలో ఏ గ్రేడ్ డ్వాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయి?
3) ఇంటికో ఉద్యోగం లేదా రూ. 2000 నిరుద్యోగ భృతి అన్నారు.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరికి నిరుద్యోగ భృతి ఇచ్చారు?
4) ప్రత్యేక హోదా అనే మహా సంకల్పం ఏమయింది?
అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీ అంటే, కాదు... పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని మీరు అన్నారు. ఎన్నేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చారు?
ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టలేదంటూ మీరే దొంగ సాకులు వెతుకుతున్నారు. మరి మీరు స్వయంగా వాగ్దానం చేసి మీ మెనిఫెస్టోలో పెట్టిన వందల కొద్దీ వాగ్దానాలకు ఇప్పుడు పడుతున్న గతి ఏమిటి?
5) పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో పూర్తి చేస్తాం అన్నారు.
ఇప్పటికి రెండేళ్ళు అయింది. ఎప్పటికి పూర్తి చేయిస్తారు? జాతీయ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా? మీ ప్రభుత్వానిదా?
6) బడ్జెట్లో ఇవ్వాల్సిన అంకెల్లో, నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్లు కూడా ఇవ్వకపోవడం ద్వారా ఆదాయ వ్యయాలను దాచిపెట్టింది నిజం కాదా? మీరు చెబుతున్న ఏపీ ఆర్థిక వృద్ధిరేటు బోగస్అని కేంద్ర ప్రభుత్వం చెప్పటం నిజం కాదా?
7) సీబీఐ విచారణలంటే ఎందుకంట భయం?
వైయస్ఆర్ అధికారంలో ఉండగా మీరు ప్రతిపక్ష నేతగా వోక్స్వాగన్, ఔటర్రింగ్రోడ్డు, పరిటాల రవి హత్య వంటి అంశాల్లో మీరు సీబీఐ విచారణ కోరగానే ఆయన ప్రభుత్వం అంగీకరించింది. ఆ విచారణ జరగటం వల్ల ఔటర్ రింగ్రోడ్డు ఆగిపోలేదు, ఎయిర్పోర్టు ఆగలేదు. పీవీ నర్సింహ్మరావు ఎక్స్ప్రెస్ వే ఆగలేదు, మరి, రాజధాని భూములు, అమరేశ్వరుడి భూములు, పట్టిసీమ, పారిశ్రామిక రాయితీలు, భూ కేటాయింపులు తదితర అంశాల్లో జరిగిన అవినీతిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే మీరు ఎందుకు కుదరదని భీష్మించుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో సూట్కేసుగా ముద్రపడిన మీ తనయుడు లోకేష్ పాత్ర, అవినీతి పర్సెంటేజీల గురించి విచారణకు సిద్ధపడతారా?
8) రెండేళ్ళ పాలన పీడ కల కాదా?
మీరు ఈ రెండేళ్ళలో ప్రజల మనసు గెలుచుకునే పని ఒక్కటంటే ఒక్కటి చేయలేకపోయారు కాబట్టే, మీ పేరు చెపితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేకపోబట్టే, వందల కొద్దీ శుష్క వాగ్దానాలూ.. వేల కొద్దీ అరాచకాలు చేశారు కాబట్టే.. ప్రజల మనసు గెలుచుకోలేని మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం నిజం కాదా?
9) శాసనసభ గౌరవాన్ని దిగజార్చడం నిజం కాదా?
పార్టీ కండువాలు మార్చి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అయినా వారిని డిస్క్వాలిఫై చేయకుండా.. విప్ జారీకి కూడా అవకాశం ప్రతిపక్షానికి లేకుండా.. చివరికి ఎప్రాప్రియేషన్ బిల్లుమీద డివిజన్ ఓటింగ్ రాజ్యాంగబద్ధంగా అని తెలిసి కూడా దాన్నీ కాదనడం ద్వారా.. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పే ధైర్యం లేక పదిమందితో తిట్టించే కార్యక్రమానికి, నిలదీస్తే బహిష్కరించే ధోరణికి అంటు కట్టి శాసనసభ గౌరవాన్ని దిగజార్చటం నిజం కాదా?
10)ఇంతకీ తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలులో రేవంత్ కోట్లు ఇస్తూ దొరికిపోయినప్పుడు ఆడియోలో వాయిస్ మీది అవునా కాదా? దొరికిపోయిన మిమ్మల్ని ముఖ్యమంత్రిగా భరించాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు శిక్ష కాదా?
మీరు దొరికిపోయి ఏడాది అయినా మిమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం చార్జిషీట్లో నిందితుడిగా పేర్కొనలేదంటే.. మిమ్మల్ని కనీసం విచారణకు కూడా పిలవ లేదంటే.. మీరు ఏపీ ప్రయోజనాలతో పాటు కృష్ణా గోదావరి నదుల్ని తెలంగాణ ప్రభుత్వానికి, ఈ అంశం మీద సీబీఐ విచారణ జరగకుండా ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారన్నది నిజం కదా?
రాష్ట్రంలో ఉన్న మీడియా, మేధావులు, ప్రజానీకం అంతా ఈ అంశాలపై ఆలోచన చేయాలని బొత్సా విజ్నప్తి చేశారు.
No comments:
Post a Comment