2 June 2016

అక్కడ జనం గొంతు లో అంతటి ఆవేదన ఎందుకు

అనంతపురం: ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అనంతపురం జిల్లా లో చేస్తున్న రైతు భరోసా యాత్రలో స్థానికులతో మమేకం అయ్యారు. ఎక్కడికక్కడ ప్రజల వాణి వినేందుకు, వినిపించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పెద వడుగూరు లో ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని తూర్పారబట్టారు. 


కృష్ణారెడ్డిచిన్నవడుగూరు

నాకు 11 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. రూపాయి కట్టక్కర్లేదని చెప్పారు. కానీ ఇంతవరకు 1.5 లక్ష గోల్డ్ లోన్, 75 వేల రూపాయలు క్రాప్ లోన్ ఉంది. కేవలం 8వేల రూపాయలే మాఫీ అయింది. రెండింటికీ కలిపి 56800 రూపాయల వడ్డీ అయింది. రెండేళ్ల పాటు మేం క్రాప్ లోన్, గోల్డ్ లోన్ రెన్యువల్ చేయలేదు.. చివరకు అన్నీ కోల్పోయాం. నీటి విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. వైఎస్ ఉన్నప్పుడు మా కాలవకు 1.5 టీఎంసీ కేటాయించారు. చంద్రబాబు పుణ్యాన వర్షాలు లేక, డ్యాముల్లో నీళ్లు లేక అవీ రావడం లేదు. చివరకు జేసీ బ్రదర్స్ కలిపి అన్యాయం చేస్తున్నారు. 70 రోజులు ఇస్తామన్నారు, కనీసం 50 రోజులు కూడా రావడం లేదు. జగనన్న సీఎం అయితేనే మన రైతుల సమస్యలు తీరుతాయి



మల్లయ్యముత్యాల

నాకు 4 ఎకరాల భూమి ఉంది. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. బ్యాంకులో 25 వేల రుణం ఉంది. అది కూడా మాఫీకాలేదు. వడ్డీలకే సరిపోతోంది. రూపాయి కూడా రాలేదు వడ్డీ భారం కూడా పడింది. అది కూడా కలిపి కట్టమంటున్నారు. పంటబీమా కూడా రాలేదు. ఈ సంవత్సరం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వబోమని అంటున్నారు. పబ్లిగ్గా బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు.. చంద్రబాబుకు ఏం చెబుతాం.


రామచంద్రరాజుమేడిమాకులపల్లె

నాకు 8 ఎకరాల భూమి ఉంది. గోల్డ్ లోన్ 80 వేలు, క్రాప్ లోన్ 80 వేలు ఉంది. అందులో 12వేలు పోయిందన్నారు. మళ్లీ 8వేలు ఎదురు వడ్డీ కట్టాం. 2 రూపాయల వడ్డీ కట్టుకుంటున్నామన్నారు. ఆ పొద్దు ఆయన కట్టొద్దని అన్నారు కాబట్టి కట్టలేదు. ఇప్పుడు వాళ్ల పుణ్యాన అధిక వడ్డీ కట్టాల్సి వస్తోంది. బంగారం వేలం వేస్తామని నోటీసులు వస్తే భూములు తాకట్టు పెట్టి బంగారం విడిపించుకున్నాం. రైతుకు చక్రవడ్డీ పడుతోంది. పంటబీమా రూపాయి కూడా రాలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ రాదన్నారు. విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. ఈయనొస్తే మళ్లీ వర్షాలు రావు. మేం బతికుంటే మళ్లీ ఆయనకు మాత్రం ఓటు వేయం.



చంద్రావతిడ్వాక్రా మహిళ

 మా గ్రూపులో 15 మంది ఉన్నాం. 5 లక్షల రుణం తీసున్నాం. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెబితే టీడీపీకి ఓట్లు వేశాం. చంద్రబాబు చెప్పినందుకు అప్పుకట్టలేదు. అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మూడు నెలలకే 30 వేల వడ్డి వచ్చింది.


No comments:

Post a Comment