హైదరాబాద్: కరువు, తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, రైతాంగ సమస్యల మీద ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నా విజయవంతం అయింది. అనేక చోట్ల ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా మమేకం అయ్యారు.
చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఎప్పటిలాగే కరువు వచ్చి రాష్ట్రంలో తిష్ట వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రం అయిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ తాగునీటి ఎద్దడి తీవ్రంగా నెలకొంది. అటు పశువులకు గ్రాసం, నీరు దొరకని స్థితి నెలకొంది. దీంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యతను గాలికి వదిలేసింది.
ప్రజల తరపున ప్రశ్నించాల్సిన బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఈ బాధ్యతను తీసుకొంది. ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని గుర్తుచేస్తూ ధర్నాలకు దిగింది. మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగింది. ఎక్కడికక్కడ ఖాళీ బిందెలతో ప్రదర్శనలు చేపట్టింది. ప్రజల్ని చైతన్యపరుస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు.
మండుటెండల్లో అష్ట కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజానీకం ఈ ఆందోళనలకు బాగా స్పందించారు. వాడ వాడలా ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్ల లో నిర్వహించిన ధర్నా కు విశేష స్పందన లభించింది. మాచర్ల పట్టణ వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. మండుటెండల్ని లెక్క చేయకుండా అభిమానులు తరలి వచ్చారు. ఇదే స్ఫూర్తి వివిధ జిల్లాల్లోని మండల కేంద్రాల్లో కనిపించింది. పెద్ద ఎత్తున అభిమానులు, సామాన్య ప్రజానీకం ఉత్సాహంగా ఆందోళనల్లో పాలుపంచుకొన్నారు.
No comments:
Post a Comment