- బాబు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు
- ఏపీ ఎడారిగా మారుతున్నా పట్టించుకోవడం లేదు
- కాపునిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- టీడీపీ పాలనలో పూర్తిగా విఫలమైందని బొత్స ఫైర్
హైదరాబాద్ః ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి చేకూరే లబ్ధి ఏమీలేదంటూ స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం సిగ్గు చేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్రం హోదా ఇవ్వకపోతే ఏం చేసేదనీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడతారా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఏపీ ఎడారిగా మారుతున్న బాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలు పూర్తయితే రాయలసీమలో తీవ్ర కరువు వస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీలు విఫలం చెందింది కానీ ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు విఫలం చెందలేదని ఆయన వివరించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.
జీవో 16 ఏమిటి బాబు..?
బాబు సర్కార్ విడుదల చేసిన జీవో నంబర్ 16ను గమనిస్తే మొత్తం చంద్రబాబు తన వ్యక్తిగత స్వలాభం కోసం ఆరాటపడడం స్పష్టంగా కనిసిస్తుందన్నారు. కొందరు వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని సీఎం మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. కాపులపై బాబుకు చిత్తశుద్ధే లేదని బొత్స దుయ్యబట్టారు. బాబు జూన్ 8న ప్రమాణస్వీకారం చేస్తే... ముద్రగడ పద్మానాభం ఆగస్టు 21న లేఖ రాశారని, సంవత్సర కాలంగా కాపులపై బాబు కాలయాపన చేశారు తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. మంజూనాథ కమిషన్ను జనవరిలో వేసి, ఏడు నెలలు కాలపరిమితి విధించారని, అందులో ఇప్పటికే నాలుగు పూర్తయిందన్నారు. అయినా ఇప్పటివరకు మంజూనాథ కమిషన్ ఏమాత్రం పురోగతి సాధించలేదన్నారు. కాపుల గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
గత సంవత్సరంలో వంద కోట్లు కేటాయించి 67 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు అసలు లేదు.. ఈ సంవత్సరం వెయ్యి కోట్లు విడుదల చేశారు. వంద కోట్లు కూడా ఖర్చు కాలేదన్నారు. బాబుకు నిజంగా కాపులపై చిత్తశుద్ధి ఉంటే... ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఎన్ని నిధులు కేటాయించి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేస్తూ, మాయమాటలు చెబుతున్న వ్యక్తి చంద్రబాబాని బొత్స అన్నారు. డబ్బా కొట్టుకోవడమే తప్ప బాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఏ కులానికి సంబంధించైనా భవనాలు నిర్మిస్తే ఆ కులంలో పుట్టిన మహోన్నత వ్యక్తుల పేర్లు పెట్టుకుంటారని కానీ బాబు తన పేరును పెట్టుకొని కాపులను కించపరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాబు గౌరవాన్నిఇచ్చి పుచ్చుకోవాలని, అగౌరవపర్చే చర్యలను కట్టిపెట్టాలని సూచించారు.
ప్రధానితో ఏం మాట్లాడారు?
రాష్ట్రంలో కరువు పరిస్థితి దారుణంగా ఉందన్న సంగతి అందరికీ తెలుసని, సుప్రీం కోర్టు సైతం కరువుపై ఆయా రాష్ట్రాలను తగు చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు. ఈ నెల 17న ప్రధానితో బాబు భేటీ సందర్భంగా ప్రత్యేక హోదా, రాష్ట్రంలో నెలకొన్న జలవివాదాలు, కరువు, ఉపాధి, తెలంగాణ అక్రమప్రాజెక్టులపై ప్రధానితో చర్చించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. అయినా ఏమాత్రం చిత్తశుద్ది లేని బాబు ఇవేవీ మాట్లాడకుండా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి జరిగే మేలు ఏమాత్రం లేదని ప్రకటనలు చేయడం దారుణమన్నారు.
పార్టీలు మారినా... ప్రజాస్వామ్యం ఉంటుంది.
పార్టీలు ఈ రోజు ఉంటాయి... రేపు పోతాయి... కానీ శ్వాశ్వతంగా ఉండేదీ మాత్రం ప్రభుత్వం, ప్రజాస్వామ్యామని బొత్స పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బాబు కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏం చేస్తామని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ప్రత్యేకహోదా వద్దని బాబే చెబుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఐదువేళ్లు నోటిలోకి వెళ్లే పరిస్థితి లేకుంటే... రాష్ట్రంలో ఉపాధి కరువైతే... రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే... బాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. బాబు చేసే ప్రతిపనిలో రాజకీయ లబ్ధి తప్ప, ప్రజాలబ్ధి చూడరని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలోనే హెరిటేజ్ మజ్జిక, హెరిటేజ్ ఉప్పు, హెరిటేజ్ అవకాయలు తీసుకొస్తారని బొత్స ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
తెలంగాణ ప్రాజెక్టులపై స్పష్టమైన వైఖరి తెలపాలని బొత్స బాబును డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల టీడీపీకి జరిగిన మేలు ఏమీ లేదని... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. బాబుకు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒక్కరి చేతనైనా రాజీనామా చేయించి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆయన సవాల్ విసిరారు. రాజధాని భూములపై సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తే దానిపై ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ భూములపై ఎందుకు తేలుకుట్టిన దొంగలా వ్యవహారిస్తున్నారని నిలదీశారు.
రోను తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో రోను తుఫాను భీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ తెలిపిందని, దీనిపై ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్లకు, ప్రకటనలకు శాశ్వతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంతకు ముందు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికార యంత్రాంగం పని చేయాలని ఆయన సూచించారు. ప్రాణ, ధన నష్టాన్ని కాపాడాలని కోరారు. మామిడి, జీడి తోటలు అతలాకుతలం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ లభ్ధి కోసం కాకుండా స్వచ్ఛంధంగా నిజాయితీగా ప్రతీఒక్కరబ పని చేయాలని ఆయన సూచించారు.
No comments:
Post a Comment