- స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని తాకట్టు పెడుతున్నాడు
- అక్రమ ప్రాజెక్ట్ లతో ఏపీకి తీరని అన్యాయం
- ప్రజల శ్రేయస్సు కోసం జననేత అలుపెరగని పోరాటం
- బాబు కారణంగానే ఏపీ ఎడారిగా మారిందిః ఉమ్మారెడ్డి
కర్నూలుః రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైయస్ జగన్ జలదీక్ష చేపట్టే వరకు కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. జలదీక్ష చేపడుతానని వైయస్ జగన్ తేదీలు ఖరారు చేయగానే ....కేంద్రానికి, తెలంగాణ సీఎంకు లేఖలు రాస్తామంటూ పచ్చమంత్రులు మాట్లాడడం హాస్పాస్పదమన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రజానాయకుడు వైయస్ జగన్ అలుపెరగకుండా పోరాడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు 26 సార్లు రాష్ట్ర సమస్యలపై దీక్షలు చేశారని, నేడు 27వ జలదీక్ష చేపట్టారని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. జననేత చేపట్టిన జలదీక్ష చరిత్రలో ఓ మైలురాయిలా నిలుస్తుందన్నారు.
నీరు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి....
పాలకులు, అధికారపక్షం నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయని, రాబోయే కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుందని ఉమ్మారెడ్డి తెలిపారు. నీరు లేకపోవడంతో రైతు పంటను సాగు చేయలేక వలసలు పోతున్నారని, పశువులు కభేళాలకు తరలుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఇవేమీ పట్టని సీఎం చంద్రబాబు విలాసాల కోసం విదేశాలు తిరుగుతుంటే... మంత్రులు మాత్రం సమస్య పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న వారిపై ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల్లో ఏపీకి రావాల్సిన నీళ్ల వాటా రాకపోతే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదన్నారు. మన రాష్ట్ర హక్కులను సాధించుకోవడమే కాకుండా, ఎగువన ఉన్న రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో వైయస్ జగన్ దీక్షకు దిగారని వివరించారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపట్టి ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు.
తెలంగాణ సీఎం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు ప్రాజెక్టులకు క్లియరెన్స్ తెచ్చుకున్నారన్నారు. ఇది కేవలం ఇద్దరు ముఖ్యమంత్రుల ఒప్పందం మాత్రమేనని విభజన చట్టం 11 షెడ్యూల్లో పొందుపర్చిన విధంగా సెంటర్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కానీ, గోదావరి బోర్డుతో సంప్రదింపులు గానీ ఎక్కడ లేవన్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టులకు అనుమతి ఉందా..? లేదా..? అనే విషయం గురించి ఆలోచించకుండానే కేసీఆర్ శంకుస్థాపనలు చేసి, పని మొదలుపెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలను పక్కన పెట్టి కేవలం ఒక్క నీటిపారుదల శాఖకు మాత్రమే రూ. 25 వేల కోట్లు కేటాయించడంలోనే కేసీఆర్ ఆంతర్యం కనబడుతుందన్నారు.
అనుమతులు లేకుండా ఎగువ రాష్ట్రాలు అన్యాయానికి పాల్పడుతుంటే... చివరి రాష్ట్రంగా ఉన్న ఏపీ నాయకత్వం మాత్రం కేవలం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనే దృష్టి సారించిందని దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే సాగునీరు కాదు కదా... కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి వస్తుందన్నారు. నిద్రపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తట్టిలేపాలన్న ధృఢ సంకల్సంతోనే వైయస్ జగన్ జలదీక్ష చేపట్టారని పేర్కొన్నారు. ప్రజల అవసరాల మేరకు స్పందించే వ్యక్తి ఎవరని చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ఎవరిని అడిగినా....వారు చెప్పే పేరు ఒక్కటేనని అది వైయస్ జగన్మోహన్రెడ్డి అని ఉమ్మారెడ్డి అన్నారు.
తెలంగాణ భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు జలదీక్షను విరమించాలంటూ హెచ్చరికలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణాడెల్టాల నోరుకొట్టి నీరంతా తెలంగాణకు వాడుకోవాలనుకునేదీ స్వార్థమా కాదా అనేదీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కర్నూలు కాకుండా హైదరాబాద్లో దీక్షలు చేయాలని కృష్ణమూర్తి అనడం సిగ్గు చేటన్నారు. కర్నూలులో దీక్ష చేస్తే ఆయనకు నిద్రపట్టడం లేదని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ చేయలేని పనిని ప్రతిపక్షంలో ఉండి వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారని వివరించారు.
ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు కరువు, ప్రత్యేకహోదా, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, పోలవరం ఇలా ఎన్నో సమస్యలున్నా ఒక్కదానికి కూడా పరిష్కార మార్గం తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కరువనే మాట రాయలసీమలో వినబడకుండా చేస్తానన్న బాబూ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి భేటీలో ఎందుకు రాష్ట్ర సమస్యలపై చర్చించలేదని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి చంద్రబాబు తిండి, నీరు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. నదులపైన ఎక్కడా ప్రైవేట్ పంపులు పెట్టకూడదన్న నిబంధన ఉన్నా మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు దానిని విస్మరించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఎడారిగా మారాడానికి చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు.
No comments:
Post a Comment