10 May 2016

ప్రత్యేక హోదా ఒక సంజీవని అని అంటున్నదేవరు ?

హైదరాబాద్) వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాను కోరుతూ జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో కాకినాడ లో ధర్నా ఏర్పాటైంది. అన్ని విధాలా చితికిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవని అని వైయస్సార్సీపీ అభిప్రాయ పడుతోంది. హోదా తో ఒనగూరే టాప్ టెన్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. 
1. కేంద్ర గ్రాంట్లు 90శాతం వ‌స్తాయి
ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు ప‌న్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, లోన్ ద్వారా రాష్ట్రాల‌కు సొమ్ము అందుతుంది. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించ‌న‌క్క‌ర‌లేని సొమ్ము. అదే లోన్ అయితే తిరిగి చెల్లించాలి.  ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల‌కు కేంద్ర ఇచ్చే గ్రాంట్లు 30శాతానికి మించి ఉండ‌వు. అంటే ఏ ప‌థ‌కం, ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా... కేంద్రం గ్రాంట్ పోనూ మిగ‌తా 70శాతం లోనుగానే వ‌స్తుంది. అదే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్ 90శాతం అందుతుంది. లోన్ కేవ‌లం 10శాతం ఉంటుంది.
2. ప్ర‌త్యేక హోదాతోనే భారీ పారిశ్రామిక రాయితీలు...
- దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చారు. ఆ 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చినందునే ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు భారీగా వ‌చ్చాయి. మిగ‌తా రాష్ట్రాల‌కు అర‌కొర పారిశ్రామిక రాయితీలు ల‌భిస్తే ప్ర‌త్యేక హోదా రాష్ట్రాల‌కు అత్యంత భారీగా పారిశ్రామిక రాయితీలు ద‌క్కాయి.
3. చంద్ర‌బాబు నాయుడు   ఏమంటున్నారంటే... ప్ర‌త్యేక హోదా వేరు - పారిశ్రామిక రాయితీలు వేరు అంటున్నారు. ఇది అబద్ధం. ప్ర‌త్యేక హోదా లేకుండా దేశ చ‌రిత్ర‌లో ఏ ఒక్క రాష్ట్రానికి అటువంటి భారీ పారిశ్రామిక రాయితీలు ల‌భించ‌లేదు. ఇది తెలిసీ చంద్ర‌బాబు అబద్ధాలు చెప్ప‌టం మ‌రీ దారుణం.
4. వేల‌కొద్దీ ప‌రిశ్ర‌మ‌లు, వాటితో పాటు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు రావాల‌న్నా క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా కావాలి. హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌... ఉద్యోగాల వెల్లువ‌
5. ప్ర‌త్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక యూనిట్ల‌కు 100శాతం ఎక్సైజ్ డ్యూటీ మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఆదాయం మీద ప‌న్నులో (ఇన్‌క‌మ్ ట్యాక్స్ - ఐటి) కూడా రాయితీ ల‌భిస్తుంది. ప‌న్ను మిన‌హాయింపులు, ఫ్రైట్ రీయింబ‌ర్స్‌మెంట్‌లు ద‌క్కుతాయి. ప్ర‌త్యేక హోదాతో దక్కే ఇలాంటి రాయితీలు ఉంటేనే మిగ‌తా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద‌పెద్ద కంపెనీల పారిశ్రామిక వేత్త‌లు రెక్క‌లు క‌ట్టుకు వ‌స్తారు. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌స్తాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు స‌మ‌కూర‌తాయి.
6.ప్లాంట్లు, యంత్రాల మీద పెట్టే పెట్టుబ‌డిలో 30శాతం రాయితీ ల‌భిస్తుంది. కొత్త‌గా ఏర్పాటయ్యే ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు, ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న నాటికే ఏర్పాటై... ఆ త‌ర్వాత విస్త‌ర‌ణ చేప‌ట్టిన ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.
7.పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు తీసుకునే వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌పై 3 శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.  ప‌రిశ్ర‌మ‌లకు 20 ఏళ్ళ‌కు త‌గ్గ‌కుండా విద్యుత్ చార్జీల‌పై 50 శాతం రాయితీ ల‌భిస్తుంది. మ‌న రాష్ట్రంలో ఉన్న ఔత్సాహికులు సొంతంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌డానికి ఈ నిర్ణ‌యాలు దోహ‌దం చేస్తాయి. మ‌ధ్య‌, చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు ప‌నికి వ‌స్తాయి. 
 8.కేంద్ర సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఏర్పాటు స‌మీకృత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కేంద్రాల ఏర్పాటులో పెట్టుబ‌డుల తీరును ప్ర‌త్యేక హోదా మారుస్తుంది. ప్ర‌భుత్వ రంగంలోని ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి కూడా భారీ పెట్టుబ‌డుల‌తో ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
9.  ప‌న్ను రాయితీలు, ప్రోత్సాహ‌కాల వ‌ల్ల మ‌నం కొనుగోలు చేస్తున్న అనేక వ‌స్తువుల ధ‌ర‌లు స‌గానికి స‌గం త‌గ్గే అవ‌కాశం ఉంది. ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల మీద 100 శాతం ప‌న్ను రాయితీలు ల‌భిస్తే ఏ రాష్ట్రంలోనూ ల‌భించ‌నంత చౌక‌గా మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌స్తువులు అందుతాయి.
 10. హోదా ఉంటే మ‌న నీటి ప్రాజెక్టుల్ని కేంద్ర‌మే క‌డుతుంది.  యాక్సిల‌రేటెడ్ ఇరిగేష‌న్ బెనిఫిట్ ప్రోగ్రామ్‌(ఏఐబీపీ) అనేది కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల‌కు నిధులు ఇచ్చే కార్య‌క్ర‌మం. ప్ర‌త్యేక హోదా లేని రాష్ట్రాల‌కు ఈ ప‌థ‌కం కింద ప్రాజెక్టులు వ‌చ్చినా మ‌హా అయితే 25 నుంచి 50 శాతం నిధులు గ్రాంట్‌గా ఇస్తారు. అదే ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 90శాతం నిధుల‌ను కేంద్ర‌మే గ్రాంట్‌గా ఇస్తుంది.    ఎక్స్‌ట‌ర్న‌ల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల‌కు సంబంధించి విదేశీ రుణ భారాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంది. రుణంలో 90శాతం మొత్తాన్ని కేంద్ర‌మే గ్రాంటుగా ఇస్తుంది.  ఆ రుణంపై వ‌డ్డీ కూడా కేంద్ర‌మే క‌డుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రత్యేక హోదా ను సంజీవని గా వైయస్సార్సీపీ అభివర్ణించింది. ఇందుకు తగినట్లుగా హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది.

No comments:

Post a Comment