15 April 2016

విలువలతో కూడిన పాలన ఇవ్వాలన్నదే వైఎస్ జగన్ లక్ష్యంః వైఎస్సార్సీపీ నేతలు

  • చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
  • ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఎరగా వేస్తున్నాడు
  • గత తొమ్మిదేళ్లలో, ఇప్పుడు బాబు చేసిందేమీ లేదు..అంతా శూన్యం
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ  వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అవినీతి సొమ్ముతో డబ్బులు, మంత్రి పదవులు ఎరగా చూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని బాబుపై ధ్వజమెత్తారు. గ‌తంలో సీఎంగా తొమ్మిదేళ్ల‌లో ఎలాంటి అభివృద్ధి  చేయ‌ని చంద్ర‌బాబు.. ఈ మూడేళ్ల‌లో ఏం చేస్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.  నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి కొర‌వ‌డింద‌ని, ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితేనే అభివృద్ధి చేస్తామని చెప్పడం దారుణమన్నారు.  అన్ని వ‌ర్గాలు, ప్రాంతాలకు స‌మాన ప్రాధాన్య‌మిస్తూ అభివృద్ధి చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. చంద్ర‌బాబు వ్య‌క్తిత్వం లేనివారు కాబ‌ట్టే ప్ర‌తిప‌క్షనేత జ‌గ‌న్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. విలువ‌ల‌తో కూడిన పాల‌న అందివ్వాల‌న్న‌దే  వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌చే ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని, పార్టీ మారితే ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్య‌త వారిపై ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

చంద్ర‌బాబును న‌మ్మే వ్య‌క్తులు ఇంకా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్నారా? అని చంద్ర‌గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు సొంత ఊరు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా చెబుతున్నాన‌ని, చంద్ర‌బాబు ఎలాంటి న‌య‌వంచ‌కుడో, వెన్నుపోటుదారుడో చెప్పాల్సిన ప‌ని లేద‌న్నారు. పిల్ల‌నిచ్చిన మామ‌కే వెన్నుపోటు పొడిచిన‌వాడ‌ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చ‌నిపోయేంత‌వ‌ర‌కు ఎక్క‌డా ఆయ‌న ఫొటో పెట్ట‌ని బాబు..ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఫొటో పెట్టుకొని ప‌బ్బం గ‌డుపుకుంటున్న న‌మ్మ‌క‌ద్రోహి అని దుయ్య‌బ‌ట్టారు. హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లను వాడుకొని వ‌దిలేశార‌ని,  త‌మ్ముడు రామ్మూర్తినాయుడిని తొక్కేశారని అన్నారు. జ‌గ‌న్‌ను వీడి వెళ్లిన ఎమ్మెల్యేలంతా జీవితాంతం బాధ‌ప‌డ‌తార‌న్నారు. వైఎస్సార్‌సీపీని వీడిన భూమా నాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని న‌మ్మించి, నేడు ప‌ట్టించుకోవట్లేద‌న్నారు. 

తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే సంత‌లో ప‌శువుల్లా కొంటున్నార‌న్న చంద్ర‌బాబు... ఏపీలో ప‌శువులు త‌క్కువ‌య్యాయ‌ని చేర్చుకుంటున్నారా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఫైరయ్యారు.  కొంత‌మంది పార్టీని వీడినంత మాత్రాన వైఎస్సార్‌సీపీకి కిలిగే న‌ష్ట‌మేమీ లేద‌న్నారు. త‌న‌ది ప్ర‌లోభాల‌కు లొంగే వ్య‌క్తిత్వం కాద‌ని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న‌దొర అన్నారు. క‌ష్టాల‌కు త‌లొగ్గే మ‌న‌స్తాత్వం కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముంద‌ర, వ‌చ్చిన త‌ర్వాత కూడా టీడీపీ నుంచి ఆఫ‌ర్ల వ‌చ్చాయ‌న్నారు. త‌న నిర్ణ‌యం వైఎస్సార్ ఆశ‌య‌సాధ‌నేన‌ని, వైఎస్ జ‌గ‌న్ బాటలో న‌డ‌వ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో పార్టీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జిల్లా ఇన్‌చార్జి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం పార్టీ ఇన్‌చార్జి శ్రీ‌నివాస‌రావు, రాష్ట్ర నాయ‌కుడు జ‌ర‌జావు ఈశ్వ‌ర‌రావు, ప‌ట్ట‌ణ‌, మండ‌ల అధ్య‌క్షుడు సూరిబాబు, అర్బ‌న్‌బ్యాంక్ చైర్మ‌న్ నాగేశ్వ‌ర‌రావు, జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాబ్జితో పాటు ప‌లువురు మండ‌లాల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment