5 April 2016

దొంగ దెబ్బ తీయటంలో చంద్రబాబు మార్కు చేతివాటం

  • నిన్న విద్యుత్ చార్జీలు బాదిన చంద్రబాబు ప్రభుత్వం
  • నేడు ఆర్టీసీ ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధం

హైదరాబాద్: ప్రజల జేబులకు చిల్లు పెట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం దొడ్డి దారిని ఎంచుకొంది. విద్యుత్ చార్జీలను చాటు గా పెంచుకొంటున్న సర్కారు... తాజాగా ఆర్టీసీ చార్జీల్ని బాదేస్తున్నారు. డీలక్స్ బస్సుల రంగు మార్చి ఏకంగా 10 శాతం మేర రేట్లు పెంచేస్తున్నారు.
విద్యుత్ ఛార్జీల వడ్డన
విద్యుత్ ఛార్జీలను నేరుగా పెంచితే విమర్శలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావించింది. అందుకే నిరుటి బిల్లింగ్ ప్రాతిపదికన శ్లాబులు వర్తిస్తాయంటూ కొత్త పల్లవి అందుకొంది. అంటే గత ఏడాది కాలంలో ఏదో ఒక సమయంలో కాస్త ఎక్కువ కరెంటు ఉపయోగించుకొని ఉన్న కుటుంబాలకు కూడా అధిక కరెంటు వాడకందారుల జాబితాలోకి చేర్చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నెత్తిన భారం పడుతోంది.
పాత బస్సులకు కొత్త రంగులు
ఆర్టీసీ లో డీలక్స్ బస్సుల్ని క్రమంగా కొత్త రంగులు వేసి అల్ట్రా డీలక్స్ బస్సులుగా మారుస్తున్నారు. అంటే పాత బస్సులకే కొత్త రంగులు వేస్తున్నారు. అదనంగా పుష్ బ్యాక్ సీట్లను మార్చి కొంత మేర సౌకర్యాలు కల్పిస్తారంతే. దీనికి గాను 10 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. మొత్తంగా 10 లక్షల మంది ప్రయాణికుల మీద ఈ ప్రభావం పడుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల మీద సగటున రూ. 30 నుంచి రూ. 50 దాకా అదనపు భారం పడనుంది. దీంతో ఛార్జీల మోత మోగుతోంది.
చంద్రబాబు మార్కు దోపిడీ
చంద్రబాబు పాలన అంటేనే చార్జీల మోతకు పెట్టింది పేరు. అయితే నేరుగా పెంచితే విమర్శలు వస్తాయన్న ఆలోచనతో దొంగ బాదుడుకి పాల్పడుతున్నారు. ప్రజల నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారు.

No comments:

Post a Comment