3 April 2016

నిరుద్యోగ యువతకు వైవి సుబ్బారెడ్డి చేయూత

  • ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక కృషి
  • స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ల ద్వారా శిక్షణ
  • బాబు ప్రజలను మభ్యపెడుతున్నారు
  • ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేశాయిఃవైవి
హైదరాబాద్ః చంద్రబాబుకు అమరావతి ధ్యాస తప్ప ప్రజాసమస్యలే పట్టడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎంపీ ఒంగోలులో జాబ్ మేళా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గానీ , రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో గానీ  బాబు ఘోరంగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. పక్కన తెలంగాణ ప్రభుత్వం గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ తీసుకొస్తుంటే..బాబు మాత్రం ఏపీలో ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైరయ్యారు. 

అన్ని విధాలుగా వెనుకబడిన ప్రకాశం జిల్లాను...విభజన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని వైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం జిల్లాలో లక్షా 20 వేల మంది యువత ఎదురుచూస్తున్నారని చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి లేకపోవడం, వెనుకబడిన జిల్లా కావడమే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. యువతీయువకులు నిరుత్సాహ పడకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకే ...ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వైవి తెలిపారు.

ఉద్యోగ కల్పనతో  పాటు ఈసారి నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఐఎల్ఎఫ్ ఎస్ , ప్రకాశం స్కిల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో  దీన్ని నెలకొల్పినట్లు చెప్పారు.  అవకాశాలు కోల్పోయిన వారికి ప్రతినెల ట్రైనింగ్ , స్టైపండ్ ఇచ్చి ఉద్యోగాలు లభించేలా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లు కృషిచేస్తాయన్నారు.  జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషిచేస్తానని వైవి స్పష్టం చేశారు. 

జిల్లాలో ఆర్మీ రిక్రూట్ మంట్ డ్రైవ్ పెట్టించేందుకు ఇటీవలే రక్షణ శాఖామంతితో  కూడా మాట్లాడడం జరిగిందని వైవి తెలిపారు. జిల్లా పీఆర్డీఏ సహకారంతో నిరుద్యోగులను ఆదుకునేందుకు కృషిచేస్తామన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాల్లో చేర్చాలని ప్రధానిని, ఆర్థికమంత్రిని  కోరామన్నారు. వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.  పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో రామయ్యపట్నం అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్రప్రభుత్వం ఒప్పుకుందని వైవి తెలియజేశారు.   

గత సంవత్సరం జిల్లాలోని నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించినప్పుడు...7800 మంది వస్తే సుమారు వేయిమందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు.  కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కంపెనీలు  రాష్ట్రానికి రాకపోవడం వల్లే అలా జరిగిందన్నారు. ఈరెండు పరిష్కరించే దిశగా ఈసారి జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 47 కంపెనీలు జిల్లాకు వచ్చాయని తెలిపారు.  

No comments:

Post a Comment