అంబేద్కర్ ఆశయాలకు పాతర
ఓ కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలకు ఎర
హైదరాబాద్: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఆశయాలకు పాతర వేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాబుకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అంటూ...ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం నీచమన్నారు. బాబు ఎస్సీల పట్ల, భారత రాజ్యాంగం పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడని అంబటి ఫైరయ్యారు.
ఒక కులాన్ని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు వారికి క్షమాపణ చేప్పకుండా దళితుల ఆరాధ్యదైవమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు 125 అడుగుల దండ వేస్తామని చెప్పడం హస్యాస్పదమన్నారు. నాస్తికుడు తిరుపతిలో పూజలు చేస్తామంటే నమ్మాలా అని ప్రశ్నించారు. దళితులను అవమానపరిచిన చంద్రబాబు అంబేద్కర్కు నివాళులర్పించడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలో సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చంంద్రబాబు కేసీఆర్ను విమర్శించారని, మరీ ఆంధ్రలో ఆయన చేస్తున్నదేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి... అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నారని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేశారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు పడాలన్నారు.
చంద్రబాబుకు రాజ్యాంగంపై గౌరవం లేదు కాబట్టే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు. గతంలో రూ. 20 నుంచి రూ. 30 కోట్లకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగా... ఇప్పుడు ఆ రేటు మరింత పెరిగిందని, రూ. 40 నుంచి రూ. 50 కోట్లను ఎమ్మెల్యేలకు ఎరగా చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయడంలో చంద్రబాబుని మించిన దిట్ట మరెవరూ లేరని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ధర్మమేనా బాబు అని నిలదీశారు. చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు.
No comments:
Post a Comment