29 March 2016

కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా బాబుకు లేదు

  • రూ.1600 కోట్లు నీళ్ల పాలు జేశారు
  • పట్టిసీమలో స్టోరేజ్ కెపాసిటీ లేకున్నా..
  • ప్రాజెక్ట్ పూర్తిచేశామని బాబు చెప్పుకోవడం విడ్డూరం
  • జలవనరులపై నోరెందుకు పెగలడం లేదు బాబు 
  •  ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసు బయటకు తీస్తారని భయం
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్: చంద్రబాబు పట్టిసీమ పేరుతో 1600 కోట్ల రూపాయలను నీటి పాలు చేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమలో స్టోరేజ్ కెపాసిటీ లేకున్నా...పట్టిసీమ పూర్తిచేశామని బాబు గొప్పగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. రూ. 1600 కోట్లు పోలవరానికి కేటాయింపులు చేస్తే ఓ కొలిక్కి వచ్చేది. గాలేరి నగరికి, హంద్రీనీవాకు  ఖర్చుపెట్టి ఉంటే ప్రాజెక్టే పూర్తయ్యేదని వైఎస్ జగన్ చెప్పారు. అవేమీ చేయకుండా చంద్రబాబు రూ.1600 కోట్లు పట్టిసీమలో పెట్టి నీళ్లపాలు జేశారని ధ్వజమెత్తారు. 

ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్ట్పై చర్చలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాను కాపాడానని చంద్రబాబు చెబుతుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు.  180 టీఎంసీల నీరు అవసరమయ్యే కృష్ణా డెల్టాకు,  4 టీఎంసీల నీళ్లు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇచ్చానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు..మా చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నాడని వైఎస్ జగన్ ఫైరయ్యారు. తెలియని వ్యక్తికి చెప్పొచ్చు, తెలిసిన వ్యక్తితో మాట్లాడవచ్చు.అన్నీ తెలుసనే అజ్ఞానితో మాట్లాడడం ఎవరితరం కాదన్నారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా ఉందని వైఎస్ జగన్ చురక అంటించారు. 

పోలవరం ప్రాజెక్టులో 190 టీఎంసీల స్టోరేజ్ ఉందని, అందుకే అది పోల"వరమైందని" చెప్పారు. స్టోరేజ్ కెపాసిటీ కోసమే పోలవరం ప్రాజెక్ట్ను దశాబ్దాలుగా స్టడీ చేసి ప్రతిపాదించారని పేర్కొన్నారు. పోలవరం కుడికాలువలో 70 శాతం పనులు దివంగత మహానేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయడం వల్లే...దాంట్లోంచి నీళ్లు ఇలా కిందికి వస్తున్నాయని చంద్రబాబు చెప్పగలుగుతున్నారన్నారు.  వైఎస్ జగన్ ప్రసంగానికి అడుగడుగునా బాబు అడ్డు తగిలారు. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. 

ఈసందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...తాను ఐదు నిమిషాలు కూడా మాట్లాడకముందే బాబు మధ్యలో లేవడం గంటలకొద్దీ మాట్లాడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు  వైఎస్ జగన్ ను ఉద్దేశించి యంగ్ టైగర్ అని సంభోదించగా..జననేత మాట్లాడుతూ బాబు తాను అవుట్ డేటెడ్ అయిపోయానని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీటిని తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే చంద్రబాబు ఎందుకు స్పందించలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. జలవనరుల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రతో మంతనాలు జరుపుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. చంద్రబాబుకు కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేదని విమర్శించారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసును బయటకు తీస్తారని బాబు భయపడుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment