ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్ను ఒకరోజు వాయిదా వేసినట్లు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఈనెల 28న బంద్ నిర్వహించాలని పిలుపునివ్వగా, అదేరోజు వరలక్ష్మి వ్రతం ఉందని, శ్రావణమాసంలో మహిళలు చాలా పవిత్రంగా భావించే ఈరోజున బంద్ పాటించడం భావ్యం కాదని, తర్వాతి రోజైన 29వ తేదీకి వాయిదా వేశామన్నారు. కాగా, వైఎస్ఆర్సీపీ ధర్నాతో స్పెషల్ ప్యాకేజీలంటూ టీడీపీ నేతలు కొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. ప్యాకేజీలు టీడీపీ నేతలు పంచుకోడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, అందుకే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఆయన ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందన్నారు.
No comments:
Post a Comment