మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి నది పుష్కరాలకు తరలివచ్చే యాత్రికులకు సేవలు అందించడానికి గాను తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమౌతున్నాయి. యాత్రికుల సౌకర్యార్థం రోజుకు 10 ఉచిత బస్సులు నడడపం, పసిపిల్లలకు పాలు పంపిణీచేయడం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం, మంచినీరు సరఫరా చేయడం, యాత్రికుల సామాను భద్రపరిచేందుకు గాను క్లోక్ రూమ్లు ఏర్పాటు చేయడం, ఘాట్ల వద్ద సేవాదళ్ సహాయ కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులకు వీల్ చెయిర్లు ఏర్పాటు చేయడం, డాక్టర్ వైఎస్ఆర్ సమాచార కేంద్రాలు నెలకొల్పడం, డస్ట్బిన్లను ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమౌతున్నది. పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఈ వివరాలను వెల్లడించారు. కలెక్టర్ అరుణ్కుమార్ను కలసి పుష్కరసేవలకు సంబంధించిన పది అంశాలతో కూడిన పత్రాన్ని అందించారు. అంతకుముందు పార్టీ నేతలు గాంధీనగర్లో సమావేశమై పుష్కరాలలో అందించే సేవలపై చర్చించారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ఇందులో పాల్గొన్ని సూచనలు, సలహాలు అందించారు. ఏఏ ప్రాంతాల్లో ఎవరు సేవలు అందించాలి..? యాత్రికుల రద్దీ అధికంగా ఉండే ఘాట్లేవి.. వంటి అంశాలను చర్చించారు.
No comments:
Post a Comment