3 July 2015

అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు

 ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదు?
 వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి
  కాకినాడ: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చేసి సంపాదించిన డబ్బును తెలంగాణలో బేరసారాలకు ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
  ఓటుకు కోట్లు కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదో అర్ధం కావడం లేదని జగన్ పేర్కొన్నారు. సెక్షన్ 8 ముసుగులో చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారని జగన్ విమర్శించారు. ఎన్‌డీ తివారీకి ఒక న్యాయం చంద్రబాబుకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న లంచాలతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన ఇలా అన్నారు... ‘‘సెక్షన్ 8 అనే టాపిక్‌ని చంద్రబాబు ఇవాళ ఎందుకు ముందుకు తీసుకువచ్చాడంటే టాపిక్‌ను డైవర్ట్ చేయడం కోసం. టాపిక్ డైవర్షన్ ఎందుకంటే నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్న డబ్బును పక్కరాష్ర్టంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం ఇస్తూ పట్టుబడిన పరిస్థితి రాష్ర్ట చరిత్రలోనే కాదు బహుశా దేశచరిత్రలోనే ప్రథమం కావచ్చు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదు కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవ్వడానికి నేరుగా సంభాషణలు జరిపాడు. వీడియో రికార్డులు ఉన్నాయి. ఆడియో రికార్డులు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 20 కోట్లంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వీడియో టేపులు దొరికాయి. ఇంత పబ్లిగ్గా అవినీతికి పాల్పడిన చంద్రబాబుని ఇంకా అరెస్టు చేయకపోవడం బాధనిపించే విషయం. ఎన్‌డీ తివారీ పట్టుబడినపుడు కథలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని చంద్రబాబు ఎంత రక్షించాడో తెలిసిన విషయమే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చాలా గొప్పది... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం.. అని చంద్రబాబు ప్రచారం చేశాడు. ఎన్‌డీ తివారీ చేసింది చాలా అన్యాయం.. తివారీ పదవిలో ఉండగా ఇలాంటివి చేయడం చాలా దుర్మార్గం.. ఆయన వెంటనే తప్పుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశాడు. ఇదే చంద్రబాబు ఇవాళ అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోతే ఇదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నా.. ఆరోజు నీతులు చెప్పిన చంద్రబాబు ఆ నీతులు తనకు వర్తించవని అనుకుంటున్నారా..?  ఒక ముఖ్యమంత్రి 150 కోట్ల రూపాయల బ్లాక్‌మనీతో అవినీతి చేస్తూ సాక్ష్యాలతో సహా పట్టుబడినా పదవిలో కొనసాగే హక్కు, నైతిక అర్హత ఎక్కడ ఉంటాయి.... అని అడుగుతున్నా..’’ అని జగన్ అన్నారు..
 మత్స్యకార కుటుంబాలకు బాబు సర్కార్ చేసిందేమీ లేదు..
 తుఫాన్ కారణంగా మరణించిన మత్స్యకారుడు పి.వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం పర్లోపేటలో జగన్‌మోహన్ రెడ్డి  పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరణించి ఇన్ని రోజులైనా మత్స్యకారుల కుటుంబాలకు రాష్ర్ట ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మత్స్యకారుల ప్రాణాలనున చంద్రబాబే తీశారని, వాతావరణ పరిస్థితులపై కనీసం హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఎలాంటి సాయం అందడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
 అందరికీ ఒకేరకమైన పరిహారం ఉండాలి
 రాష్ర్టంలో ప్రమాద వశాత్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఎవరికైనా సరే ఒకే రకమైన పరిహారం ఉండాలని జగన్ డిమాండ్ చేశారు. పబ్లిసిటీ వస్తుందంటే స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడం.. పబ్లిసిటీ రాదనుకుంటే మంత్రులు వచ్చి తూతూ మంత్రంలా రెండు లక్షలు , లక్ష పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పరిహారాన్ని ప్రకటించడమే గానీ ఆ తర్వాత అసలు ఎవరూ వచ్చి పలకరించే పాపాన పోవడం లేదని, బాధితులను ఆదుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఎవరూ రావడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ మారాలని, రాష్ర్టంలో ఎక్కడ ఎవరు ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోయినా ఐదు లక్షల పరిహారాన్ని అందించాల్సిందేనని, చంద్రబాబు వచ్చినా రాకపోయినా అందరికీ ఒకేవిధమైన పరిహారం అందేలా చూడాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. అందుకోసం రాష్ర్టప్రభుత్వంపై తాము తీవ్రంగా వత్తిడి తీసుకువస్తామని, అందరినీ ఆదుకునేలా చూస్తామని మత్స్యకార కుటుంబాలకు జగన్ హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment