2 June 2015

బాబే ఎ-1 నిందితుడు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి డబ్బుతో కొనాలని చూసిన ఉదంతంలో చంద్రబాబును ఎ-1 నిందితునిగా చేర్చాలని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి ఈమేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  సంతలో పశువులను కొన్నట్లుగా, కౌన్సిల్ ఎన్నికల్లో చంద్రబాబునాయుడుగారు ఎమ్మెల్యేలను డబ్బులతో కొనాలని చూశాడన్నారు. అందుకు సంబంధించిన వీడియో టేపులు, ఆడియో టేపులు మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని, అయినా చంద్రబాబును  నిందితునిగా, ఎ-1గా ఎందుకు చేర్చడం లేదని గవర్నర్‌గారిని గట్టిగా అడిగామని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే... ‘‘ఐదు కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి నల్లబ్యాగులో తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఎమ్మెల్యే ముందర 50 లక్షల రూపాయలు పెట్టి డబ్బు తీసి పంచుతా ఉంటే.. ఇది అడ్వాన్సు, ఐదు కోట్ల రూపాయల డీల్, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ నేను మిగిలిన డబ్బు ఇస్తాను అని అంటా ఉంటే, రెడ్ హ్యాండెడ్‌గా వీడియో కెమెరాలలో చిత్రీకరణ చేశారు. ఐదు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 18 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదు కోట్లు ఇస్తున్నారు. అది కూడా ఆంధ్రాకి సంబంధించిన ఎలక్షన్ కాదు. తెలంగాణకి సంబంధించిన ఎలక్షన్. ఆ ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా ఆంధ్రరాష్ర్టంపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. చంద్రబాబు నాయుడుగారి ప్రభుత్వం పడిపోవడమో మరొకటే జరిగిపోయేది కాదు. వేరే రాష్ర్టంలో, అదీ ఈయనకి బలం లేదని తెలిసీ పోటీపెట్టారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి నేను రాజకీయం చేయగలను అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉంది. ఈ వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? అవే వీడియో టేప్స్‌లో ‘‘మా బాస్ మాట్లాడతాడు, మా బాస్ చూసుకుంటాడు, మా బాస్ చెప్పాడు కాబట్టి నేను వచ్చాను, మా బాస్ బ్లెస్సింగ్స్ నీకు ఉన్నాయి’’ అని రేవంత్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పడమే కాక తన బాస్ చంద్రబాబు నాయుడు గారితో  ఏకంగా ఫోన్‌లో కూడా మాట్లాడించి హామీ ఇప్పించారన్న వీడియో టేపులు కూడా ఉన్నాయి. అయినా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం లేదు? చంద్రబాబు నాయుడుగారికి ఇంతింత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఒక ఎమ్మెల్యేని కొనడానికి ఐదు కోట్ల రూపాయలు విచ్చలవిడిగా చల్లుతున్నాడంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నట్లు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రరాష్ర్టంలో చేస్తున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు చాలా ఉదాహరణలున్నాయి. వాటన్నిటిని గవర్నర్‌గారికి కూడా సమర్పించాం. వాటన్నిటిమీద విచారణ చేయించండి. అవినీతి ఏ స్థాయిలో ఉందనేది అర్థమౌతుంది.’’ అని జగన్ వివరించారు.  వైఎస్ జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కూడా గవర్నర్‌ను కలిశారు. 

No comments:

Post a Comment