14 May 2015

17 నుంచి రాయదుర్గంలో జగన్ పర్యటన

రాయదుర్గంః వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర రాయదుర్గంలో ఈ నెల 17న ప్రారంభమవుతుందని ఆపార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైఎస్ జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. వర్షాభావంతో పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అటువంటి రైతుల్లో ధైర్యం నింపేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా యాత్ర చేపట్టారన్నారు. ఈ భరోసా యాత్ర రాయదుర్గం నియోజకవర్గంలో 13వ తేదీనే జరగాల్సి ఉందని, ప్రతిచోటా మాట్లాడాలని ప్రజలు కోరుతుండడంతో యాత్ర ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ నెల 17న రాయదుర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో, 18న డీహీరేహాళ్ మండలంలో వైఎస్ జగన్ పర్యటన సాగుతుందని చెప్పారు. ఈ యాత్రను పార్టీ శ్రేణులు, ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. 

No comments:

Post a Comment