28 May 2015

ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పెన్షన్!

 బాబు జమానాలో ఇది మామూలే
 పింఛన్ కోసం నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల్లో ఎవరైనా మృతి చెందితేనే కొత్తవారికి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాలకు ఆదేశాలు కూడా జారీ అయిపోయాయి.
  చంద్రబాబు సర్కారు నిర్ణయం వల్ల చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతోంది. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో 1000 మంది అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 186 మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేసింది. దాంతో మిగిలినవారందరూ ఉసూరుమంటున్నారు. జన్మభూమి, మండల కమిటీలు కొత్త పింఛన్‌దారులను ఎంపిక చేస్తున్నాయి. ఆ కమిటీలలో అధికారపార్టీ వారే ఉంటున్నారు. వారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు మాత్రమే అవకాశమిస్తున్నారు. దాంతో ఇతర పార్టీలకు ఓట్లేసిన వారు అనర్హులుగా సామాజిక పథకాలకు దూరంగా ఉండిపోవలసి వస్తున్నది.
  ఒకరు చనిపోతేనే కొత్తవారికి పింఛన్ అవకాశమివ్వాలన్న చంద్రబాబు నిర్ణయం  ఆశ్చర్యకరమైనదేమీ కాదు. కొత్తది అంతకన్నా కాదు. గతంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇదే విధానాన్ని అనుసరించారు. కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఉన్నవారిలో ఎవరైనా చనిపోవలసిందే. 1995-96లో వితంతు, వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల సంఖ్య మొత్తం 9.68 లక్షలు. అపుడు వృద్ధులకు రు.75, వితంతువులకు రు.50 పింఛన్ ఉండేది. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ర్టంలో వృద్ధాప్య, వితంతు,చేనేత, వికలాంగ పింఛన్లు మొత్తం 18.97 లక్షల మంది ఉన్నారు. వీటికయ్యే మొత్తం ఖర్చు 163.90 కోట్లు. అప్పట్లో పింఛన్లు 3 నెలలకోమారు గ్రామసభల్లో ఇచ్చేవారు. కొత్త పెన్షన్ కావాలంటే ఉన్న పెన్షన్‌దారుల్లో ఎవరైనా ఒకరు మరణించాల్సిందే. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టాక 2004లో రు.75 పింఛన్‌ను రు.100కు, రు.50 పింఛన్‌ను రు.75కు పెంచారు. 2005-06లో ఆ పింఛన్‌ను రు.200కు పెంచారు. 2006లో శాచురేషన్ పద్ధతిన పెన్షన్లను మంజూరు చేశారు. 21 లక్షలు ఉండే పెన్షన్లను 71 లక్షల వరకు పెంచారు. అంతేకాదు వైఎస్‌ఆర్ ప్రతినెల 1వ తేదీన ఠంచన్‌గా పెన్షన్ ఇప్పించారు.

జాబులెక్కడ బాబూ...

ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగమూ లేదు 
 ఇంటికో ఉద్యోగమన్నారు... ఉద్యోగం లేకపోతే నెలకు రెండువేల రూపాయల భృతి ఇస్తామన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊరూవాడా ఊదరగొట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, అది తమ ప్రధమ ప్రాధాన్యత అని ఎక్కడ బడితే అక్కడ పెద్దపెద్ద హోర్డింగ్‌లు, బ్యానర్లు, గోడలపై రాతలు రాయించారు. ఎన్నికలు ముగిసి పీఠం దక్కగానే అన్ని హామీలను కట్టకట్టి అటకపై పడేశారు. కొత్త ఉద్యోగాలివ్వక పోగా ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు. ఏడాది ఏలుబడిలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేదు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులకు, చిరుద్యోగులకు ఆయన నరకం చూపించారు.
  నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. విడుదలైన ఒకేఒక్క నోటిఫికేషన్ డీఎస్సీ ఉద్యోగాల భర్తీది. అయితే అందులో బీఈడీ అభ్యర్థులకు అర్హత లేకపోవడం నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది. డీఎస్సీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా చేస్తామని ఎన్నికలముందు చంద్రబాబు అనేకమార్లు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆ విషయమే మరిచిపోయారు. గడువు ముగిసిపోయే వరకు తాత్సారం చేసి ఆ తర్వాత నెపం కేంద్రంపై నెట్టివేశారు. ఎన్‌సీఈఆర్‌టీ అడ్డుచెబుతోందని కబుర్లు చెబుతున్నా పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు పోరాడి సాధించుకున్నాయి. అలాంటి ప్రయత్నమేదీ చంద్రబాబు సర్కారు చేసిన పాపాన పోలేదు. నిరుద్యోగుల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి ఇదో నిదర్శనం.
  పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్ - 4 పరీక్షలకు నిరుద్యోగులు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. కానీ ఏడాది కాలంగా ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో నిరుద్యోగుల్లో అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు మునుపటిలా మరలా మోసం చేస్తారా అని వారిలో గుబులు రేగుతోంది. వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు.
  {పభుత్వ ఉద్యోగాల ఊసే లేదు. కనీసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా దక్కుతుందా అని నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం ఏమిటంటూ యువత నిరుత్సాహంలో కూరుకుపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 58,300 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉపాథి కార్యాలయంలో పేర్లు నమోదుచేసుకున్నారు. ఇంకా ఉపాథి కార్యాలయాల్లో పేర్లు నమోదుచేయించుకోని నిరుద్యోగుల సంఖ్య ఇంకా భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 8లక్షలకు పైగానే నిరుద్యోగులున్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలలో 92 వేల మంది నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఇటీవల రాష్ర్టప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా చేయించిన సర్వేలో నిరుద్యోగుల సంఖ్య 1,03,000 మందిగా తేలింది. వీరంతా రకరకాల పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వమే ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషనూ విడుదల చేయడం లేదు.
  ఉద్యోగాల మాట దేవుడెరుగు... చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా కనీసం తమకు నిరుద్యోగ భృతి అయినా ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

27 May 2015

అక్కచెల్లెమ్మలకు మాఫీ టోపీ

‘‘రుణాలు చెల్లించకండి.. మేం అధికారంలోకి రాగానే అన్నీ మాఫీ చేసేస్తాం’’ అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా ఊదరగొట్టారు. ఆ మాటలు నమ్మిన అక్కచెల్లెమ్మలు ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు గద్దెనెక్కి ఏడాది పూర్తయింది. రుణమాఫీ చేస్తారని, దాంతో తమ బతుకులు బాగుపడతాయని మహిళలు ఆశగా ఎదురుచూశారు. బేషరతుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న మాటలు నీటి మూటలయ్యాయి. మాఫీ హామీని అమలు చేయకపోగా డ్వాక్రా సంఘాలలోని ఒక్కో సభ్యురాలికి మూడువిడతలుగా రు. 3 వేల చొప్పున మూల నిధికి జమ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఇది రుణమాఫీ కోసం ఇస్తున్నది కాదు. దానిని డ్వాక్రా సంఘాలు ఉపయోగించుకోవడానికి లేదు.  ఇచ్చేది మూలధనం కిందే అయినా రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నామంటూ తమను చంద్రబాబు నిలువునా దగా చేశారని మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా బకాయిలున్నా లేకున్నా 2014 మార్చి 31 వరకు ఉన్న సంఘాల్లోని సభ్యులందరికీ రు.3వేల చొప్పున ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని, బ్యాంకులకు మాత్రమే ఉపయోగమని మహిళలు మండిపడుతున్నారు. చంద్రబాబును నమ్ముకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని మహిళలు తమను తామే తిట్టుకుంటున్నారు. మాఫీపై తమ ఆశలు ఆవిరైపోయాయని వారు ఆవేదన చెందుతున్నారు. బాబు గద్దెనెక్కాక బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు తెచ్చిన ఒత్తిళ్లు భరించలేక మహిళలు అప్పో సప్పో చేసి తమ బకాయిలు మూడొంతులకు పైగా తిరిగి కట్టేశారు. తమ బకాయిలతో పోలిస్తే బాబుగారు చెబుతున్న మూడువిడతల ముల్లె ఏ మూలకు వస్తుందని మహిళలు వాపోతున్నారు. అయినా ఈ మూడువిడతల వ్యవహారాన్ని కూడా డ్వాక్రా మహిళలు విశ్వసించలేకపోతున్నారు. దానికి చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలే కారణం. అధికారంలోకి రాగానే అణాపైసలతో సహా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు. తీరా అందలమెక్కాక రు. 10 వేలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని నమ్మబలికారు. ఏడాది కాలంగా నాన్చుతూ చివరకు తొలి విడత రు. 3 వేల చొప్పున ప్రకటించిన చంద్రబాబు సర్కార్ ఆ మొత్తాన్ని జమ చేసేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఆధార్‌తో ఖాతాలు అనుసంధానించి ఉండాలి. క్రమం తప్పకుండా రుణాలు తిరిగి చెల్లిస్తూ ఉండాలి. అసలు వారు బతికి ఉన్నట్లు నిరూపించుకోవాలి... ఈ షరతులన్నీ నెరవేర్చితేనే రు.10వేలు మూడు విడతలుగా మూలధన ఖాతాకు జమ అవుతాయి. అంటే బాబుగారు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు.... సరికదా... అక్కచెల్లెమ్మలందరికీ కుచ్చుటోపీ పెట్టారన్నమాట....

26 May 2015

నవ నిర్మాణ దీక్ష కాదు... నవ వంచన దీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలకు ఉత్సాహపడుతున్నారు. అందులో నవనిర్మాణ దీక్ష కూడా ఒకటి. ఏడాది పాలనలో రాష్ర్ట ప్రజలకు ఏమీ ఒరగబెట్టిందే లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేసింది లేదు. ఐదు సంతకాలను అభాసుపాల్జేశారు. మాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను వంచించారు. ఇంటికో ఉద్యోగమంటూ నిరుద్యోగులను బుట్టలో వేసుకుని ఆనక చెత్తబుట్ట దాఖలా చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాట నీటి మూట అయ్యింది.  ఏడాది పాలన ఎలాంటి స్ఫూర్తినీ నింపలేదని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్వయంగా చంద్రబాబే అంగీకరించారు. ఇప్పుడు ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి నవనిర్మాణ దీక్ష పేరుతో నాటకాలాడుతున్నారు. అందుకే ఇది నవ నిర్మాణ దీక్ష కాదు.. నవ వంచన దీక్ష...

 ఐదు సంతకాలేమయ్యాయి?
 తొలి ఐదు సంతకాల్లో 1) వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్ల నుంచి 97 వేల కోట్లకు పెరిగాయి. 2) డ్వాక్రా రుణాలు అర్థ రూపాయి కూడా మాఫీ చేయలేదు. 3) బెల్టు షాపులు రద్దు కాలే దు. బెల్టు షాపులన్నింటినీ చట్టబద్ధంగా నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. 4) రిటైర్మెంట్ వయసు పెంపు అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, కార్పోరేషన్ ఉద్యోగులకు ఏ ఒక్కరికీ వర్తించటం లేదు. 5) రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అన్నది ఎక్కడా అందటం లేదు. మరి ఐదు హామీలు అమలు చేశాం అంటే దానర్థం ఏమిటి? ఐదు సంతకాలు పెట్టినా ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రిగా మీకు అద్భుతమైన రికార్డు దక్కింది చంద్రబాబు గారు.

 ప్రత్యేక హోదాను వదిలేశారే....
 ప్రత్యేక ఆర్థిక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా మీకు బాధ లేదు. మీ రక్తం సల సల మరగటం లేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోయినా మీ నరాల్లో, మీ మెదడులో చలనం లేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోనే చేసిన హామీలను కూడా నెరవేర్చకపోయినా మీ నోరే పెగలటం లేదు. ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన ప్రకటన సరిపోదని, ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఆరోజు అడిగిన వెంకయ్య నాయుడును, ఆయన పార్టీని నిలదీయటానికి మీ గుండె ధైర్యం చాలటం లేదు.  దీని అర్థం ఏమిటి చంద్రబాబు నాయుడు గారూ? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ నాయకత్వం పాదాల ముందు సాష్టాంగ పడి మోకరిల్లి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ తెర వెనుక ఒప్పందాల కోసం తాకట్టు పెట్టారా? కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు మంత్రి పదవులైతే పొందారు గానీ ఈ ఇద్దరు మంత్రుల వల్ల తెలుగు రాష్ట్రాలకు అర్థ అణా మేర ప్రయోజనం కలిగిందని చెప్పుకునే పరిస్థితే లేదంటే మీ మంత్రులు, మీరు తెలుగుదేశం మంత్రులా? లేక తెలుగు వారికి ద్రోహం చేసే మంత్రులా?

 విభజనకు మీరేకదా కారణం?
 విభజన పట్ల ప్రజలు కలత చెందారని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అర్థమైందట. ఏమయ్యా నామా నాగేశ్వరరావు ఎవడి పార్టీలో ఉన్నాడు? నీ పార్టీలోనే గదా. లోక్‌సభలో విభజన బిల్లు మీద ఓటింగ్ జరిగిన మరుక్షణం నామా ఏం మాట్లాడాడు? ఆరోజు నామా మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. బయటకు వచ్చి విభజనకు తొలి ఓటు తెలుగుదేశం పార్టీదే. నేనే వేశానని చెప్పాడు. నామాతో అక్కడ ఓటు వేయిస్తావు. ఇక్కడ ప్రజలందరికీ నామాలు పెట్టాలని చూస్తావు. నామా సంగతే ఎందుకు నీ సంగతే చూద్దాం. మొన్న మహబూబ్‌నగర్ మీటింగ్‌లో ఏం మాట్లాడావు? విభజనకు మొట్టమొదటి లేఖ ఇచ్చింది మా పార్టీయేనని గుండెలు మీద బాదుకున్నావు. టిఆర్‌ఎస్ కన్నా ముందు విభజన లేఖ ఇచ్చింది మీ పార్టీనే. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే టిఆర్‌ఎస్ సృష్టికి మూలం నువ్వే. అలాంటిది అక్కడ ఆ మాట మాట్లాడి... ఇక్కడ ఏపీ కేబినెట్ సమావేశంలోనో, ఏపీలో జరిగే సభల్లోనో ఏం చెబుతున్నావు? విభజన వల్ల ప్రజలు కలత చెందారని చెబుతావా? రాజధాని పేరు చెప్పకుండా కట్టుబట్టలతో పంపించారంటావా? మీ మామ గారు సినిమాల్లోనే మహా నటుడు అయితే.. నువ్వు రాజకీయాల్లో మహా మహా నటుడివి. రావణాసురిడికి పది తలలు ఉంటే ఒక తలలోనే పది నాల్కలు ఉన్న వ్యక్తివి నీవు. కాబట్టే, ఇంత అలవోకగా రాష్ట్ర విభజన గురించి అందరూ చూస్తుండగానే, అందరూ పిచ్చివాళ్ళు అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలుగుతున్నావు. అయితే వంచన, మోసం చేసి కూడా... మీడియాను మేనేజ్ చేసుకుంటూ మీరు చేసే దాన్ని పరిపాలన అని మీరు అనుకోవచ్చుగానీ ఇది దుష్పరిపాలన అని మాత్రమే ప్రజలు భావిస్తున్నారు.

 రాజధాని ఎంపికలో రియల్‌ప్రయోజనాలు
 రాజధాని ఎంపిక పేరుతో శివరామకృష్ణన్ కమిటీ వేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వటానికి గడువు ముగిసే లోపే నీ ఆర్థిక నిర్మాత, అప్పటికి రాజకీయంగా అనామకుడైన నారాయణ ఆధ్వర్యంలో మరో కమిటీ నువ్వు ఎందుకు వేశావు? ఏ ప్రజలకు న్యాయం చేయాలని ఆ కమిటీ వేశావు? ఆ కమిటీలో ఒక్కడంటే ఒక్కడు రాజధానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్నాడా? అయినా కమిటీ వేశావు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెబుతుందో అనే భయంతో, నీ రియల్ ఎస్టేట్ డిజైన్లు, తద్వారా మీరు ప్లాన్ చేసుకున్న వేల కోట్ల రూపాయల వ్యాపారం ఎక్కడ దెబ్బతిని పోతుందో అనే భయంతోనే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక బయటకు రాకముందే నీ మంత్రులతో రాజధానికి సంబంధించి నిర్ణయం అయిపోయిందని ప్రకటింపజేశావు. ఇవన్నీ చరిత్ర. ఇవన్నీ నిన్న మొన్న అందరూ ప్రత్యక్షంగా చూసిన వాస్తవాలు. అలాంటిది మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినట్టు? నువ్వు ఎవరికి న్యాయం చేసినట్టు? నువ్వు ఏ ప్రాంతంలో రాజధాని పెడుతున్నావో ఆ ప్రాంతానికి కూడా అన్యాయం చేసిన వ్యక్తివి. ముందుగా, ఒక పథకం ప్రకారం నీ బినామీలతో చుట్టూ భూములు కొనిపించి ఆ తర్వాతే రాజధాని ప్రకటన మీరు చేసిన విషయం మీద ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దర్యాప్తు జరగకపోవచ్చు. రేపు ప్రతి అంశం మీద దర్యాప్తు జరిగి తీరుతుంది. మీ నేరం రుజువు అవుతుంది.

 ఏ రోటికాడ ఆ పాట
 ముందు సింగపూర్ పద్ధతులు మీద అధ్యయనం చేయాలన్నావు. తర్వాత జపాన్ పద్ధతుల మీద అద్యయనం చేయాలన్నావు. ఆ తర్వాత చైనా పద్ధతుల మీద అధ్యయనం చేశానన్వావు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ రాజధాని వెళ్ళి చూసి వచ్చావు. ఇప్పుడు మధ్యప్రదేశ్ వృద్ధి రేటు గురించి మాట్లాడుతున్నావు. ఏది చూస్తే అది. ఎక్కడికి వెళితే ఆ పాట.

 నవ నిర్మాణ దీక్షలో నారాయణ విద్యార్థులను చేర్చండి...
 ఆరవ తరగతి నుంచి విద్యార్థులనందరినీ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాముల్ని చేస్తారా? ముఖ్యంగా నారాయణ విద్యార్థులనందర్నీ కూడా ఈ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాముల్ని చేయదలచుకున్నారా? లేదా అన్నది ముందు చెప్పండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు మీకు తేరగా దొరికారా? వారికి చదువు అక్కర్లేదా? వారు మీ పథకాలకు ప్రమోషన్‌గా ఉపయోగపడే బాల కార్మికులు అని మీరు అనుకుంటున్నారా? అసలే ప్రభుత్వ పాఠశాలలు అంతంతమాత్రంగా నడుస్తుంటే అక్కడి విద్యార్థులను మీ పథకాల ప్రచారం కోసం ఉపయోగించుకునే పద్ధతికి స్వస్తి చెప్పండి. 

ఇదేనా బాబూ మీ అనుభవం?

అనుభవజ్ఞుడినంటూ మేనిఫెస్టోలో గొప్పలు...
త్యాగాలు చేయాలంటూ ప్రజలకు వాతలు
 అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అద్భుత ఫలితాలు వస్తాయన్న చంద్రబాబు నాయుడు గారు- ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ప్రజలందరికీ తెలుసు. తనకు అపార అనుభవం ఉందన్నారు. తాను ఒంటి చేత్తో ప్రపంచ స్థాయి రాజధాని కడతానన్నారు. సింగపూర్‌ను నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రపంచస్థాయి విద్యా సంస్థలు ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలు, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు అన్నీ రెక్కలు కట్టుకుని వచ్చి  సీమాంధ్రలో వాలతాయన్నారు. తాను నరేంద్ర మోడీ కలిసి దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రాన్ని నిర్మించబోతున్నామన్నారు. అనుభవం అనే పదాన్ని నిర్మాణం అనే పదాన్ని పదే పదే వల్లె వేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో 10వ పేజీలో ఏం చెప్పారో చూడండి.
 ‘‘కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి సాధించడంతోపాటు ఒక సమగ్ర ఆర్థిక, సామాజిక కేంద్రంగా నూతన రాజధానిని ప్రపంచ నగరాలకు దీటుగా నిర్మిస్తాం’’- అని చెప్పారు.
 ‘‘రాష్ట్రానికి అవసరమైన వైద్య, విద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, నిధులు సమకూరుస్తాం’’ అని చెప్పారు.
 ‘‘ముందు చూపు, నిధులు సేకరించగలిగిన సత్తా, బాధ్యతాయుతంగా పనిచేయించగలిగిన నాయకత్వం, అంతర్జాతీయంగా పలుకుబడి, పరిచయాలు కల్గిన వ్యక్తి(చంద్రబాబు నాయుడు) నాయకుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి’’ - అని మేనిఫెస్టోలో చెప్పారు.
 పోనీ డ బ్బులు గురించి వదిలేశారా అంటే అది లేదు. డబ్బులు వస్తాయి. డబ్బులు ఉన్నాయి.. అని చెప్పారు. వారు ఇంకా ఏం చెప్పారో... చూడండి.
 ‘‘ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ హామీల అమలుకు కావాల్సిన ఆర్థికపరమైన అన్ని అంశాలను పరిగణించాం కొత్త రాష్ట్రానికి ఉన్న అపార అభివృద్ధి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, రాబోయే పెట్టుబడుల ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించటం ద్వారా హామీలన్నీ అమలు చేయటానికి కావాల్సినంత నిధులు సమకూరుతాయి’’ - అని తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పారు.
 అంతేతప్ప జనం అంతా ఇటుకలు ఇస్తే రాజధాని కడతామని, సెక్రటేరియేట్‌లో హుండీలు పెడతామని, ప్రజలంతా త్యాగాలు చేయాలని 1999కి ముందు ఛార్జీలన్నీ పెంచినా ప్రజలే అర్థం చేసుకున్నారు కాబట్టి 2014 తర్వాత కూడా అదే తరహాలో ప్రజలకు వాతలు పెడతామని మీ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు.  అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే త్యాగాలు చేయాల్సింది ఆంధ్రా ప్రజలా? ఈ ఆర్గ్యుమెంట్ చేయటానికి సిగ్గుండాలి.

గోదావరి రైతుల మాఫీ కష్టాలు

పశ్చిమగోదావరిలో వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమం ఓ ప్రహసనంలా మారిపోయింది. ఎన్నికల ముందు బేషరతుగా సంపూర్ణ రుణమాఫీ హామీతో రైతులను ఆకర్షించిన చంద్రబాబు అనేక ఆంక్షలు, షరతులతో రుణమాఫీని పరిమితం చేసేశారు. ఆ తర్వాత అరకొరగా విదిల్చారు. ఒకవైపు లబ్ధిదారులను తగ్గించేయడమే కాక మాఫీ చేయకుండా తప్పించుకోవడం కోసం అనేక పిల్లిమొగ్గలు వేశారు. తరచూ నిబంధనలను మార్చుతూ లబ్ధిదారుల సంఖ్యను పావు వంతుకు మార్చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 4.55 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చారు. వారికి రెండు విడతలుగా రు.1550 కోట్లను మాఫీ చేయాల్సి ఉండగా రు. 488 కోట్లను మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని బాండ్లరూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు అమలు కాలేదు. మరోవైపు లబ్ధిదారులుగా ఎంపికయిన వారిలో కూడా 30శాతం మంది రైతులకు మాఫీ సొమ్ము ఖాతాల్లో జమ కాలేదు. రుణమాఫీకి అర్హత పొందని రైతులు పైసా దక్కక అల్లాడుతుంటే అర్హత సాధించిన రైతులు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. కొంత పొలంపై సొసైటీలోనూ మరి కొంత పొలంపై వాణిజ్య బ్యాంకుల్లోను రుణాలు తీసుకున్న రైతులు మాఫీ కోసం అనేక అవస్థలు పడుతున్నారు. సొసైటీలో తీసుకున్న రుణానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలపై స్టాంప్ వేయించుకుని రావాలని వాణిజ్యబ్యాంకు అధికారులు, వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి ఆ బ్యాంక్ స్టాంప్ వేయించాలని సొైసైటీలు కోరుతుండడంతో రైతుల పని అడకత్తెరలో పోకచెక్కలా మారింది. మరోవైపు నిమ్మ, అరటి వంటి దీర్ఘకాలిక పంటలు వేసిన ఉద్యాన రైతులు రుణమాఫీకి అనర్హులుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. వారి వేదన అరణ్య రోదనలా మారిపోయింది. ఇదిలా ఉండగా మూడోవిడతలోనూ రుణమాఫీ కాని రైతులంతా తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ప్రత్యేక కౌంటర్లలో పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 10 వేల మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో రైతుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులను మూటగట్టి మూలన పడేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరికి రుణమాఫీ అవుతుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. రుణమాఫీ సక్రమంగా జరగక  పోవడంతో బకాయిలు చెల్లించని రైతులపై అధిక వడ్డీల భారం పడుతోంది. ఇంకోవైపు కొత్త రుణాలు అందక విలవిల్లాడుతున్నారు. రుణమాఫీ పేరిట చంద్రబాబు చేసిన మోసాన్ని తలచుకుని ఆవేదన చెందుతున్నారు.

25 May 2015

ఓటు వేసిన వారికే ముఖ్యమంత్రా!?

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం ఉందని అక్కడ టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారట. ఫ్యాక్షనిజానికి నిర్వచనం ఏమిటో ఒక్కసారి డిక్షనరీలో చూడండి. అధికారాన్ని చేతులో పెట్టుకుని రాజకీయంగా బెదిరించి, భయపెట్టి పబ్బం గడుపుకోవడమే సిసలైన ఫ్యాక్షనిజం.
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు చేసిన ప్రకటనను చూస్తే ఫ్యాక్షనిజం ఎక్కడ ఉందో ఈ రాష్ట్ర ప్రజలు తమకు తామే నిర్ణయించుకోవచ్చు. తమకు ఓటు వేయని జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వం... అని ముఖ్యమంత్రే పరోక్షంగా చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేసిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అని అప్పుడే తమ అభ్యర్థుల్ని ఓడించిన వారికి తెలిసి వస్తుందని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారంటే- ఆయన ముఖ్యమంత్రా..? లేక ఫ్యాక్షనిస్టా అన్నది ఈ రాష్ట్ర ప్రజలంతా తేల్చుకోవాలి.
  అదీగాక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని, తన సొంత జిల్లా చిత్తూరునే తాను అధికారంలో ఉన్న 9 ఏళ్ళలో అభివృద్ధి చేయలేక చతికిలపడిన చంద్రబాబు ఇప్పుడేదో తనకు ఓటు వేసిన ప్రాంతాలు, ఓటు వేయని ప్రాంతాలు అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది.  అదీగాక తాను తనకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రినని చంద్రబాబు గారు అధికారికంగా ఒక జీవో ఇస్తే మరీ బాగుంటుంది. అలాంటి ఆలోచన ఏదైనా చేయండి చంద్రబాబు గారూ. రాజకీయ విభేదాలను ఎన్నికలు అయిన మరనాడే పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికి పనిచేసే వాడు మహానేత అవుతాడు. ఎన్నికలు అయి ఏడాది అయినా తన పేరిట ఒక్క స్కీము కూడా ప్రవేశపెట్టుకోలేక, చెప్పిన వాగ్దానాలను అమలు చేయలేక ఇప్పటికి కూడా నా పార్టీ... నీ పార్టీ అంటూ మాట్లాడే వ్యక్తి సీఎం అయినా, ఇంకెవరైనా మహానేత కాలేడు, ప్రజా నేత కాలేడు. మరుగుజ్జే అవుతాడు. 

మంత్రులా... ముసుగేసుకున్న రౌడీలా..?

పోలీసు అండతో ప్రతిపక్ష పార్టీని ఎలా అణగదొక్కాలి... అనే అంశం మీదే కేంద్రీకరించి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులు నిర్వహించుకుంటోంది. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కె. ఈ. కృష్ణమూర్తి, మంత్రి అచ్చన్నాయుడు నిన్న కర్నూలులో ఏం మాట్లాడారో... చూస్తే ఆశ్చర్యం, అసహ్యం ఏకకాలంలో కలగడం సహజం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంటూ ఉంటే,  ఈ రాష్ట్రంలో కూడా రా.జ్యాంగం అనేది పని చేస్తుంటే వీరిద్దర్నీ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి. కోర్టు ముందు హాజరు పరచాలి. వారిని తక్షణం మంత్రి పదవుల నుంచి తొలగించాలి. వారిని పదవుల నుంచి తొలగిస్తారో... తొలగించరో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. ప్రజలు మాత్రం ఇలాంటివారిని మంత్రులుగా చూడాల్సి వచ్చినందుకు ముక్కున వేలేసుకుంటున్నారు.

 వైయస్‌ఆర్‌సీపీని అణిచివేసేందుకు పోలీసుల సహాయం కావాలి అని ఉప ముఖ్యమంత్రి అడిగారట. తమ జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ బలంగా ఉందని, అక్కడి 11 మంది ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను అణగదొక్కే విషయంలో పోలీసుల సహాయం ఎలా తీసుకోవాలా అన్న అంశంపై చంద్రబాబును సంప్రదించాలని నిర్ణయించారట. పక్కనే ఉన్న అచ్చన్నాయుడు అనే మంత్రిగారు ముఖ్యమంత్రిగారు కూడా వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని అణగదొక్కేందుకు సహకరించాలని, టీడీపీకి అనుకూలంగా ఏఏ ట్రాన్స్‌ఫర్లు చేయాలో ఆయా ట్రాన్స్‌ఫర్లు చేస్తానని మాట ఇచ్చారట. వీళ్ళు క్యాబినెట్ మంత్రులా లేక మంత్రుల ముసుగులో ఉన్న గూండాలు, రౌడీలా? వీరికి మించిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంకెవరైనా ఉన్నారా?

 బహిరంగంగా, పార్టీ సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యల్ని సూమోటోగా నమోదు చేసి వారి ఇద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు ఉంది.

  తెలుగులో ఒక సామెత ఉంది. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా అని. ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయవాడలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో... ఇప్పుడు మంత్రుల ఏం చెబుతున్నారో చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతుంది. పాముకు విషం ఉంటే పాము పిల్లలకు కూడా విషం ఉంటుంది. ముఖ్యమంత్రి ఆలోచనల్లోనే విషం ఉంటే మంత్రులకీ అదే అలవాటు అవుతుంది.
  విజయవాడలో జరిగిన సివిల్ సర్వెంట్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీ నాయకుల పట్ల చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన రోజునే ఈ రాష్ట్రం అవాక్కైంది. అంత చదువులు చదువుకున్న ప్రజా సేవకులు అంటే సివిల్ సర్వెంట్లు మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సివిల్ సర్వెంట్లను తమ పార్టీ నేతలకు ఊడిగం చేయమంటుంటే- ఆరోజే ముఖ్యమంత్రిపై చట్టాన్ని ప్రయోగించి ఉంటే లేదా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అది సాధ్యం కాదని తెగేసి చెప్పి ఉంటే, తాము రాజ్యాంగానికి, చట్టానికి జవాబుదారే తప్ప తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీలో ఉన్న గూండా, రౌడీ శక్తులకు, అందులో దురదృష్టవశాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన ఎలిమెంట్లకు తాబేదార్లం కాదని స్పష్టం చేసి ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంతగా దిగజారి పోయేవి కాదు.

  పోలీసు బాసులు వేసుకోవాల్సింది ఖాకీ దుస్తులా లేక ఎల్లో దుస్తులా? అన్న చర్చ మొన్న అనంతపురం జిల్లాలో హత్య సందర్భంగా రాష్ట్రమంతటా జరిగింది. పోలీసు వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించాలి. కేఈ కృష్ణమూర్తి, అచ్చన్నాయుడు వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకుని వారి కదలికల మీద నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. 

బాబుగారి గోదావరి గోబెల్స్!

ఏదైనా అబద్దాన్ని పదేపదే వల్లెవేస్తే అది నిజమైపోతుందని నారా చంద్రబాబునాయుడిగారి నమ్మిక. ఆయన గోబెల్స్‌ని నమ్ముకున్నారు మరి. ఉభయగోదావరి జిల్లాల ప్రజలపై రెండు మూడు రోజులుగా చంద్రబాబు ఇదే రకమైన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమకు ఓట్లేసిన జిల్లాలకు పెద్దపీట వేస్తామని, ఆ జిల్లాల్లో అభివృద్ధిని ఏరులుగా పారిస్తామని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల గురించి ఆయన తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్న విషయాలను ప్రధానంగా రాష్ర్ట ప్రజలు చర్చించుకుంటున్నారు. 
  ఓట్లేసిన జిల్లాలను అభివృద్ధి చేస్తానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారంటే మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయని జిల్లాల గురించి ఆయన పట్టించుకోరా? అంటే ఆయన తనకు ఓట్లేసిన జిల్లాలకు మాత్రమే ప్రతినిధా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి  మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎన్నికలు అయిపోయిన తర్వాత పదవీ ప్రమాణ స్వీకారం చేసేటపుడు వల్లెవేసిన మాటలేమిటి? చేసిన ప్రతిజ్ఞలేమిటి? ప్రమాణాలేమిటి? రాగద్వేషాలకు అతీతంగా రాష్ర్ట ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవలసిన ముఖ్యమంత్రి పదవిలోని వ్యక్తి ఇలా పక్షపాత పూరితమైన వ్యాఖ్యలు చేయవచ్చా? అసలు అలాంటి వ్యక్తి అంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండడానికి అర్హుడేనా? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను చూసిన వెంటనే ఇలాంటి ప్రశ్నలన్నీ ఉదయించకమానవు. 
  ఇకపోతే ఓట్లేసిన జిల్లాలను అభివృద్ధి పథాన పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు చేస్తున్న బూటకపు ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. బ్రహ్మానందాన్ని మించిన కామెడీ చేస్తున్నాడని నవ్విపోతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఎత్తున అభివృద్ధి జరిగిపోతున్నదంటూ ఇతర జిల్లాల్లో గోబెల్స్ ప్రచారం జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో ఇంతవరకు చెప్పుకోదగిన కార్యక్రమం ఒక్కటీ చేపట్టిన దాఖలా లేదు. అయినా పశ్చిమగోదావరి జిల్లాలో నిధులు కుమ్మరిస్తున్నట్లుగా తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో జరిగిన తెలుగుదేశం మినీ మహానాడు సభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాకు చంద్రబాబు ఎనిమిదిసార్లు వచ్చారు. అయితే ఆయన పర్యటనల వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిట్ కేటాయిస్తున్నట్లు చేసిన ప్రకటన మినహా ఏదీ ముందుకు సాగలేదు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుంటే చాలు అభివృద్ధి జరిగిపోతున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం మినహా నిజానికి జరిగిందేమీ లేదు. 
  ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మరో విచిత్రమైన తంతు కూడా నడుస్తోంది. చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. ఆ అసంతృప్తి తమపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలా అని స్థానిక నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏడాది పాలనపై వేదికలెక్కి అసంతృప్తి వెళ్లగక్కడం ద్వారా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్ద మంచి మార్కులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకొల్లులో జరిగిన మినీ మహానాడులో ఇలాంటి ప్రయత్నమే కనిపించింది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఇతర ప్రజా ప్రతినిధులు ఏడాది పాలన తమకు సంతృప్తినివ్వలేదని మొసలి కన్నీరు కార్చడం ఇందుకే. చంద్రబాబు వాగ్దానాల భంగం, ఏడాదిగా ఏమీ చేయకపోవడం వంటి వాటి ప్రభావాలు తమపై పడకుండా ప్రజల వద్ద సానుభూతి సంపాదించడం కోసం తెలుగుదేశం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏడాది పాలనలో ఏమీ చేయలేకపోయామన్న అపప్రథ నుంచి బయటపడేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు.

22 May 2015

బాబు మోసాలపై సమరశంఖం

జూన్ 3,4 తేదీల్లో వైయస్ జగన్ నిరశన దీక్ష
గుంటూరుజిల్లా మంగళగిరి వేదిక
ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలన అంతా మోసాల మయం. ప్రతి వాగ్దానం మోసం. ప్రతి హామీ మోసం. రైతులను మోసం చేశాడు. ఆడపడుచులను మోసం చేశాడు. నిరుద్యోగులను మోసం చేశాడు. చివరకు పింఛన్ తీసుకునే వృద్ధులనూ వదిలిపెట్టలేదు. రాజధాని రైతుల వ్యథకు అంతేలేదు. మొత్తంగా రాష్ర్ట ప్రజలందరినీ వంచించాడు. ఏడాదిలోనే ఎంత వంచన... అంటూ ప్రజలు వాపోతున్నారు. మరో నాలుగేళ్లపాటు ఈ మోసాలను భరించాలా అంటూ వేదన చెందుతున్నారు. చంద్రబాబు మోసాలపై బాధ్యతగలిగిన ప్రతిపక్ష నాయకునిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించారు. బాబు మోసాలను ఎండగడుతూ, నిరసిస్తూ జూన్ 3, 4 తేదీల్లో జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల నిరశన దీక్ష  చేపడుతున్నారు.

బాబు చేసిన మోసాలలో ప్రధానమైనవివీ.....
ప్రధానంగా 5 అంశాల మీద దృష్టి సారించి జగన్ దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఐదు మోసాలను ఎండగట్టడానికే ఈ దీక్ష ఉద్దేశించినది.
1) వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు రైతుల్ని మోసగించాడు.
2) డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని మహిళల్ని మోసగించాడు.
3) ఇంటికో ఉద్యోగం ఇస్తానని లేనిపక్షంలో రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగ యువతను మోసగించాడు.
4) రాజధాని పేరు చెప్పి భూములు బలవంతంగా లాక్కొని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడానికి, తన బినామీలకు అప్పగించటానికి రైతుల్ని మోసగించాడు. 13 జిల్లాల్లో ఏకంగా 10 లక్షల ఎకరాలు భూమిని లాక్కుంటాం అని పారిశ్రామిక విధానాన్ని గత నెల ఆఖరు వారంలో బహిరంగంగా ప్రకటించి, ఇకమీదట రైతులకు మరింత అన్యాయం చేయబోతున్నానని వెల్లడించాడు.
5) రాష్ట్రానికి తానే ప్రత్యేక హోదా తీసుకువస్తానని, తాను నరేంద్ర మోడీ కలిసి కొత్త రాష్ట్రానికి దేశంలోనే మరే రాష్ట్రానికీ లేనంతగా నిధులు, పరిశ్రమలు, ప్రత్యేక హోదా, ఉద్యోగాలు తీసుకువస్తాం అని ఎన్నికల ముందు చెప్పి, ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదంటూ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించాడు.

300 వాగ్దానాలేమయ్యాయి?
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు దాదాపు 300 వాగ్దానాలు చేశాడు. వాటిని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచాడు. అయితే అందులో ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదు. అలవికాని హామీలిస్తున్నారు... వాటిని అమలు చేయడం సాధ్యం కాని పని అని ఆనాడే విమర్శలు వచ్చాయి. వాటిపై ఎన్నికల కమిషన్ చంద్రబాబును వివరణ అడిగింది కూడా. అయితే తనకు అపారమైన అనుభవం ఉందని, హామీలన్నిటినీ అమలు చేయడానికి అవసరమైన వనరుల సమీకరణ వంటి వన్నీ తనకు తెలుసునని చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చాడు. అయితే ప్రజలను మోసం చేయడంలోనే చంద్రబాబుకు అనుభవం ఉన్నది తప్ప వాగ్దానాలను అమలు చేసే విషయంలో కాదని తేలిపోయింది.  చంద్రబాబు నాయుడు వంచన, మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు వంటి అంశాల్లో మాత్రమే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న నాయకుడు అని ఈ ఏడాదిలోనే రుజువు అయింది. మరో నాలుగేళ్ళ పాటు ఇలాంటి పాలనని భరించాలా అని ప్రజలంతా అనుకుంటున్న సమయంలో ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జగన్ ఈ దీక్షను చేపట్టబోతున్నారు.

మోసాలు, వంచనలే ఏడాది పాలన...
 వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. రూ. 10 వేల కోట్ల మేరకు ఈ ఏడాది కాలంలోనే పెరిగాయి. రుణ మాఫీ జరిగితే రుణాలు ఎలా పెరిగాయి? కొత్త రుణాలు రైతులకు అందనేలేదుగదా? రుణ మాఫీ ఎవరికి అందింది? మొత్తంగా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఈ ఏడాదిలో ఎన్ని ప్లేట్లు ఫిరాయించారు? అలాగే డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయి కూడా ఈరోజుకూ ఎందుకు మాఫీ కాలేదు? డ్వాక్రా సంఘాలు సగానికి సగం చంద్రబాబు గారి దెబ్బకు మూతపడ్డాయి. రాజధాని పేరిట అత్యంత దుర్మార్గంగా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. ఇలా మోసాలు, వంచనలు తప్ప మంచి పనులు చేసిందెక్కడ?

ప్రజలకు ఒక్క ఇల్లన్నా కట్టి ఇచ్చారా?
 తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికల్లోనే రాస్తున్నారు. ఇళ్ళ కోసం, ఇళ్ళ స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. మొత్తంగా 61 లక్షల మందికి రేషన్ కార్డులు, ఇళ్ళు, స్థలాలు అందక అర్జీలు పెట్టుకున్నారని చెబుతున్నారు. సీమాంధ్రలో ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. నిధులు ఇవ్వలేదు. నిర్మాణాల్లో ఉన్న పాత ఇళ్ళను కూడా ఆపేశారు. మరి ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోలేదా అంటే తీసుకున్నారు. కాకపోతే అది ప్రజల గృహ నిర్మాణానికి కాదు. తన గృహ నిర్మాణానికి. అదికూడా సీమాంధ్రలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్‌లో తన ఇంటికి శంఖుస్థాపన చేశారంటే చంద్రబాబు గారి మనస్తత్వాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.

పారిశ్రామికవేత్తల రుణాల మాఫీ
 చేస్తానన్న రుణాల మాఫీ రైతులకు, డ్వాక్రా మహిళలకు అయితే చేసిన రుణ మాఫీ ఎవరిది అంటే దాదాపు రూ. 2600 కోట్ల మేరకు పారిశ్రామిక వేత్తలకు రుణాలు మాఫీ చేశారు. ప్రధానంగా తనకు కావాల్సిన వారి నుంచి దాదాపు 30 శాతం ముడుపులు పుచ్చుకుని ఒక డీల్‌లో భాగంగా ఈ రుణ మాఫీ చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తే చంద్రబాబు గారి జేబులోకి వచ్చేదేమీ ఉండదు. అదే పారిశ్రామికవేత్తలకు మాఫీ చేస్తే... తాను మేనిఫెస్టోలో రాయకపోయినా, వాగ్దానం చేయకపోయినా తన జేబు నిండుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేశారు.

బాబు జేబునింపే పట్టిసీమ
 మిత్రపక్షమైన బీజేపీ మీద ఒత్తిడి తీసుకువచ్చి తెలుగుదేశం పభుత్వం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేత కట్టిస్తే చంద్రబాబు గారి జేబులోకి వచ్చేదేమీ ఉండదు. అదే పట్టిసీమ ప్రాజెక్టు కడితే పొలాల్లోకి నీరు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారి జేబులు మాత్రం దండిగా నిండుతాయి. ఇలాంటి వంచనలు, మోసాలు రోజుకొకటి బయటకు వస్తున్న సమయం ఇది. గత ఏడాది కాలంలో టీడీపీ విఫలమైంది అని చెప్పే కన్నా ఘోరంగా వంచించింది, మోసగించిందీ అని చెప్పటమే కరెక్టు. ఏడాదిలోగానే బోర్డు తిప్పేసే పరిస్థితి వచ్చింది కాబట్టే రోజుకు నలుగురు ఐదుగురు మంత్రులకు ఆదేశాలు ఇచ్చి జగన్‌ను తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు.

19 May 2015

డ్వాక్రా మాఫీలో కుదింపు కుట్ర!

మహిళలను మోసగిస్తున్న బాబు
రుణమాఫీ విషయంలో లబ్దిదారుల సంఖ్యను రకరకాల కారణాలతో కుదించి రైతులను మోసగించినట్లే ఇపుడు డ్వాక్రా రుణమాఫీలోనూ లబ్దిదారులను కుదించి మహిళలకు మొండిచేయి చూపించాలని చంద్రబాబు పథకాలు పన్నుతున్నారు. రుణాలను సంపూర్ణంగా బేషరతుగా మాఫీ చేస్తానని అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆ హామీలను అటకెక్కించేశారు. ప్రతి డ్వాక్రా మహిళకూ రు. 10 వేల సాయం అందిస్తామని ఇటీవలే చంద్రబాబు సర్కారు ఉత్తర్వులిచ్చింది. అయితే ఆర్ధికభారం తగ్గించుకోవడం కోసం లబ్దిదారుల సంఖ్యను కుదించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ర్టంలో దాదాపు 91 లక్షల మంది మహిళలు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండగా అందులో 74 లక్షల మందినే రు. 10 వేల సాయానికి అర్హులుగా ఎంపిక చేశారు. అంటే మిగిలిన 17 లక్షల మంది మహిళలకు సాయంలో కోత విధించనున్నారన్నమాట. సంఘాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే క జాబితాను రూపొందించింది. ఆ జాబితాను జిల్లాలకు పంపించారు కూడా. ఆధార్ సీడింగ్, డ్వాక్రా లావాదేవీల్లో క్రియాశీలకంగా లేని మహిళలను గుర్తించే ప్రక్రియ రెండు నెలలుగా కొనసాగుతున్నదని, వాటిలో తేలిన మేరకే తుది జాబితాను రూపొందించారని అధికారులు చెబుతున్నారు. అయితే జాబితా వెల్లడి కాగానే డ్వాక్రా మహిళలలో నిరసనలు వ్యక్తం కాకుండా ఉండడం కోసం చంద్రబాబు సర్కారు మరో ప్రణాళికను సిద్ధం చేసింది. డ్వాక్రా సంఘాల సమావేశాలలో అర్హులు, అనర్హుల జాబితాలకు ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో నివాసం ఉండని వారు, చనిపోయినా సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్నవారి పేరిట 5 లక్షల పైచిలుకు సభ్యులను తొలగించారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియలో 8 లక్షల మంది సభ్యులను తొలగించారు. ఆధార్ నమోదు చేసుకోని కారణంగా 3.5 లక్షల మందిని పక్కనపెట్టారు. 

బాబుగారి పాలనలో దళితులపై పెరిగిన దాడులు... దాష్టీకాలు

నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తూ ఉంది. రాష్ర్టంలో దళితులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దళితుల మీద దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దళిత ఉద్యోగులకు భద్రత లేదు. ఎన్నికల సమయంలో దళితులకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల తర్వాత దళితులను భక్షిస్తా ఉంది. దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. దళితుల మీద దాడులు చేయిస్తూ ఈ రాష్ర్టంలో బ్రతకడానికి దళితులకు అవకాశం కూడా లేకుండా చేస్తోంది.  ఈ సంవత్సర కాలంలో దళితులపై జరిగిన దాడుల మీద సిట్టింగ్ జడ్జిని నియమించి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
  కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడిని తెలుగుదేశం గూండాలు పథకం పన్ని హత్య చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక దళిత సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగుదేశం శాసనసభ్యుడు కారణమయ్యాడు. తెలుగుదేశం శాసనసభ్యుడి వల్లే గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో ఒక సొసైటీ సీఈఓ కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది కూడా. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకిరేకల్లులో దళితుల మీద దాడులు జరిగాయి. తెలుగుదేశం నాయకుల వత్తిళ్ల వల్ల నర్సరావుపేట నియోజకవర్గంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో రాప్తాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాదరెడ్డిని హత్య చేసి అనంతరం జరిగిన ఆందోళనలకు పార్టీకి చెందిన దళితులను బాధ్యులను చేసి అరెస్టులు చేసి వేధిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో తొమ్మిది మంది దళితుల మీద తెలుగుదేశం గూండాలు అమానుషంగా దాడులు చేశారు. వీటికి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారు? 
  తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు ఏం న్యాయం చేసింది? అందుకే దళితులు భయపడుతున్నారు. ఈ రాష్ర్టంలో చదువుకున్నవాళ్లకి భద్రత లేదు. ఉద్యోగస్తులకు భద్రత లేదు. ఉద్యోగావకాశాలలో దళితులను ఇంకా అస్పృశ్యులుగానే చూసే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఏ అధికారి అయినా మనవాడే రావాలి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. దళిత అధికారులను ప్రాధాన్యత లేని విభాగాలకు బదిలీ చేస్తున్నారు. సస్పెండ్ చేయిస్తున్నారు. వారు ఆత్మన్యూనతకు లోనై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కల్పిస్తున్నారు. దళితులపై దాడులు జరిగిన కేసుల్లో ఎంత పురోగతి సాధించారు? ఎన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి అరెస్టులు చేయించారు? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పక్షాల నిలబడ్డారన్న దుగ్ధతోనే తెలుగుదేశం పార్టీ వారు దళితులపై దాడులు చేయిస్తున్నారన్న మాట నిజం కాదా? దళితులకు రాజ్యాంగ పరంగా అనేక రక్షణలున్నా తెలుగుదేశం ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తున్నది. వాటికి ఏం సమాధానం చెప్తారు? 
  చట్టప్రకారం సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. నిధుల కేటాయింపులోనే 5 వేల కోట్ల మేర అన్యాయం చేశారు. 70శాతానికి పైగా ఖర్చు చేయకుండా ఉంచారు.
  బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని ఎన్‌ఆర్‌జేలలో ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్‌వీఎంలలో పనిచేసే ఉద్యోగులకు మంగళం పలుకుతున్నారు. అందులో మెజారిటీ భాగం ఎస్సీఎస్టీలే ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా లేరన్న కారణంతోనే వారి ఉద్యోగాలను ఊడబీకుతున్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు.. ఉద్యోగమివ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులమీద జరిగిన దాడులు, దళితుల సంక్షేమానికి తూట్లు పొడిచిన తీరు, దళితుల అభ్యుదయం కోసం చేపట్టిన స్కీముల అమలులో లోపాలు, దళితుల ఉద్యోగ భద్రతను కాలరాయడం వంటి అన్ని విషయాలలోనూ సిట్టింగ్ జడ్జిని నియమించిన నిజానిజాల నిగ్గు తేల్చాలని ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో దళిత వ్యతిరేక ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవి పేర్కొంటున్నాయి. 

తెలుగుదేశం విజయయాత్ర హాస్యాస్పదం

అంబటి రాంబాబు ఎద్దేవా
హైదరాబాద్ : ఏడాది పాలన పూర్తి చేశామన్న పేరుతో విజయయాత్ర జరిపే నైతిక హక్కు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారంనాడు ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  రాష్ర్ట పునర్విభజన బిల్లులో ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరప తలపెట్టిన రెండు రోజుల దీక్ష యథాతథంగా కొనసాగుతుందని రాంబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే రాష్ర్ట భవిష్యత్ మారుస్తామన్నారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని రాంబాబు నిలదీశారు. తాను చేసిన వాగ్దానాలు అమలు చేయడం సాధ్యమేనని, వాటి ప్రభావం తనకు తెలుసునని చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారని రాంబాబు గుర్తు చేశారు. ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండానే ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని రాంబాబు అన్నారు.

16 May 2015

భూసేకరణపై రగులుతున్న పల్లెలు

బాబు సర్కారుపై సర్వత్రా ఆగ్రహావేశాలు
ప్రతిఘటిస్తామంటున్న అన్నదాతలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ఆడుతున్న భూ సమీకరణ, భూ సేకరణ నాటకాలపై అన్నదాతలు రగిలిపోతున్నారు. నిన్నటి వరకు భూ సమీకరణ, లాభసాటి ప్యాకేజీ అంటూ అంటూ రైతులను మభ్యపెట్టిన చంద్రబాబు సర్కారు ఇపుడు ఒక్కసారిగా జూలు విదిల్చింది. తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.
  భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోతే వారి భూములను భూసమీకరణ చట్టం ప్రయోగించైనా సరే లాక్కునేందుకుగాను జీవో 166 జారీ చేసింది. రాష్ర్ట ప్రభుత్వ భూ సేకరణ కుట్రలపై రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు మండి పడుతున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలలో  ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
  మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, యర్రపాలెం, కురగల్లు, రాయపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లోని దాదాపు వెయ్యి ఎకరాల భూములను భూసేకరణ విధానంలో సేకరించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడెక్కడి భూములను సేకరించనున్నామో ఆ వివరాలతోపాటు రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాలను సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించనున్నారు. మూడువేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూములను గుర్తించినప్పటికీ గ్రామ కంఠాలు, డొంకలు, దారులు పోను రైతుల నుంచి వెయ్యి ఎకరాలను సేకరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
  తమ భూములను బలవంతంగా లాక్కోవడానికి వీలుగా భూసేకరణకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రైతుల్లో ఆగ్రహావేశలు కట్టలు తెంచుకున్నాయి. మూడు పంటలు పండే భూములను ఎలా ఇవ్వమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇచ్చి భూములను కాపాడుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. 166 జీవో కాపీ ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతులకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు శుక్రవారం విజయవాడ ప్రకాశం బ్యారేజీపై వినూత్న నిరసన జరిగింది. ఇందులో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ పంట పొలాల్లో పండిన కూరగాయలను రైతులు స్వచ్ఛందంగా తీసుకువచ్చి దారిన పోయేవారికి పంచిపెట్టారు. బహుళపంటలు పండుతున్న తమ పంట భూములను చంద్రబాబును నమ్మి ఎలా ఇవ్వమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూ సమీకరణ కోసం చట్టాలు, జీవోలు విడుదల చేసిన చంద్రబాబు ఇపుడు భూసేకరణ చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి ఒకే ప్రాంతంలో రెండు చట్టాలను ఎలా ప్రయోగిస్తారని రైతులు నిలదీస్తున్నారు.
  భూసేకరణ జీవోపై గ్రామాల్లోనే కాక గుంటూరు జిల్లా పరిషత్‌సర్వసభ్య సమావేశం కూడా అట్టుడికి పోయింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాచర్చ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి ఇంకా వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు జీవో 166ను గట్టిగా వ్యతిరేకించారు. భూ సమీకరణ, భూసేకరణలపై సమావేశంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న తమ డిమాండ్‌ను అధికార తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోవడంతో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులంతా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
  భూ సేకరణ జీవోను వ్యతిరేకిస్తూ తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన జరిగింది. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని కార్యాలయం మెట్లపై బైఠాయించారు. అనంతరం భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతపత్రం సమర్పించారు. భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆధ్వర్యంలో మంగళగిరి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. జీవో 166ను వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో ప్రదర్శన జరిగింది. అనంతరం జీవో ప్రతులను దగ్ధం చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా రానున్న కాలంలో పది వామపక్షాలను కలుపుకుని కార్యాచరణను ప్రకటిస్తామని రామకృష్ణ వెల్లడించారు.

పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించండి

వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ వల్ల నిత్యావసర సరుకులపై తీవ్ర ప్రభావం పడుతున్నదని, దానిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణం ఉపసంహరించుకోవాలని పార్టీ కోరింది. ‘‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో వస్తున్న మార్పుల ప్రకారం పెట్రో ఉత్పత్తుల ధరలు మారుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల నుంచి 48.63 డాలర్లకు పడిపోయినా అంతే స్థాయిలో తెలుగురాష్ట్రాలలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గలేదు’’ అని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ‘‘టీఆర్‌ఎస్, ఎన్డీయే సంకీర్ణ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, పెట్రో ధరల పెంపుపై నోరు మెదపడం లేదు.  పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. దానివల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతాయి. రెండు రాష్ట్రాలు ఇప్పటికైనా మౌనాన్ని వీడి కేంద్రం వద్ద తమ నిరసనను వ్యక్తం చేయాలి’’ అని పద్మ కోరారు. వ్యాట్, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు చాలా ఎక్కువగా ఉన్నాయని, వెంటనే వాటిని ఉపసంహరించాలని పద్మ డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ రైతు ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుతూ..‘‘ వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేస్తుంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు. కానీ రాహుల్ గాంధీ ఇపుడు జగన్‌మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు..’’ అని పద్మ పేర్కొన్నారు.

14 May 2015

17 నుంచి రాయదుర్గంలో జగన్ పర్యటన

రాయదుర్గంః వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర రాయదుర్గంలో ఈ నెల 17న ప్రారంభమవుతుందని ఆపార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైఎస్ జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. వర్షాభావంతో పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అటువంటి రైతుల్లో ధైర్యం నింపేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా యాత్ర చేపట్టారన్నారు. ఈ భరోసా యాత్ర రాయదుర్గం నియోజకవర్గంలో 13వ తేదీనే జరగాల్సి ఉందని, ప్రతిచోటా మాట్లాడాలని ప్రజలు కోరుతుండడంతో యాత్ర ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ నెల 17న రాయదుర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో, 18న డీహీరేహాళ్ మండలంలో వైఎస్ జగన్ పర్యటన సాగుతుందని చెప్పారు. ఈ యాత్రను పార్టీ శ్రేణులు, ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. 

వైఎస్ జగన్ హెచ్చరికతో దిగివచ్చిన ప్రభుత్వం

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జోగి రమేష్
విజయవాడః రాష్ర్టంలోని ఆర్టీసీ కార్మికులంతా ఐకమత్యంగా ఉండి సమ్మె చేయడం వల్లే న్యాయపరమైన డిమాండ్లు సాధించుకోగలిగారని వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జోగి రమేష్ చెప్పారు. బుధవారం రాత్రి ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ సమ్మెకు పూర్తిస్థాయిలో మద్దతు పలికి అన్ని పోరాటాల్లో పాల్గొందని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన హెచ్చరికతోనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల డిమాండ్లు పరిష్కరించిందని చెప్పారు. ప్రభుత్వం వందలాదిమంది కార్మికులను అరెస్ట్ చేయించడం, వేలాదిమందిపై కేసులు బనాయించడం, అనేక చోట్ల కార్మికులపై లాఠీచార్జి చేసి నిరంకుశంగా వ్యవహరించడం వంటివాటికి పాల్పడిందని మండిపడ్డారు. కార్మికులు ఐకమత్యంతో ఉంటే ప్రభుత్వం ఏమీ చేయలేదని మరోమారు రుజవైందని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు మాట మార్చడానికి యత్నించారన్నారు. దీనిద్వారా ఆయన మోసకారి అని మరోసారి రుజువైందన్నారు.

13 May 2015

ఆర్టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్‌సీపి అభినందనలు

హైదరాబాద్ : పోరాడి తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను సాధించుకున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్‌సీపీ అభినందనలు తెలియజేసింది.  ఈనెల 6న సమ్మె ప్రారంభం కాకముందే రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులు అడిగిన ఫిట్‌మెంట్‌కు ఒప్పుకుని ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఇంత భారీగా కష్టనష్టాలు సంభవించేవి కావని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43 శాతం, తెలంగాణ ప్రభుత్వం 44శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు ఒప్పుకున్న సంగతి తెల్సిందే. ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందే ఎందుకు అంగీకరించలేదో సమాధానం చెప్పాలని పద్మ డిమాండ్ చేశారు. సమస్యను కోర్టుకు ఎందుకు లాగారో చెప్పాలని, ఆర్టీసీ కార్మికులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు సమస్యను ఎందుకు నాన్చారో కూడా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె కోరారు. చివరికి ఎమ్‌సెట్, ఇతర పోటీ పరీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని, విద్యార్థులు నష్టపోయిన విలువైన కాలాన్ని ఎవరు తీసుకు వస్తారని పద్మ అన్నారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తానని గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇపుడు దానిపై ఏంచెబుతారని పద్మ ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీకి నష్టాలు రావడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత వరకు ఉందో ఇద్దరు ముఖ్యమంత్రులు సమీక్షించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీకి ఉపయోగించే డీజిల్ మీద వ్యాట్‌ను పూర్తిగా తొలగించాలని లేదా ఆ వ్యాట్ సొమ్ము మేరకు ఆర్టీసికి రీయింబర్స్ చేయాలని పద్మ డిమాండ్ చేశారు. ఆర్టీసి చార్జీలు పెంచే ప్రతిపాదనల్ని వచ్చే నాలుగేళ్లలో ఈ రెండు ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదని, ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం తప్ప ప్రజలు కాదన్న వాస్తవాన్ని ముఖ్యంగా చంద్రబాబు గుర్తించాలని అన్నారు. సమ్మె సమయంలో కార్మికులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అలాగే పార్టీ శ్రేణుల్ని కూడా ఈ సమ్మెలో పాల్గొనాల్సిందిగా పిలుపునివ్వడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చారని ఆమె వివరించారు. ప్రభుత్వాలు దిగిరాకపోతే రాష్ర్ట వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని కూడా జగన్ హెచ్చరించారని పద్మ గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మీదట కూడా కార్మికలోకానికి ఇదే మద్దతును కొనసాగిస్తుందని తెలిపారు.

సర్కారుకు పట్టని సాక్షర భారత్!

ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు నాయుడు సర్కారుకు ఇతర పథకాలను అమలు చేసే తీరికెక్కడిది? బాబుగారి ఆలోచనలన్నీ సింగపూర్, జపాన్, చైనాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు ఉద్దేశించిన సాక్షర భారత్ సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా కునారిల్లుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పూర్తిగా కొరవడింది. ఈ పథకానికి కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. అసలు వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమం అనేది ఒకటి కొనసాగుతున్న విషయం గ్రామీణులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అయితే వయోజనులకు విద్య పేరుతో నోటు పుస్తకాలు, పేపర్లు, పెన్నులు, పెన్సిళ్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒక్కో జిల్లాకు 6 నుంచి 8 కోట్ల వరకు వ్యయమవుతున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 75శాతం భరిస్తుండగా రాష్ర్ట ప్రభుత్వం 25శాతం ఖర్చు చేస్తున్నది. నెలకు రు.2వేలు గౌరవ వేతనం తీసుకుంటున్న వీసీవోలు వయోజనులకు అక్షరాలు నేర్పాల్సి ఉంటుంది. అయితే అసలు వారు గ్రామాలకు వెళుతున్న దాఖలాలే ఉండడం లేదు. వీరిని పర్యవేక్షించి సరిగా పనిచేయించాల్సిన ఎంసీఓలదీ అదే పరిస్థితి. వేల రూపాయల గౌరవవేతనాలు తీసుకుంటున్నా గ్రామీణ నిరక్షరాస్యులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అన్ని గ్రామాలలోనూ ఇదే పరిస్థితి. 

తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్న ‘నీరు-చెట్టు’

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది. చెరువుల్లో పూడిక తీసి, మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రారంభమైన నీరు-చెట్టు పథకం తమ్ముళ్ల జేబులు నింపే పథకంగా మారిపోయింది. అధికార పార్టీ సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారాలకు అధికారులు వంతపాడుతుండడంతో వారిపని నల్లేరు మీద బండి నడకలా మారింది. ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లి కొండవద్ద సర్వే నెంబర్ 475 భూమి అటవీ భూమి అని అటవీశాఖ, కాదని రెవెన్యూశాఖ మధ్య ఐదేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ భూమిని  క్వారీ కోసం లీజుకు తీసుకున్న నాగరాజుపల్లి గ్రామస్తుడొకరుహైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇంత వివాదాస్పదమైన ఆ భూమిలో తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకుని తవ్వకాలు మొదలుపెట్టారు. వివాదాస్పద భూమి సమీపంలోనే ఉన్న ఇసుకదర్శి గ్రామంలో నీటి గుంతలలో పూడిక తీయడం కోసం అనుమతులు తీసుకున్న తెలుగుదేశం నాయకులు కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో కూడా తవ్వకాలు మొదలుపెట్టారు. పూడిక తీయడానికి బదులు మట్టిని తవ్వేస్తున్న తెలుగుదేశం నాయకులు ఆ మట్టిని హైవే పనుల కోసం అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంపై క్వారీ అనుమతులు తీసుకున్న లీజుదారుడు అధికారులను ఆశ్రయించినా వారు తామేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అధికార పార్టీ అంటే మాటలా మరి... 

బలవంతపు భూసేకరణకు వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం

న్యూఢిల్లీ : రైతుల ఆమోదం లేకుండా భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభలో మరోమారు స్పష్టం చేసింది. భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. బహుళ పంటలు సాగయ్యే భూములు, సారవంతమైన భూములను రైతుల ఆమోదం లేకుండా లాక్కోవడాన్ని తాము వ్యతిరేకిస్తామని మేకపాటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు లాక్కోవడం సరికాదని, అక్కడికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధానిని నిర్మించవచ్చని ఆయన సభలో వివరించారు. రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారని, ఈ కారణాల వల్లే తాము ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నామని మేకపాటి పేర్కొన్నారు. ఈసారి కూడా సవరణలు సూచిస్తామని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

12 May 2015

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట

పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగిన పార్టీ ఎంపీలు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది.  తాజాగా వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. 
  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, తిరుపతి ఎంపీ డా.వీ వరప్రసాద్ రావు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు.. ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈసందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోజు విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రకటన చేస్తూ... ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నాయకులు ... దీనికి మద్దతు ఇస్తూ, ఐదేళ్లు సరిపోదని, పదేళ్ల  పాటు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసినట్లు మేకపాటి వివరించారు. అంతే కాకుండా వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి, ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కల్పిస్తామని బీజేపీ నాయకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు బీజేపీ కి పూర్తి మెజార్టీ ఉంది. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక హోదా హామీ ని నిలబెట్టుకోవాలి. వైఎస్ జగన్ నాయకత్వంలో మేంఇప్పటి దాకా 2,3 సార్లు దీనిపై కేంద్రానికి వినతి పత్రం ఇచ్చాం. మా బాధ్యతగా దీనిపై పోరాటం చేస్తూ వస్తున్నాం’’అని ఆయన వివరించారు. ప్రస్తుతం విభజనతో రాష్ట్రం బాగా నష్టపోయింది కాబట్టి వెంటనే ఆదుకోవాలని ఆయన అన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉంది, రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అటువంటప్పుడు ప్రత్యేక హోదా కోసం కృషి చేయాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంది. లేదంటే తె లుగుదేశం, బీజేపీలన ప్రజలు క్షమించర ని మేకపాటి అన్నారు. ‘‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించింది. అసెంబ్లీలో విభజన వద్దని ఏకగ్రీవ తీర్మానం చేసినా కానీ వినిపించుకోలేదు. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ బిల్లు పాస్ చేయించారు. రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని అయినా అమలు చేసే పరిస్థితి లేదు’’అని ఆయన అన్నారు. మాట తప్పటం అన్నది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ బుట్టా రేణుక ... ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూ వస్తోందని వివరించారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నాయకత్వంలో ఎంపీలు అంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశాం. వినతి పత్రాన్ని సమర్పించాం. అనేక వేదికల మీద దీని కోసం పోరాడుతున్నాం. ఇక ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం.’’అని అమె అన్నారు. 

చంద్రబాబు దగ్గరుండి ప్రతిపక్ష నేతలను హత్యలు చేయిస్తున్నారు: వైఎస్ జగన్

అనంతపురం: ఏకపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జైల్లో ఉన్న పార్టీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ హత్యలు చేసిన వాళ్లను వదిలేసి, ఎమ్మార్వో కార్యాలయాన్ని ధ్వంసం చేశారంటూ గుర్నాథరెడ్డితో పాటు మరో 40మందిని అరెస్ట్ చేయటం అన్యాయమన్నారు. ఎమ్మార్వో కార్యాలయాన్నే హత్యా వేదికగా మార్చుకుని, ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఘటనల్లో ప్రమేయం ఉండటం దారుణమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సాక్షాత్తూ దగ్గరుండి ప్రతిపక్ష నేతలను హత్యలు చేయిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో భూమిరెడ్డి ప్రసాదరెడ్డి హత్య మొదటిది కాదని, గతంలోనూ విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని సింగిల్ విండో కార్యాలయానికి పిలిచి రాజీనామా చేయాలని సీఈవో స్వయంగా ఫోన్ చేశారని, అయితే అందుకు నిరాకరించిన విజయ్ భాస్కర్ను దారుణంగా హతమార్చారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భావోద్వేగానికి లోనై ప్రవర్తిస్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అని కూడా చూడకుండా జైల్లో పెట్టారని ఆయన అన్నారు. ఇటువంటి అన్యాయం ఎవరికైనా, ఎప్పుడైనా జరుగుతుందని ప్రజాస్వామ్యంలో మీడియా తన వంతు బాధ్యతగా గళం విప్పాలని వైఎస్ కోరారు.

11 May 2015

ఆర్టీసీని మూసేసే కుట్ర

2001లోనూ బాబు హయాంలో 24 రోజుల సమ్మె
రెండు నెలలుగా చర్చల పేరుతో తాత్సారం
ఇపుడు కేబినెట్ కమిటీ పేరుతో నాటకం
గుర్తింపు సంఘాల రద్దు బాబు మార్కు నిరంకుశత్వం
కార్మికులపై అంత కాఠిన్యం ఎందుకు?
సమ్మె చేస్తున్నందుకు నిందలు వేస్తారా?
పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నది మీరు కాదా?
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు మొండిగా వ్యవహరించడంలో మహా దిట్ట. ముఖ్యంగా రైతులు, కార్మికుల విషయంలో ఆయన ఎంత మొండిగానైనా వ్యవహరించగలరు. రైతులను రకరకాలుగా ఈసడించిన చంద్రబాబు ఇపుడు కార్మికులను అవే కళ్లతో చూస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఆయన మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతమవుతుంటే పరిష్కరించే దిశగా ఎలాంటి ఆలోచనలూ చేయని చంద్రబాబు సమ్మె చేస్తున్న కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం ఎక్కువగా వచ్చే సీజన్లో కార్మికులు ఉద్దేశపూర్వకంగా సమ్మెకు దిగారని ఆరోపణల వర్షం కురిపించారు.
 
అరెస్టులు.. బెదిరింపులు.. నిర్బంధం..
సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మాను ప్రయోగించిన చంద్రబాబు సర్కారు అక్కడితో ఆగలేదు. నిరసన ప్రదర్శనలు చేస్తున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను బెదిరిస్తున్నారు. విధులకు హాజరు కాకపోతే రెగ్యులర్ చేయబోమని, తొలగిస్తామని బెదిరిస్తూ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ల చేత ప్రకటనలు చేయిస్తున్నారు. మరోవైపు గతంలో సస్పెండయిన, తొలగించబడిన కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం ద్వారా సమ్మె చేస్తున్న కార్మికులకు చెక్ చెప్పాలనే పథకాలను చంద్రబాబు సర్కారు రచిస్తున్నది. తాత్కాలిక సిబ్బందిని నియమించి అద్దె బస్సులను తిప్పేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు సమ్మెను సాకుగా చూపిస్తూ చంద్రబాబు సర్కారు నిర్బంధాన్ని మరింత ఉధృతం చేసింది. ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నుగా ఉన్న కార్మిక సంఘాల గుర్తింపును రద్దు చేసింది. కార్మికుల వేతనాల నుంచి కార్మిక సంఘాల సభ్యత్వ రుసుం వసూలుకు స్వస్తి చెప్పింది. అంతేకాకుండా యూనియన్ కార్యకలాపాలలో ఉండే నేతలకు ఆన్‌డ్యూటీతో పాటు ఇతర సౌకర్యాలను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ఆర్టీసిని మూసేసే కుట్రలు
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలన్న సూత్రాన్ని చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇదే సూత్రాన్ని పాటించి ఆయన గతంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు మంగళం పాడేశారు. అలాగే ఆర్టీసీనీ ప్రయివేటీకరించేందుకు గత తొమ్మిదేళ్ల హయాంలో చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్న బస్టాండ్లు, ఇతర స్థలాలను అమ్మేయాలని, లేదా లీజుకివ్వాలని కూడా ఆయన ప్రయత్నించారు. ఇపుడు మరలా అదే కుట్రకు చంద్రబాబు తిరిగి పదును పెడుతున్నారు. అందుకే ఫిట్‌మెంట్ బెనిఫిట్ వ్యవహారంలో అంత మొండిగా వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ విషయంలో చంద్రబాబు సర్కారు రోజుకో డ్రామా అడుతోంది. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మెకు దిగితే మొండిగా వ్యవహరించడం, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామంటూ బెదిరించడం చూస్తుంటే కార్మికులపై చంద్రబాబుకు ఎటువంటి ప్రేమ ఉన్నదో అర్ధమౌతుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చి... రెండేళ్లుగా ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వకపోయినా వేచి ఉండి సంస్థ మనుగడ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇపుడు మొండి చేయి చూపడం సమంజసమేనా? ఆర్టీసీ కార్మిక సంఘాలతో రెండు నెలల నుంచి అనేక సార్లు రవాణాశాఖ మంత్రి చర్చలు జరిపారు. అదే విధంగా ఆర్టీసీ ఎండీ కూడా చర్చలు జరిపారు. ఇన్నాళ్లూ ఏమీ తేల్చ కుండా ఇపుడు కేబినెట్ సబ్ కమిటీ వేశామంటూ మాయమాటలు చెప్పడం చూస్తుంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం వల్లే నష్టాలు వస్తున్నాయంటూ సంస్థను మూసేసేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా?
ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్దేశించి పరుషమైన వ్యాఖ్యలు చేయడం సబబేనా..? టికెట్ల రేట్లు పెంచుకోవడం, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడం ద్వారా పే స్కేల్స్ ఇచ్చుకోండి అని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఆయన ఎంత నిర్దయగా మాట్లాడగలరో అర్ధమౌతుంది. సమయం చూసి సమ్మెకు దిగారంటూ చంద్రబాబు కార్మికులపై నిందలు వేస్తున్నారు. ఇపుడు సీజన్ కాబట్టి ఇపుడు సమ్మె చేస్తే సంస్థకు నష్టం వస్తుంది అని కార్మికులు ఉద్దేశపూర్వకంగా సమ్మెకు దిగినట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఈ వ్యవహారంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు ఫిట్‌మెంట్ బెనిఫిట్ గురించి అడుగుతున్నా తాత్సారం చేసింది ఎవరు? ప్రభుత్వం కాదా?
 
ఆర్టీసీని భ్రష్టు పట్టించిన చంద్రబాబు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995లో గద్దెనెక్కే నాటికి ఆర్టీసీ రు.45 కోట్ల లాభాల్లో ఉంది. 1994-95, 1995-96 లలో కూడా లాభాల్లో నడిచింది. లాభాల్లో ఉన్న ఆర్టీసీని దెబ్బ కొట్టడం కోసమే చంద్రబాబు నాయుడు సర్కారు ఆర్టీసీ నుంచి రూపాయి చార్జీకి 15శాతం పన్నులు వసూలు చేసింది. అదే విధంగా రాయితీ పాసులకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఆపేశారు. దాంతో ఆర్టీసీ 3 వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. దాని మీద వడ్డీలు కలుపుకుని రు.5 వేల కోట్లకు చేరుకుంది. దానికి ఇప్పటికీ 9.5శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. 2001 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 7 వరకు ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 రోజుల పాటు సమ్మె జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడి హయాంలోనే. ఆ సమయంలో కార్మికులు, కార్మిక నాయకులపై కేసులు పెట్టించి బయటి వ్యక్తులతో డ్యూటీ చేయిస్తే వారు ఆర్టీసీ సొమ్ము దోచేశారు. 

ఆర్టీసీలో బాబు ఘనకార్యాలు
  • తొమ్మిదేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారు
  • నష్టాల సాకుతో ప్రైవేటీకరించేందుకు విస్తృతంగా ప్రయత్నించారు.
  • రు. 480 కోట్ల మేర భారం వేశారు.
  • 1995లో అరకొరగా క్యాజువల్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్లరను తీసుకుని ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి బ్రేక్ వేశారు. క్యాజువల్ వర్కర్లను పర్మినెంట్ చేయరాదని చట్టం-2 ఆదేశాలు జారీ చేశారు.
  • వేతనాలు పెంచాలంటూ 24 రోజుల పాటు నిరవధికంగా సమ్మె చేసిన కార్మికులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వారిపై కేసులు పెట్టించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో 9.5శాతం పెంచి చేతులు దులుపుకున్నారు.
  • పదివేల మంది కార్మికులను ఇంటికి పంపారు. 
  • ఔట్ సోర్సింగ్ అనేక కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టడమే కాకుండా ఉద్యోగులను తగ్గించి ప్రైవేటుకు బాటలు పరిచారు. 
 
వైఎస్ హయాంలో లాభాల బాట
  • మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీ రు.117 కోట్ల లాభాలను ఆర్జించింది. 
  • ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని చంద్రబాబు హూంకరించడం వల్ల కార్మికుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని వైఎస్ తొలగించారు.
  • 2007, 2008, 2009 సంవత్సరాలలో కండక్టర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేశారు.
  • చంద్రబాబు చేసిన చట్టం - 2ను ఎత్తేసి 240 రోజుల సర్వీసు పూర్తి చేసిన 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయించారు.
  • వేతనాలు పెంచి ఉద్యోగుల మన్ననలు పొందారు.
  • వైఎస్ పాలనలో ఒక్కసారి కూడా ఆర్టీసీ చార్జీలు పెరగలేదు.
  • ఆర్టీసీ నష్టాల నివారణకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రు. 500 కోట్లు మంజూరు చేశారు.
  • పన్ను భారాన్ని రెగ్యులర్ సర్వీసులపై 12.5 నుంచి 7 శాతానికి, సిటీ సర్వీసులపై 10 నుంచి 5 శాతానికి తగ్గించి ఆర్టీసీకి రు. 250 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించారు.
  • పల్లె వెలుగు సర్వీసులు ప్రవేశపెట్టి ఆర్టీసీని గ్రామీణులకు దగ్గర చేశారు. 

రైతుల కోసం... రైతు కుటుంబాల కోసం..!

రైతుల కోసం, రైతు కుటుంబాల కోసం వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర చేప‌డుతున్నారు. అనంత‌పురం జిల్లాలో మొద‌టి విడ‌త ఐదు రోజుల పాటుయాత్ర జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ ఈ యాత్ర‌ను చేప‌డుతున్నారు. 

రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని చెప్పి చంద్ర‌బాబు నిలువునా మోసం చేశాడు. అటు రుణ మాఫీ కాక‌, తిరిగి బ్యాంకుల నుంచి అప్పులు దొర‌క్క  రైతులు ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్ర‌యించారు. ఈ లోగా బ్యాంకుల్లో అప్పులకు వ‌డ్డీల మీద వ‌డ్డీలు ప‌డ‌టం, ఇటు ప్రైవేటు వ్యాపారుల నుంచి తీసుకొన్న దానికి చ‌క్ర వ‌డ్డీలు ప‌డ‌టం జ‌రిగింది. దీంతో రైతులు పూర్తిగా అప్పుల్లో కూరుకొని పోయారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో కొంద‌రు రైతులు ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డ్డారు.

దీనిపై చ‌లించిపోయిన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మేలుకొని, రైతుల్ని ఆదుకోవాల‌ని కోరారు. దీనిపై స్పందించాల్సింది పోయి, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అడ్డంగా అబ‌ద్దాలు ఆడింది. ఎక్క‌డా రైతుల ఆత్మ‌హ‌త్య‌లు లేవ‌ని బుకాయించింది. దీంతో ప్ర‌జ‌ల త‌ర‌పున స్పందించిన వైఎస్ జ‌గ‌న్‌.. తాను రైతుల కోసం యాత్ర చేడ‌తానని, రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగిన ఇళ్ల‌కు వెళ్లి కుటుంబాల్ని ప‌ల‌క‌రించి వ‌స్తాన‌ని చెప్పారు. అన్న‌ట్లుగానే అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత రైతు భ‌రోసా యాత్ర చేపట్టారు. అప్ప‌ట్లో 11 రైతు కుటుంబాల్ని ప‌రామ‌ర్శించారు.

ఇప్పుడు మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర చేప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌చ్చ‌చొక్కాల గూండాల చేతిలో హ‌త‌మైన ప్ర‌సాద్ రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు. త‌ర్వాత అదే జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్న రైతు కుటుంబాల్ని ప‌రామ‌ర్శిస్తారు.

10 May 2015

నవ్వి పోదురు గాక, నాకేంటి సిగ్గు..!

విముక్తి యాత్రకు సిద్ద పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు రుణాల బాధ లేదంటూ ప్రచారం
రైతుల్ని మళ్లీ ఊరించి, మోస పుచ్చేందుకు ప్రయత్నం
 
అప్పుల బాధతో అల్లాడుతున్న వ్యవసాయదారులు
ఏకంగా సీఎం సభలోనే ఆత్మాహత్యకు యత్నించిన రైతు
పీకల్లోతు కూరుకొని పోయిన అన్నదాతలు
 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రుణ విముక్తి యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారుల బృందాలు  ఊరూరా పర్యటించనున్నాయి. ఇప్పటికే రుణాలన్నీ తీరిపోయి  ఉంటాయని, ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ సమస్యలు తీరుతున్నాయని చెప్పటమే దీని ఉద్దేశ్యం. అయితే రుణమాఫీ మీద ఎవరికైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. దీంతో  రుణ మాఫీ మీద పచ్చ మార్కు నాటకంలో మరో అంకానికి తెర లేచినట్లయింది. 
 
అదిగదిగో రుణ మాఫీ
‘బాబు వస్తాడు, మీ అప్పులన్నీ మాఫీ అయిపోతాయి’.....  ‘మన ప్రభుత్వం వచ్చేస్తోది, అప్పులేవీ క ట్టకండి’..... ‘అదిగ దిగో తెలుగుదేశం ప్రభుత్వం, ఇదిగిదిగో రుణాల మాఫీ’ అంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. కింద మీద పడి కొద్దో గొప్పో అప్పులు కడదామనుకొన్న రైతులు కూడా ఆ ప్రచారం తో ఆగిపోయారు. పూర్తిగా నమ్మిన రైతులు పెద్ద ఎత్తున ఓట్లేసి చంద్రబాబును గెలిపించారు. అధికారం అప్పగించారు. 
మొదటి రోజు సంతకాలు  కూడా రుణమాఫీ మీద అనేసరికి రైతులకు, డ్వాక్రా మహిళల ఆనందానికి అంతే లేకుండా పోయింది. త్వరలోన రుణమాఫీ జరిగిపోతుందని కలలు కన్నారు. తీరా చూసి, రోజులు గడిచాయి, వారాలు మారాయి, నెలలు పూర్తయ్యాయి. రుణమాఫీ చేయకుండానే చంద్రబాబు పాలన సాగిపోతోంది. ఈ లోగా బ్యాంకర్లు తమ తడాఖా చూపించసాగారు. అప్పులు తీర్చకుండా ఆగినందుకు వడ్డీల మీద వడ్డీలు విధించుకొంటూ పోయాయి. దీంతో ఇవ న్నీ రైతుల నెత్తిమీద పిడుగులా పడ్డాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన మొదటి బ్యాంకర్ల సమావేశంలో అప్పుల పరిస్థితిని బయట పెట్టారు. 2014 మార్చి నెలాఖరు నాటికి రూ.87, 612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల మేర డ్వాక్రా రుణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ మేరకు నిధులు ఇచ్చి నట్లయితే రుణాల్ని మాఫీ చేయటం జరుగుతుందని స్పష్టం చేశాయి. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడ లేదు.  మొదటి విడత రుణ మాఫీ కింది అర కొర మాత్రమే విదిల్చారు. ఈలోగా అప్పులన్నీ కలిసి రూ. 99 వేల కోట్లకు చేరిపోయాయి. అంటే దాదాపుగా లక్ష కోట్లయిపోయాయి. కానీ ప్రభుత్వం మొదట్లో ఇచ్చింది మాత్రం రూ. 4,664  కోట్లే. అంటే దాదాపు 5శాతం వరకే అనుకోవచ్చు. దీంతో రైతులకు పెద్దగా లాభం లేక పోయింది. 
 
కష్టాల కొలిమి
రుణ మాఫీ అందక పోవటంతో రైతుల పరిస్థితి కష్టాల్లో పడ్డట్లయింది.  ఎలాగు బాబు వచ్చాడు కాబట్టి అప్పులన్నీ తీరిపోయినట్లే అని భావించారు. కానీ అప్పుల తాలూకు డబ్బులేవీ రాలేదు. అప్పులు అలాగే ఉన్నాయి. బ్యాంకులు మాత్రం వడ్డీల మీద వడ్డీలు వేసేశాయి. దీంతో మళ్లీ పెట్టుబడుల కోసం బ్యాంకుల దగ్గర కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. {పైవేటు వ్యాపారుల దగ్గరకు వెళ్లి నూటికి 4,5 రూపాయిల వడ్డీకి అప్పులు తెచ్చుకోవలసి వచ్చింది. ఒక వైపు అప్పులు తీరక, మరో వైపు కొత్త అప్పులు మీద చక్ర వడ్డీలు పేరుకొని పోయి... ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితి చితికి పోయినట్లయింది. 
అటు బ్యాంకుల దగ్గరకు వెళ్లి తిరిగి అప్పు పొందలేని పరిస్థితి. అంతెందుకు.. గడచిన ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ. 56, 019 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొంటే అయిదో వంతు మేర కూడా లక్ష్యాల్ని దాటలేదు. ఖరీఫ్ నాటికి కేవలం రూ. 7,263 కోట్ల మేర మాత్రమే అప్పులు ఇవ్వగలిగారు. దాదాపు మెజారిటీ రైతులు అప్పులు తీసుకోలేక బ్యాంకులకు దూరంగా ఉండిపోయారు. పైగా అప్పుల్ని రీ షెడ్యూల్ చేసుకోక పోవటంతో పంట బీమా వంటి ప్రయోజనాలకు కూడా దూరంగా ఉండిపోయారు. ఈలోగా బంగారం మీద తీసుకొన్న రుణాలకు గడువు తీరిపోవటంతో వేలం వేస్తున్నట్లుగా బ్యాంకులు నోటీసులు ఇవ్వసాగాయి. దీంతో వాటిని విడిపించుకొనేందుకు మరో సారి ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తేవటంతో పూర్తిగా మునిగిపోయారు. 
 
మహిళల కంట కన్నీరు
డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అని ఊరించారు. అప్పటి దాకా పొదుపు చేసుకొంటూ డ్వాక్రా రుణాలు తెచ్చుకొనే వారు. వాటిని తీర్చుకొంటూ ముందుకు వెళితే పావలా వడ్డీ రుణాలువంటి ప్రయోజనాలు దక్కేవి. కానీ చంద్రబాబు మాటలు నమ్మి అప్పులు కట్టక పోవటంతో ఈ ప్రయోజనాలన్నీ పక్కకు పోయాయి. కానీ పొదుపు సంఘాల్లోని కొందరైనా కడదామని ప్రయత్నించినా, మొత్తం సంఘం పేరు మీద బకాయిలు ఉండిపోవటంతో అప్పులు అలాగే పేరుకొని పోయాయి. తర్వాత కాలంలో బ్యాంకుల నుంచి ఒత్తిడి పేరుకొనిపోవటంతో పొదుపు సంఘాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు పొదుపు సంఘాల పని తీరులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా పేరు ఉండేది ఇప్పుడు కాస్తా అదోగతి పాలైంది. 
 
ఫిర్యాదుల కేంద్రం పనితీరు
వ్యవసాయ రుణాలకు సంబంధించి రుణ మాఫీ కాని వారి సంఖ్య లక్షల్లో ఉండటంతో ఫిర్యాదులు అంతకంతకూ పెరిగిపోసాగాయి. బ్యాంకర్లను అడిగితే రెవిన్యూ అధికారుల్ని అడగమనటం, రెవిన్యూ అధికారుల్ని అడిగితే వ్యవసాయ అధికారుల్ని అడగమనటం, వ్యవసాయ అధికారులు తిరిగి బ్యాంకర్ల దగ్గరకు పంపిస్తూ కాలక్షేపం చేశారు. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోవటంతో రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకొనేందుకు ఒక కంప్లయింట్ సెల్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఎటువంటి వివరాలు అందించే పరిస్థితి లేకపోయింది. రోజు రోజుకి అక్కడకు వచ్చే రైతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటం, రాజధానిలో ఉండే మీడియా దీని మీద కథనాలు రాయటంతో పరిస్థితి వేడెక్కింది. 
దీంతో రైతులంతా ఫిర్యాదుచేయాలంటే హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు తెరిచారు. అక్కడ కూడా వచ్చిన ఫిర్యాదులో లోపాలు వెదికేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న మాట వినిపిస్తోంది. రుణమాఫీ అందలేదంటూ చెప్పిన రైతుల సమస్యలు తెలుసుకొని రుణ మాఫీ చేసేలా ప్రయత్నించే యంత్రాంగం ఏదీ లేనే లేదు. దీంతో ఈ ఫిర్యాదు కేంద్రాలన్నీ తూతూ మంత్రం అన్న మాట అర్థం అయిపోయింది. దీంతో రైతుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొంటున్నాయి. 
 
అధికార పక్షానికి సెగ
బాబు వస్తాడు, రుణమాఫీ జరుగుతుంది అని నమ్మించిన తెలుగుదేశం శ్రేణుల్ని ఎక్కడకికక్కడ రైతులు నిలదీయటం మొదలెట్టారు. రుణమాఫీ చేయలేకపోతే చేయలేం అని చెప్పాలి కానీ ఇలా ముంచేయటం మంచిది కాదని మండిపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. పైగా రుణమాఫీఅంతా ఆన్ లై న్ లో కాబట్టి ఎవరెవరకు రుణమాఫీ అవుతోందో, ఎవరకి కావటం లేదో ఏమాత్రం చెప్పలేని పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న పార్టీ సమావేశంలో విశాఖపట్నంలో పార్టీ నేతలు స్వయంగా సీఎంకే మొర పెట్టుకొన్నారు. ఊళ్లలోకి వెళ్లలేక పోతున్నామని, కనిపిస్తే చాలు రుణమాఫీ మీద ప్రశ్నిస్తున్నారని వాపోయారు.
  
కొత్త కుట్రకు తెర
రైతులు రగిలిపోతున్నారన్న సంగతి గ్రహించిన ప్రభుత్వం కొత్త కుట్రకు తెర దీసింది. ఈ రుణ మాఫీ నేరాన్ని అధికార యంత్రాంగం మీదకు నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. బ్యాంకర్లు సరైన అంశాలు నమోదు చేయలేదని, వ్యవసాయ రెవిన్యూ యంత్రాంగం సరైన వివరాలు సమర్పించలేదని జవాబులు వినిపించ సాగారు. అటూ ఇటూ చేసి రుణ మాఫీ అందకపోతే ఆ తప్పంతా అధికారులది అని, ఒక వేళ అర కొరగా రుణమాఫీ అయితే మాత్రం ఆ ఖ్యాతి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానిది అని చెప్పే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా విముక్తి యాత్ర లకు శ్రీకారం చుట్టారు. అంటే రుణమాఫీ మీద ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఇందులో చేసుకోవ చ్చని చెప్పారు. హైదరాబాద్ లో రుణమాఫీ ఫిర్యాదుల అంశం అయిపోయింది, జిల్లాకేంద్రాల్లో రుణ మాఫీ అంశం అయిపోయింది. ఇప్పుడు ఊరూరా విముక్తి యాత్రల దగ్గరకు వచ్చారు. ఫిర్యాదులు ఎక్కడ ఇచ్చినా, అందులోని లోపాల్ని చెప్పి అధికార యంత్రాంగాన్ని బాధ్యుల్ని చేసేందుకే  ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ రుణ విముక్తి యాత్రల్ని సంకల్పించారన్న మాట బలంగా వినిపిస్తోంది. 

ఇందులో భాగంగా ప్రతీ చోట ప్రభుత్వం చేస్తున్న పనుల్ని చాటుకొనే ప్రయత్నం జరుగుతోంది. అయితే రుణమాఫీ కి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే మాత్రం దాన్ని స్థానిక యంత్రాంగం మీదకు నెట్టేసి చేతులు దులిపేసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ రుణ విముక్తి యాత్రను ఇప్పటికిప్పుడు రూపొందించినట్లు తెలుస్తోంది. పైగా రుణమాఫీ మీద ఫిర్యాదులు తీసుకొని క్రమంగా వీటిని చెట్టు ఎక్కించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రుణ మాఫీ మీద రూపొందిస్తున్న కొత్త నాటకం ఎటు తిరిగి ఎటువస్తుందో వేచి చూడాలి. 

9 May 2015

ఆర్టీసీ సమ్మెపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు జగన్ బహిరంగ లేఖ

ఆర్టీసీ సమ్మె కారణంగా కోట్లాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం ద్వారా సమ్మెకు వెంటనే స్వస్తి పలకాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది....

ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే విధంగా నేరుగా కార్మిక సంఘాలతో తక్షణం చర్చలు జరిపి సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నా. కార్మికుల మీద ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను, రెచ్చగొట్టే ప్రకటనలను, పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆర్టీసీ కార్మికులు సమ్మె వరకు రావటంలో నాలుగు రోజులుగా సమ్మె కొనసాగటంలో తమ పాత్రను గుర్తించాల్సిందిగా ఇరువురు ముఖ్యమంత్రులకూ విజ్ఞప్తి చేస్తున్నాను. నాయకులు గతంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఆ ప్రయత్నం చేయకపోవటం వల్లే రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారన్న నిజాన్ని మా పార్టీ గుర్తిస్తోంది. ఈ విషయంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లకు మద్దతుగా శాంతియుతమైన వారి ప్రత్యక్ష కార్యాచరణలో వైఎస్సార్ కాంగ్రెస్ భాగం పంచుకుంటుంది. అలా భాగం పంచుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాను.

2014 ఏప్రిల్ 6న శ్రీ చంద్రబాబునాయుడు స్వయంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం అని ఇచ్చిన హామీని కూడా ఆయన నిలబెట్టుకోవాలి. ఆర్టీసీ నష్టాలకు తన బాధ్యత ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలి. కేవలం ప్రైవేటు వాహనాల కారణంగా ఏపీఎస్‌ఆర్‌టీసీకి ఏటా రు.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని తెలిసినా వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. డీజిల్ మీద వ్యాట్ రూపంలోనే ఆర్టీసీ ఏడాదికి రు.541 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి. అలాగే, విడి భాగాల కొనుగోలు మీద చెల్లించేది మరో రు. 150 కోట్లు. వ్యాట్ భారాన్ని ఏపీ రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేస్తే ఆర్టీసీ దర్జాగా బతుకుతుందని తెలిసినా చంద్రబాబు నాయుడుగారు ఆ పని ఎందుకు చేయటం లేదో ప్రజలకు చెప్పాలి. వ్యాట్‌ను రద్దు చేసి, ప్రైవేటు రవాణాను అరికట్టగలిగితే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న జీతాలు ఇవ్వటం పెద్ద సమస్య కాదని ప్రజలందరికీ అర్ధమౌతోంది. అలాగే, తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ మీద వ్యాట్‌పై వెంటనే వెనక్కు తగ్గాలి.

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన ఆర్టీసీని ప్రైవేటీకరించే ఎత్తుగడలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. సమ్మె కారణంగా కోట్లాది ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం ద్వారా వెంటనే స్వస్తి పలకాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

మనసు లేని పాలకుడు


అన్నదాతలంటే బాబుకు ఎప్పుడూ చిన్నచూపే
కళ్లెదుటే రైతు ఆత్మహత్యా యత్నం
అయినా పట్టించుకోని వైనం
కనీసం అధికారులను పురమాయించరా?
మంచి వైద్యం అందించాలని ఆదేశించరా...

అన్నదాతలంటే నారా చంద్రబాబునాయుడుగారికి ఎప్పుడూ చిన్నచూపే.. వ్యవసాయం దండగ అని సూత్రీకరించిన చంద్రబాబుకు రైతులంటే దండగమారిగానే కనిపించడం సహజమే కదా. అంతేకాదు గతంలోనూ అనేక సందర్భాలలో రైతులను ఆయన ఈసడించారు. సహకార సంఘాల బకాయిలు కట్టని రైతులకు సంకెళ్లు వేయించారు. ఆస్తులు, ఇళ్లు జప్తులు చేయించారు. కరెంటు బిల్లులు కట్టకపోతే మోటార్లు పీకించారు. కరెంటు చార్జీల భారం మోపి నడ్డి విరగ్గొట్టారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరిహారం కోసం చనిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇపుడు కళ్లెదురుగా ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టనట్టు ఊరుకున్నారు. ఇలాంటి మనసులేని పాలకుడు భూతద్దం వేసి వెదకినా ప్రపంచంలో మరెక్కడా కనిపించరు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లానర్సీపురం సభలో రైతులకు, డ్వాక్రా మహిళలకు తాను ఎంతో చేశానని, రైతుల రుణాలు మాఫీ అయిపోయాయని, డ్వాక్రా మహిళలను కూడా ఆదుకుంటామని చెబుతున్న సమయంలోనే రాము అనే రైతు అదే ముఖ్యమంత్రి సాక్షిగా పురుగు మందు తాగాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెతు పురుగుమందు తాగటాన్ని చంద్రబాబు చూడలేదా? అంటే చూశారు. దగ్గర నుంచి కాకపోయినా వేదిక మీద నుంచి ఆయనకు అర్థం అయ్యింది. వెంటనే చంద్రబాబు ఏం అన్నారో అన్ని టీవీల్లోనూ వచ్చింది. ఏం లేదు... ఏం లేదు... కూర్చొండి.. కూర్చొండి... అంటూ చంద్రబాబు సర్దేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసులు, అధికారులు అంతా తలో చెయ్యి వేసి రైతు ఆత్మహత్యా ప్రయత్నాన్ని తగ్గించి చూపేందుకు ఎవరి ప్రయత్నం వారు చేశారు. నిన్న, ఈరోజు కూడా తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఛానెళ్ళు ఈ విషయాన్ని మరుగుపరచటానికి లేదా తక్కువ చేసి చూపటానికి విశ్వ ప్రయత్నం చేశాయి. అదే రాజశేఖరరెడ్డిగారి సభలోనో, జగన్ మోహన్ రెడ్డిగారి సభలోనో ఇలాంటి సంఘటనే జరిగి ఉంటే ఇదే మీడియా ఎలా స్పందించేదో అందరికీ తెలుసు. 
ఆత్మహత్య చేసుకుంటున్నా చలించరా..?
కళ్ళ ఎదురుగ్గా ఒక రైతు పురుగు మందు తాగినా, అతని నోటి వెంట నురగ వస్తున్నా... చంద్రబాబు గారు చలించలేదు. అయ్యో అనలేదు. స్టేజీ దిగి రాలేదు. కనీసం... ఆ రైతు బతికాడా.. చచ్చాడా.. అని కూడా కనుక్కోలేదు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని అధికారులను ఆదేశించలేదు. వైద్య సిబ్బందికి కూడా చెప్పలేదు. మరేం చెప్పారు? ఏం లేదు... ఏం లేదు... కూర్చొండి.. కూర్చొండి.. అని చెప్పారు. తన కళ్ళ ఎదుట రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా చలించని ఈ పెద్ద మనిషికి మానసిక లోపం అన్నా ఉండి ఉండాలి. లేదా రైతుల మీద చిన్నచూపు అయినా ఉండి ఉండాలి. రైతుల సమస్యల మీద చిన్నచూపు ఉండబట్టే- గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రైతులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వ్యవసాయం దండగ అన్నారు. ఒకసారి మీ పంటలన్నీ ఎండిపోతే తప్ప మీకు బుద్ధి రాదు అన్నారు. రెండో పంట మిమ్మల్ని ఎవరు వేయమన్నారని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. వ్యవసాయానికి అనుమతి లేకుండా కరెంటు వాడుకున్న రైతుల్ని దొంగలుగా సంబోధిస్తూ మరో దేశంలో అయితే ఇలాంటి వారిని ఉరి తీసేవారు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రైతు తన కళ్ళ ఎదుట ఆత్మహత్యాయత్నం చేస్తే ఏం లేదు... ఏం లేదు... కూర్చొండి.. కూర్చొండి.. అని చెప్పాడు. 
రైతు ఆక్రందనలు... సర్కారు వారి బూటకపు ప్రకటనలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి బ్యాంకు రుణాలు రూ. 87 వేల కోట్లు అయితే, ఇప్పుడు అవి రూ. 97 వేల కోట్లకు పెరిగాయి. అయినా ఏం లేదు.. ఏం లేదు..  రుణ మాఫీ చేసేశానని చెబుతున్నాడు. విజయ యాత్రలు చేస్తానంటున్నాడు. తన మెడలో దండలు వేసి శాలువాలు కప్పి సన్మానించాలన్నట్టు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. అలాగే తుళ్ళూరు రైతులు, సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న గ్రామాల రైతులు ఆక్రందనలు చేస్తుంటే తమ పొలాలు ఇవ్వం అని చెబుతుంటే- ఏం లేదు.. ఏం లేదు... అందరూ ల్యాండ్ పూలింగ్‌కు పొలాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారంటూ తన అధికారులు, పోలీసుల ద్వారా రైతుల మెడపై తుపాకీ పెట్టి మరీ బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ల్యాండ్ పూలింగ్ డ్రామా కొనసాగించారు. ఇప్పుడు ఆ రైతులంతా తమ భూములు తమకు ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు ఎక్కుతున్నారు. వాస్తవానికి ఈ 11 నెలల పరిపాలనలో ఏముంది అంటే- తెలుగుదేశం పార్టీకి తెలిసో, తెలియకో ఓటు వేసినవారంతా ఏం లేదు... ఏం లేదు.. అని చెప్పే పరిస్థితి వచ్చింది. 
ఆత్మహత్యలు... హత్యలే 11 నెలల ఘనత
ఈ 11 నెలల పరిపాలనలో ఏముంది అంటే- ఆత్మహత్యలు ఉన్నాయి. ప్రభుత్వమే, ముఖ్యమంత్రే శ్రద్ద తీసుకుని చేయించిన హత్యలు ఉన్నాయి. రైతులకు చరిత్రలో ఏనాడు లేనంత అప్పులు ఉన్నాయి. డ్వాక్రా మహిళల ఉద్యమం సర్వనాశనమై డ్వాక్రా సంఘాలకు పీకలలోతున అప్పులు ఉన్నాయి. నేతన్నలకు రుణ మాఫీ కాక ఆకలిదప్పులు ఉన్నాయి. లోకేష్‌కు, నారాయణకు, సుజనా చౌదరికి, సీఎం రమేష్‌కి, మురళీ మోహన్‌కి, నారా భువనేశ్వరికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న పచ్చ తమ్ముళ్ళకు మాత్రం సగటు పౌరుడితో పోలిస్తే లక్ష రెట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ 11 నెలల పరిపాలనలో ఈ సమాజంలోని రైతులకు, మహిళలకు, నేతన్నలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, మధ్యతరగతికి, నిరుద్యోగులకు, కూలీలకు, అసంఘటిత కార్మికులకు.... ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో దాదాపు 300 వగ్దానాలు చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ 11 నెలల కాలంలో అమలు కాలేదు. ఈ విషయం అందరికంటే బాగా తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబుకు తెలుసు. ప్రజలను మేనేజ్ చేయలేమని కూడా తెలుసు. 
నిజాలకు ముసుగేస్తారా?
అందుకే చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ అధికార బలాన్ని, ధన బలాన్ని, మీడియా బలాన్ని ఉపయోగించి నిజాలకు ముసుగులు కప్పుతోంది. విజయనగరం జిల్లాలో రైతు ఆత్మహత్యా ప్రయత్నం, ఆ సమయంలో చంద్రబాబు ప్రవర్తన అన్నవి చాలా తీవ్రమైన అంశాలు. మనసు లేని పాలకుడు మరో నాలుగేళ్ళు రాజ్యాధికారం కొనసాగిస్తే తెలుగు తల్లి బిడ్డలు ఇంకెన్ని కష్టాలు, నష్టాలు, కడగండ్లు ఎదుర్కోవాలో, ఇంకెన్ని ఆత్మహత్యలు, అరాచకాలు చూడాలో అని ఆలోచన గల ప్రజలంతా ఆందోళన చెందుతున్న సమయం ఇది. 

8 May 2015

లోకేష్ అమెరికా టూర్ లోని రహస్యం ఇదే..!

అమెరికాలో అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుస్తారంటూ వార్తలు
అప్పాయింట్ మెంటు ఖరారైందని పచ్చ మీడియాలో కథనాలు
ఒబామా అప్పాయింట్ మెంటుకు డబ్బులు కట్టిన చినబాబు..?
ఫండ్ రైజింగ్ పార్టీ ని ప్రత్యేక అప్పాయింట్ మెంట్ గా పచ్చ మీడియా కవరేజ్
 
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అమెరికా పర్యటనలో ఒక సీక్రెట్ బయట పడింది. అమెరికా అధ్యక్షుడు బ రాక్ ఒబామా ను లోకేష్ కలుస్తున్నారని, ఇందుకు అప్పాయింట్‌మెంట్ ఖరారు అయిందని వార్తలు వెలువడ్డాయి. దీనికి ఎప్పటిలాగే పచ్చ మీడియా బ్రాండింగ్ కలరింగ్ ఇచ్చేసింది. ఇంకేముంది... చినబాబు అమెరికా అధ్యక్షుడ్ని కలవబోతున్నారు, ఆయన తప్పకుండా చంద్రబాబు పాలన గురించి, రాజధాని నిర్మాణం గురించి ఆరా తీస్తారు అన్న రీతిలో కలరింగ్  ఆపాదించారు.

ఇక్కడే అసలు గమ్మతు ఇమిడి ఉంది. వాస్తవానికి అమెరికాలో ఒబామాను లోకేష్ కలుస్తున్నది ఈ నెల ఏడున, పోర్టులాండ్ లో ..! ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ఒబామా అదే నగరంలో పర్యటిస్తున్నారు. అక్కడి సెంటినెల్ హోట ల్ లో డెమక్రాటిక్ పార్టీ ఏర్పాటు చేసిన నిదుల సేకరణ పార్టీలో పాల్గొంటున్నారు. ఇందులో అందరికీ ప్రవేశం లభిస్తుంది.

అమెరికాలో ఒక సంస్కృతి ఉంది. ఎన్నికల ముందు విరాళాల సేకరణకు రక రకాల మార్గాలు అవలంబిస్తారు. అంటే అధ్యక్షుడు పార్టీ విరాళాల సేకరణలో పాల్గొనే పార్టీలకు రక రకాల టిక్కెట్లు అందుబాటులో ఉంచుతారు. 500 డాలర్లు కడితే డిన్నర్ లోకి ప్రవేశం దక్కుతుంది, ఐదు వేల డాలర్ల టికెట్ తీసుకొంటే ఫోటో తీయించుకోవచ్చు. పదివేల డాలర్ల టికెట్ తీసుకొంటే ఒబామాతో చిన్న పాటి మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి అనుమతిస్తారు. అదండీ సంగతి. అంటే ఆ డబ్బు పెట్టి టికెట్ తీసుకొంటే ఒబామాతో భేటీకి అనుమతి లభిస్తుంది.

ఇప్పుడు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నది కూడా ఇదే భేటీకి...! అంటే టికెట్ పెట్టి కొనుక్కొన్న భేటీకి బ్రాండింగ్ ఇవ్వటంలో పచ్చ మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ టికెట్లు ఎవరికైనా ఇస్తారని, డబ్బు ెపట్టి కొనుక్కొంటే దొరికి పోతుందని బయటకు చెప్పరు. అసలు ప్రభుత్వ పరంగా ఏ హోదా లేకుండా లేదా భారత దేశం తరపున ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఒక వ్యక్తి  ప్రైవేటుగా అమెరికా వెళితే అక్కడ అధ్యక్షుడు అపాయింట్ మెంట్ ఎందుకు దొరకుతుంది అన్న మాటను బయటకు చెప్పటం లేదు.

అంటే ఈ పార్టీకి ఎవరైనా డబ్బులు కట్టవచ్చు. డబ్బులు కడితే ఎవరికైనా ఈ అవకాశం దక్కుతుంది. డిన్నర్ పార్టీకి డబ్బులు కట్టి తెచ్చుకొన్న అవకాశానికి సొంతంగా అపాయింట్ మెంట్ దొరికిందన్న కలరింగ్ ఇచ్చేశారు. మొన్నటి ఎన్నికల ముందు ఢిల్లీలో ఆప్ పార్టీ ఈ తరహా పార్టీలు పెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. అటువంటి దాని గురించి ఇంతటి హడావుడి చేయటం అన్నది పచ్చ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య.

బహుశా ఈ నెల ఏడో తేదీ ఉదయం నుంచి పచ్చ మీడియా టీవీ చానె ల్సు లో ఒబామాతో బేటీ కానున్న చినబాబు అంటూ బ్రేకింగ్ న్యూస్ లు నడుపుతారు. తర్వాత రోజు లోకేష్ ను అభినందించిన ఒబామా లేదంటే చంద్రబాబు పాలనా తీరుని చూసి ముగ్దుడైన ఒబామా లేదంటే రాజధాని నిర్మాణ పనుల్ని ఆదర్శంగా తీసుకొంటానన్న ఒబామా అంటూ పతాక శీర్షికలు ప్రచురిస్తాయోమో..! ఈ విషయం పూర్తి గా ప్రజలకు తెలిస్తే మాత్రం ఈ మోతకు కాస్త బ్రేకులు పడతాయి.